సొమ్ములు సంగతి తెలిసి కూడా సొల్లు కబుర్లేంటి తమ్ముళ్లూ?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలకు ఎప్పుడూ కొదవ ఉండదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఇందుకు ఏ రాజకీయ పార్టీ అతీతం కాదు. విపత్తు సమయంలోనైనా ఏపీ రాజకీయ [more]

Update: 2020-04-03 11:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలకు ఎప్పుడూ కొదవ ఉండదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. ఇందుకు ఏ రాజకీయ పార్టీ అతీతం కాదు. విపత్తు సమయంలోనైనా ఏపీ రాజకీయ నేతలు పాలిటిక్స్ కే ప్రాధాన్యత ఇస్తారు. ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా కన్పిస్తుంది. ఢిల్లీ నుంచి వచ్చి,న వారితో ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. గత పన్నెండు రోజుల నుంచి లాక్ డౌన్ అమలులో ఉండటంతో ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయమూ రావడం లేదు. ఈ విషయం టీడీపీకి తెలియంది కాదు. గత ఐదేళ్ల పాటు పాలించిన టీడీపీకి రాష్ట్ర ఆర్థిక స్థితి ఏంటో తెలుసు.

ఉద్యోగుల వేతనాలు వాయిదా….

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జగన్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదారులకు చెల్లించాల్సిన వేతనాలను వాయిదా వేసింది. తొలుత యాభై శాతం ఇచ్చి మిగిలిన యాభై శాతం వేతనాన్ని మరో విడతలో ఇవ్వాలని నిర్ణయించింది. పొరుగునే ఉన్న తెలంగాణలో వాయిదా కాకుండా ఏకంగా కోత విధించారు. ఈ విషయం టీడీపీకి తెలియంది కాదు. అయినా ఉద్యోగుల వేతనాలను వాయిదా వేయడమేంటని ప్రశ్నిస్తుంది.

కాంట్రాక్టర్లకు బిల్లులు….

దీనికి తోడు జగన్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు 6,400 కోట్లు బిల్లులు విడుదల చేసినట్లు ఆరోపిస్తుంది. ముఖ్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ జగన్ మానసిక స్థితి బాగాలేదని ట్వీట్ చేశారు. ఆర్థిక పరిస్థతి బాగానే ఉన్నా జీతాలకు వాయిదా పద్ధతి ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ తమ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, ఆదుకోవాలని ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు కూడా. అయినా టీడీపీ మాత్రం తమ విమర్శలను మాత్రం వదిలిపెట్టడం లేదు.

పక్కదోవ పట్టించడానికే….

రెండు రోజుల్లో కాంట్రాక్టర్లకు 6,400 కోట్లు చెల్లించే సీన్ లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో ముందుండే టీడీపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలసిి కూడా ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఇలాంటి విమర్శలకు దిగుతుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రేపటి నుంచి ప్రతి పేద కుటుంబానికి వెయ్యి రూపాయల నగదును ప్రభుత్వం చెల్లిస్తుంది. దీనికి దాదాపు 1300 కోట్ల రూపాయలు అవసరం. అయితే దీనిని పక్క దోవ పట్టించడానికే టీడీపీ ఎల్లో మీడియా ద్వారా విష ప్రచారానికి దిగుతుందన్నది వైసీపీ ఆరోపణ. మొత్తం మీద ఏపీలో రెండు పార్టీలు కరోనా విలయతాండవం చేస్తున్నా రాజకీయాలను మాత్రం వదిలిపెట్టడం లేదు.

Tags:    

Similar News