మూడు నెలల్లోనూ ముగ్గురూ….?

2014 పొలిటికల్ సీన్ రిపీట్ అవుతుందా? ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ అదే జరగబోతోందా? అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అదేనని స్పష్టంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో జగన్ [more]

Update: 2019-08-25 12:30 GMT

2014 పొలిటికల్ సీన్ రిపీట్ అవుతుందా? ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ అదే జరగబోతోందా? అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అదేనని స్పష్టంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాలేదు. అప్పుడే మూడు పార్టీలూ ఒక్కటైనట్లు కన్పిస్తున్నాయి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు అధికార పక్షంపై విరుచుకుపడుతున్నాయి. ప్రస్తుతానికి వేర్వేరుగా విమర్శలు చేస్తున్నప్పటికీ ఐక్యంగా జగన్ పై యుద్ధం ప్రకటించే సమయం ఎంతో దూరం లేదనిపిస్తోంది.

ఆ ఎన్నికల్లో ముగ్గురూ….

2014లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నేరుగా మద్దతు పెట్టుకోగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయకుండా మద్దతు తెలిపారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఇటు మోదీ క్రేజ్, అటు పవన్ కల్యాణ్ ఇమేజ్, చంద్రబాబుపై నమ్మకంతో అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చింది. అయితే అతి కొద్ది తేడాతో అప్పుడు జగన్ పార్టీ ఓటమి పాలయింది. 2019 ఎన్నికలకు వచ్చే సరికి బీజేపీ, తెలుగుదేశం, జనసేనలు విడివిడిగా పోటీ చేయడంతో జగన్ పార్టీకి అడ్వాంటేజీ అవ్వడమే కాకుండా సునామీలా వచ్చి జగన్ సర్కార్ కొలువుదీరింది.

ఒకే గొంతుకతో…..

జగన్ సర్కార్ ఆంద్రప్రదేశ్ లో ఏర్పడి మూడు నెలలు కాలేదు. అయితే జగన్ ప్రతి నిర‌్ణయంపైనా విపక్షాలన్నీ ఏకమవుతున్నట్లే కన్పిస్తుంది. ఇప్పటికే రాజధాని అమరావతి విషయంలో మూడు పార్టీల గొంతు ఒక్కటేలా ఉంది. భారతీయ జనతా పార్టీ అయితే ఒకడుగు ముందుకేసి చంద్రబాబు అవినీతిని ఇంతవరకూ బయట పెట్టలేకపోయిందని విమర్శలు గుప్పిస్తోంది. ఇక రాజధానిని తరలిస్తే తాము ఊరుకునేది లేదని హెచ్చరిస్తోంది. తెలుగుదేశం పార్టీ కూడా రాజధానిపై పోరాటానికి సిద్ధమయింది.

చేయి చేయి కలుపుతారా..?

పవన్ కల్యాణ‌్ పార్టీ జనసేన వైసీపీపై న్యాయపోరాటానికి దిగుతోంది. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగంపై ఫిర్యాదు చేసింది. తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టిక్కెట్లపై అన్యమత ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుపతిలో బీజేపీ ఆందోళన చేపట్టింది. పీీపీఏలు, రాజధాని విషయంలోనూ బీజేపీ జగన్ ప్రభుత్వంపై గుర్రుగా ఉంది. మొత్తంగా చూసుకుంటే మూడు నెలల్లోనూ మూడు పార్టీలు ఒక్కటయ్యాయన్నది మాత్రం వాస్తవం. వారి టార్గెట్ జగన్ సర్కార్ కావడంతో త్వరలోనే మూడు పార్టీలు ప్రత్యక్షంగా పోరాటానికి దిగినా ఆశ్చర్యం లేదు.

Tags:    

Similar News