అప్పు తప్పును జనం మెచ్చుతారా.. ?

అప్పు చేయడం తప్పు కాదు, తక్కువ అంతకంటే కాదు, నిజం చెప్పాలంటే అది ఒక కళ. అందరికీ అప్పు పుడుతుందా. అయినా అప్పు ఇచ్చేవాడు ఉన్నాడు అంటే [more]

Update: 2021-09-16 03:30 GMT

అప్పు చేయడం తప్పు కాదు, తక్కువ అంతకంటే కాదు, నిజం చెప్పాలంటే అది ఒక కళ. అందరికీ అప్పు పుడుతుందా. అయినా అప్పు ఇచ్చేవాడు ఉన్నాడు అంటే పుచ్చుకునేవాడు ఎప్పుడూ అప్పర్ హ్యాండే కదా. మన పెద్దలు కూడా అప్పిచ్చువాడు, వైద్యుడు అంటూ మన మేలు కోరి మంచి పద్యాన్నే రాసి ఉంచారు. ఇక చిన్న వారు చేస్తే అది తప్పేమో కానీ ఏలిన వారు చేస్తే మహా గొప్పగానే ఉంటుంది. ఇంతకీ ఈ అప్పుల కధ గురించి ఎందుకు అంటే తెల్లారి లేస్తే చాలు దాన్ని గుర్తు చేస్తూ వస్తున్న టీడీపీ దాని అనుకూల మీడియాకు థాంక్స్ చెప్పుకుంటూనే వైసీపీ ఏలికలు మరిన్ని అప్పులు చేస్తూనే పోతున్నారు. ఇచ్చేవాడుంటే పుచ్చుకోవడానికి మేము రెడీ అని కూడా అంటున్నారు.

పాయింటే మరి …

ఏం మేము అప్పు చేయకూడదా అంటున్నారు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి. ఏపీలో అప్పులు చేసి పప్పు కూడు పేదలకు పెడితే టీడీపీకి ఎందుకు బాధ అని కూడా నిలదీస్తున్నారు. మేమేమీ దుబారాలు చేయడంలేదే. అందరిలాగానే మేమూ అప్పులు చేస్తున్నామని సమర్ధించుకుంటున్నారు. ఆ మాటకు వస్తే టీడీపీ అప్పులు చేయలేదా. నాడు లేని బాధ ఇపుడు ఎందుకు అంటున్నారు. ఇక టీడీపీ అయిదేళ్ళూ ఏపీ యే కాదు దేశం ప్రపంచం కూడా సవ్య దిశలో సాగిందని, కరోనా లాంటి మహమ్మారులు కానీ ప్రకృతి విపత్తులు కానీ ఎక్కడా లేవని కూడా గుర్తు చేస్తున్నారు. ఇపుడు మొత్తం లోకమే కుదేలైన వేళ ఏపీ మాత్రం ఎలా ఎత్తిగిల్లుతుంది. అందుకే అప్పులు చేస్తున్నాం అంటున్నారు. మొత్తానికి ఆర్ధిక మంత్రి కుండబద్ధలు కొట్టారు. ఎలాంటి శషబిషలూ లేకుండా అప్పు చేయడం తమ జన్మ హక్కు అన్నట్లుగానే వాదిస్తున్నారు.

నెగ్గే వాదనేనా …?

సరే విపక్షం నోరు మూయించవచ్చు. అధికారంలో ఉన్నారు కాబట్టి పెద్ద గొంతు చేయ్వచ్చు. కానీ అప్పు తప్పు కాదు ఒప్పేనని జనాలని ఎలా కన్వీన్స్ చేస్తారు అన్నదే ఇక్కడ ప్రశ్న. అయితే దానికి కూడా జవాబు రెడీ అంటున్నారు మంత్రి బుగ్గన. మేమేమీ బాధ్యత లేని పాలకులం కాదని ఆయన అంటున్నారు. కరోనా వల్ల ఇల్లూ ఒళ్ళూ గుల్ల అయి రెండేళ్ళుగా జనం పడుతున్న అవస్థలు చూసి అప్పు తెచ్చి మరీ నగదు బదిలీ చేస్తున్నాం, ఏపీలో పధకాలు అమలు చేస్తున్నామని చెబుతున్నారు. ఈ రోజున ఏపీలో పేదల ఇళ్ళలో దీపాలు వెలిగినా నాలుగు మెతుకులు నోట్లోకి పోతున్నా ఏపీ సర్కార్ చేసిన అప్పుల పుణ్యమే అని కూడా సెలవిస్తున్నారు. అంటే అప్పులను సమర్ధించుకోవడానికి మంచి పాయింటే పట్టారు అన్న మాట. మరి అది జనాలకు ఎంత వరకూ రీచ్ అవుతుంది అన్నదే చూడాలిక్కడ.

బ్యాలెన్స్ చేస్తేనే ..?

ఏపీ అన్నది ఒక పెద్ద కుటుంబం అయితే ఇంటి పెద్దగా ఉన్న ప్రభుత్వం పధకాల పేరిట కొందరికే ఫలాలు ఇస్తోంది. మరికొందరు మాత్రం పన్నులు కడుతున్నారు. ఆర్ధిక భారాలు మోస్తున్నారు. ఇపుడు నగదు అందుకున్న వారు బాగానే ఉంటారు. మా వరకూ ఓకే అంటారు. కానీ సర్కార్ నుంచి ఎర్రని ఏగాణీ కూడా దక్కని వారు మాత్రం పక్కా విలన్లే అవుతారు. వారే రేపటి రోజున విపక్షానికి కోరస్ గా మారతారు. మరి వారిని కూడా కలుపుకుంటూ బ్యాలెన్స్ చేసుకున్నపుడే సర్కార్ వాదన నిలిచేది, ప్రజా క్షేత్రంలో గెలిచేది. అలాగే అభివృద్ధి అంటూ ఎంతో కొంత చూపించి ఆ సెక్షన్ జనాలను సంతృప్తి పరిస్తేనే 2024లో వైసీపీ అధికార నావ ఒడ్డుకు చేరేది. ఏది ఏమైనా బుగ్గన దబాయింపు మాత్రం మహా ఇంపుగానే ఉందని వైసీపీ నేతలు సంబరపడుతున్నారు

Tags:    

Similar News