జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటేనే గెలుపు… టీడీపీ కీల‌క నేత‌ల నివేదిక ?

ఏపీలో టీడీపీ గ‌త ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిపోయింది. ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మే అతి ఘోర ప‌రాజ‌యం. కొన్నేళ్ల ముందు నుంచి చూస్తే [more]

Update: 2021-03-08 00:30 GMT

ఏపీలో టీడీపీ గ‌త ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడిపోయింది. ఆ పార్టీ పెట్టినప్పటి నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మే అతి ఘోర ప‌రాజ‌యం. కొన్నేళ్ల ముందు నుంచి చూస్తే చంద్రబాబు టీడీపీని టేకోవ‌ర్ చేశాక జ‌రిగిన ప్రతి ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న పొత్తు పెట్టుకుంట‌నే అధికారంలోకి వ‌చ్చారు.. సొంతంగా పోటీ చేసిన ప్రతి సారి ఆయ‌న‌కు ఎదురు దెబ్బలు త‌ప్పలేదు. 1999లో బీజేపీతో పొత్తు + కార్గిల్ వార్ సానుభూతి ఆయ‌న‌కు క‌లిసొస్తే, 2014లో బీజేపీతో పొత్తు + మోడీ వేవ్ + ప‌వ‌న్ మ‌ద్దతు క‌లిసొచ్చాయి. ఆయ‌న ఒంట‌రిగా పోటీ చేసిన ప్రతిసారి చావు దెబ్బలు త‌ప్ప‌లేదు. 2004లో బీజేపీ పొత్తున్నా ఉమ్మడి రాష్ట్రంలో 47 సీట్లే వ‌చ్చాయి. 2009లో నాలుగు పార్టీల పొత్తు ఉన్నా 92 సీట్లే వ‌చ్చాయి. గ‌త ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేస్తే 23 సీట్లే వ‌చ్చాయి. ఒంట‌రి పోరుతో ముందుకు వెళ్లిన 1999 లోక్‌స‌భ మ‌ధ్యంత‌ర ఎన్నిక‌ల్లోనూ చంద్రబాబుకు షాక్ త‌ప్పలేదు.

ఒంటరిగా పోటీ చేస్తే…?

2009లో ప్రజారాజ్యం 18 శాతం ఓట్లు చీల్చి చంద్రబాబును వ‌రుస‌గా రెండోసారి ప్రతిప‌క్షంలో కూర్చోపెట్టింది. గ‌త ఎన్నిక‌ల్లో గెలుపు ధీమా మీద ఉన్న చంద్రబాబుకు మ‌రోసారి జ‌న‌సేన దెబ్బకొట్టింది. చంద్రబాబు ప్రతిప‌క్షంలోకి వ‌చ్చి రెండేళ్లు అవుతోన్న స‌మ‌యంలో జ‌రిగిన పంచాయతీ ఎన్నిక‌లు టీడీపీ నేత‌ల ఆలోచ‌న‌ను పూర్తిగా మార్చేశాయి. ఏపీలో వైసీపీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చాక వైసీపీ దూకుడు ముందు టీడీపీ పూర్తిగా బేజారు అయిపోయింది. పార్టీలో ఎవ‌రు ఎప్పుడు ఉంటారో తెలియ‌డం లేదు. పార్టీ నాయ‌కులు, కేడ‌ర్ తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిన స‌మ‌యంలో జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కొన్ని చోట్ల ఆశ్చర్యక‌ర ఫ‌లితాలు వ‌చ్చాయి.

కలిస్తేనే వైసీపీకి షాక్….

అధికార వైసీపీని ఎదుర్కోలేని చోట్ల చాలా మంది ముందుగా చేతులు ఎత్తేశారు. అయితే కొంద‌రు మాజీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు మాత్రం తెలివిగా జ‌న‌సేన‌తో పొత్తులు, స‌ర్దుబాట్లు చేసుకుని వైసీపీ పీచ‌మ‌ణించారు. తూర్పు గోదావ‌రి జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో జ‌న‌సేన గెలిచిన రాజోలులో ఎమ్మెల్యే రాపాక పార్టీ మారినా జ‌నసేన + టీడీపీ పొత్తు వల్ల రెండు పార్టీలు వైసీపీతో పోటీగా పంచాయ‌తీలు గెలుచుకున్నాయి. ఆ ఒక్క చోటే కాదు అదే కోన‌సీమ‌లో అమ‌లాపురం, టి.గ‌న్నవ‌రం, కొత్తపేట నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు ముమ్మడివ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోనూ జ‌న‌సేన + టీడీపీ అంత‌ర్గత ఒప్పందాలు అధికార పార్టీకి బిగ్ షాక్ ఇచ్చాయి.

తూర్పు గోదావరి జిల్లాలో….

పి.గ‌న్నవ‌రం నియోజ‌క‌వర్గంలో మండ‌ల కేంద్రాలు, మేజ‌ర్ పంచాతీలు జ‌న‌సేన + టీడీపీ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఈ రెండు పార్టీల దెబ్బతో విల‌విల్లాడారు. మంత్రి విశ్వరూప్ ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న అమ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గంలో కూడా జ‌నసేన + టీడీపీ పొత్తు ఉన్న చోట అధికార పార్టీ అభ్యర్థులు ఓడారు. కొత్తపేట‌లో మండ‌ల కేంద్రాలు అయిన ఆత్రేయ‌పురం, కొత్తపేట‌, ప‌లివెల‌లో టీడీపీ విన్ అయ్యింది. ఇటు ప‌శ్చిమ‌లోనూ న‌ర‌సాపురం, తాడేప‌ల్లిగూడెం, ఉంగుటూరు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ జ‌నసేన + టీడీపీ పొత్తు ఉన్న పంచాయ‌తీల్లో రెండు పార్టీలు ల‌బ్ధి పొందాయి. తాడేప‌ల్లిగూడెం, న‌ర‌సాపురం లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన ఎక్కువ పంచాయ‌తీల్లో పాగా వేయ‌డం వెన‌క ఇదే ప్ర‌ధాన కార‌ణం.

సక్సెస్ అయిన నేతల నుంచి…..

విచిత్రం ఏంటంటే తాడేప‌ల్లిగూడెంలో ఎన్నిక‌లకు ఇర‌వై రోజుల ముందే ఇన్‌చార్జ్‌గా వ‌చ్చిన టీడీపీ నేత వ‌ల‌వ‌ల బాబ్జీ ముందుగానే జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుని వైసీపీకి కోలుకోలేని షాక్ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో రెండు పార్టీల పొత్తు… ఫ‌లితాల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ క్రమంలోనే ఇలా ప్రయ‌త్నించి స‌క్సెస్ అయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌లు ఇప్పుడు జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుంటే స‌క్సెస్ అవుతామ‌ని… లేక‌పోతే భ‌విష్యత్తులోనే క‌ష్టమే అన్న విష‌యంపై పార్టీ అధిష్టానానికి నివేదిక‌లు పంపారు. మ‌రి దీనిపై అధిష్టానం ఎలా నిర్ణయం తీసుకుంటుందో ? చూడాలి.

Tags:    

Similar News