టీడీపీలో ఆ త్రిమూర్తుల‌పై పార్టీలోనే సెటైర్లు

ఏపీ ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో త‌మ్ముళ్లు గుస‌గుస‌లాడుతున్నారు. చాలా ఇంట్రస్టింగ్ ఇష్యూ అంటూ.. ఒకరికి ఒక‌రు ఫోన్లు చేసుకుని క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. [more]

Update: 2020-08-24 09:30 GMT

ఏపీ ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలో త‌మ్ముళ్లు గుస‌గుస‌లాడుతున్నారు. చాలా ఇంట్రస్టింగ్ ఇష్యూ అంటూ.. ఒకరికి ఒక‌రు ఫోన్లు చేసుకుని క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. త‌మ‌లో తామే జోకులు పేల్చుకోవ‌డం. త‌మ పార్టీ ఇప్పుడు అమ‌రావ‌తిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికార పార్టీ వైఎస్సార్ సీపీతో అమ‌రావ‌తిమే స‌వాల్‌. అంటూ.. చంద్రబాబు దూసుకుపోయేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే ఆయ‌న పార్టీ శ్రేణుల‌ను స‌మాయ‌త్తం చేసి.. మ‌రీ వైఎస్సార్ సీపీపై యుద్ధానికి సిద్ధమ‌వుతున్నారు. రేపోమాపో ప్రజ‌ల్లోకి వెళ్లి మ‌రీ అమ‌రావ‌తిపై వేడిర‌గిలిస్తాన‌ని చెబుతున్నారు.

ముగ్గురు ఎంపీలు…..

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. టీడీపీలో ఉన్న ముగ్గురు ఎంపీలు.. మాత్రం అమ‌రావ‌తి విష‌యంలో మూడు కోతుల‌ను త‌ల‌పిస్తున్నార‌ని అంటున్నారు సొంత పార్టీ నాయ‌కులే. ఇటీవ‌ల విజ‌య‌వాడ‌కు చెందిన ఓ ఎమ్మెల్సీ.. మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ.. ఇదే అన్నారు. “మా ఎంపీలు మూడు కోతుల్లా త‌యార‌య్యా బాబూ.. ముగ్గురిలో ఏ ఒక్కరూ మాట్లాడ‌రు. ఒక‌రు నోరు మూసుకుంటారు. ఒక‌రు క‌ళ్లు మూసుకుంటారు. మ‌రొక‌రు చెవులు మూసుకుంటారు“ అని వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోయారు.

గల్లా జయదేవ్…..

దీనికి సంబంధించి కొంచెం ఆరాతీస్తే పార్టీలోని మిగిలిన నాయ‌కులు కూడా ఈ ముగ్గురు ఎంపీల గురించి ఇలానే చ‌ర్చించుకుంటున్నార‌ని చెబుతున్నారు. గుంటూరుకు చెందిన గ‌ల్లా జ‌య‌దేవ్ అమ‌రావ‌తిపై స్పందించ‌డం మానేశారు. అమ‌రావ‌తిపై దెబ్బ‌లు తిని మ‌రీ జైలుకు వెళ్లిన ఆయ‌న ఆ త‌ర్వాత టీడీపీ అధిష్టానం నుంచి స‌రైన ఎంక‌రేజ్‌మెంట్ లేద‌ని సైలెంట్ అయిపోయారు. ఆయ‌న వ్యాపార వ్యవ‌హారాల నేప‌థ్యంలో కూడా ఆయ‌న గుంటూరులో క‌నిపించ‌డం లేద‌ని మ‌రో టాక్‌..?

చూసినా చూడనట్లే….

ఇక‌, విజ‌య‌వాడ‌కు చెందిన ఎంపీ కేశినేని నాని చూస్తూ..కూడా ఏమీ చూడ‌న‌ట్టే వ్యవ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న అప్పుడే చంద్రబాబు, లోకేష్‌పై రుస‌రుస‌లాడ‌తారు… అప్పుడే క‌లిసిన‌ట్టు ఉంటారు. గెలిచినా కూడా త‌న మాట ఎందుకు నెగ్గనివ్వరు…. బాబు తనకు ఎందుకు ప్రయార్టీ ఇవ్వర‌న్నది ఆయ‌న ఆవేద‌న‌. ఇక‌, మూడో ఎంపీ శ్రీకాకుళానికి చెందిన రామ్మోహ‌న్ నాయ‌కుడు త‌న‌కు అమ‌రావ‌తి గురించిన స‌మా‌చారం కానీ, టీడీపీఅధినేత ఇస్తున్న ఆందోళ‌న పిలుపులు కానీ, ఏమీ వినిపించ‌డం లేద‌ని ఆయ‌న చెవులు మూసుకుంటున్నార‌ట‌.

విన్పించనట్లే…?

ఇక ఆయ‌న బాబాయ్ అచ్చెన్నాయుడుకు ఇప్పట‌కీ బెయిల్ రాక‌పోవ‌డంతో పాటు వైజాగ్ రాజ‌ధాని విష‌యంలో టీడీపీ లైన్లో వెళ్ల‌డంతో స్థానికంగా త‌మ కుటుంబాన్ని ప్ర‌జ‌లు ప‌ట్టించుకోక‌పోవ‌డం లాంటి సంఘ‌ట‌న‌ల‌తో ఆయ‌న పూర్తిగా సైలెంట్ అయిపోయారు. సో.. మొత్తానికి అమ‌రావ‌తిపై ఈ ముగ్గురు ఎంపీలు అనుస‌రిస్తున్న వైఖ‌రిపై సొంత పార్టీలోనే ర‌క‌ర‌కాల గుస‌గుస‌లు.. ర‌క‌ర‌కాల సెటైర్లు ప‌డుతున్నాయి.

Tags:    

Similar News