సీమలో సౌండ్ రావడం లేదే?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో సీరియస్ గా ఉన్నారు. ఈ బిల్లులకు గవర్నర్ ఆమోదం కూడా లభించింది. అయితే గతంలో విన్పించిన రాయలసీమ [more]

Update: 2020-08-17 11:00 GMT

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో సీరియస్ గా ఉన్నారు. ఈ బిల్లులకు గవర్నర్ ఆమోదం కూడా లభించింది. అయితే గతంలో విన్పించిన రాయలసీమ తెలుగుదేశం పార్టీ నేతల గళాలు మూగబోయాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అమరావతిలోనే రాజధానిగా ఉంచాలని పదే పదే డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలకు పిలుపునిస్తున్నారు. ప్రతిరోజూ మీడియా మీటింగ్ లు పెట్టి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు.

సీమ నేతలు మాత్రం….

కానీ రాయలసీీమ నేతలు మాత్రం పెదవి విప్పడం లేదు. గతంలో చంద్రబాబుకు అండగా నిలిచిన నేతలు నేడు సైలెంట్ అయ్యారు. నిజానికి రాయలసీమలో టీడీపీ పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. కడప, కర్నూలు జిల్లాల్లో గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. అనంతపురంలో రెండు, చిత్తూరులో ఒక స్థానం సాధించింది. రాయలసీమ మొత్తం మీద టీడీపీకి దక్కింది మూడంటే మూడు సీట్లు మాత్రమే. ఇప్పుడు జగన్ కర్నూలులో న్యాయరాజధానిని ఏర్పాటు చేస్తానంటున్నారు.

సీనియర్ నేతలందరూ…..

రాయలసీమలో టీడీపీ నేతలకు కొదవ లేదు. సీనియర్ నేతలు అందరూ ఇక్కడే ఉన్నాయి. కేఈ, కోట్ల కుటుంబంతో పాటు భూమా అఖిలప్రియ, కాల్వ శ్రీనివాసులు, నిమ్మల కిష్టప్ప, పల్లె రఘునాధరెెడ్డి వంటి నేతలు ఉన్నారు. వీరంతా రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుపై ఎలాంటి వైఖరి ప్రకటించడం లేదు. రాయలసీమ టీడీపీ నేతలందరూ చంద్రబాబు డిమాండ్ ను పక్కన పెట్టినట్లే కన్పిస్తుంది. న్యాయరాజధాని కర్నూలుకు వస్తే ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుందని వీరు అభిప్రాయపడుతున్నారు.

అభ్యంతరం ఎందుకు?

హైకోర్టును అమరావతిలో ఏర్పాటు చేసేటప్పుడే కేఈ కృష్ణమూర్తి లాంటి నేతలు కర్నూలు లో పెట్టాలని సూచించారు. కానీ చంద్రబాబు మాత్రం అమరావతికే ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పుడు జగన్ ఆ పనిచేస్తుంటే తాము అభ్యంతరం చెప్పడం ఎందుకన్న వైఖరిలో వారున్నారు. పైగా జనాభిప్రాయానికి విరుద్ధంగా స్టాండ్ తీసుకుంటే భవిష్యత్ లో తాము రాజకీయంగా దెబ్బతింటామని ఆందోళనలో వారున్నారు. అందుకే చిన్న విషయంలో పెద్ద సౌండ్ చేసే సీమ నేతలు మూడు రాజధానుల బిల్లుల విషయంలో మౌనం వహించడం పార్టీలో చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News