కారు స్పీడుకి కాంగ్రెస్ బ్రేకులు వేస్తుందా..?

రెండు నెలల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. మరికొన్ని గంటల్లో ఈవీఎంలలో దాగి ఉన్న నేతల భవితవ్యం తేలిపోనుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి. కాబోయే ప్రధానమంత్రి [more]

Update: 2019-05-23 02:00 GMT

రెండు నెలల ఉత్కంఠకు నేటితో తెరపడనుంది. మరికొన్ని గంటల్లో ఈవీఎంలలో దాగి ఉన్న నేతల భవితవ్యం తేలిపోనుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో వెలువడనున్నాయి. కాబోయే ప్రధానమంత్రి ఎవరనేది తేలిపోనుంది. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో కౌంటింగ్ కు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో 16 సీట్లు దక్కించుకొని కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా కావాలని తెలంగాణ రాష్ట్ర సమితి పట్టుదలగా ఉంది. ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని భావించింది. ఇక, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ కూడా లోక్ సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని బలమైన అభ్యర్థులను రంగంలోకి దించింది. దీంతో లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

మూడు పార్టీలకు ఆశలు…

కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న టీఆర్ఎస్ విజయంపై ధీమాగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో ఇప్పుడు కూడా తమకు తిరుగులేదనే భావనలో ఉంది. ఒక స్థానం ఎంఐఎంకు పోగా మిగతా 16 సీట్లు దక్కించుకుంటామని టీఆర్ఎస్ నేతలు నమ్మకంగా ఉన్నారు. అన్ని ప్రాంతీయ, జాతీయ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపాయి. టీఆర్ఎస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలుస్తుందని అంచనా వేశాయి. 10 నుంచి 14 సీట్లు ఆ పార్టీ దక్కించుకుంటుందనే సర్వేలు తేల్చాయి. ఇక, కాంగ్రెస్ పార్టీ కూడా లోక్ సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తెలంగాణలో ఆ పార్టీకి మనుగడకే ఈ ఎన్నికలు కీలకం కావడంతో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించింది. దీంతో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేణుకా చౌదరి, పొన్నం ప్రభాకర్, మధు యాష్కి వంటి కీలక నేతలకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి.

మధ్యాహ్నానికి ట్రెండ్స్

ఆ పార్టీ ఆరు స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చామని, కనీసం 4 సీట్లు గెలుస్తామని ధీమాగా ఉంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం 1 నుంచి 3 స్థానాలు ఆ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేశాయి. ఇక, బీజేపీ కూడా తెలంగాణపై బాగానే ఆశలు పెట్టుకుంది. సికింద్రాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ స్థానాల్లో ఆ పార్టీ గట్టి పోటీ ఇచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఆ పార్టీ ఎన్నిసీట్లు గెలుస్తుందనే దానిని బట్టి ఆ పార్టీ భవిష్యత్ రాష్ట్రంలో ఆధారపడి ఉంది. ఇలా మూడు పార్టీలూ లోక్ సభ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి, వీరి ఆశలు ఫలిస్తాయో లేదో ఇవాళ తేలిపోనుంది. మధ్యాహ్నం వరకు ట్రెండ్స్ వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం కల్లా పూర్తి ఫలితాలు వెల్లడికానున్నాయి.

Tags:    

Similar News