ఏకం చేయడానికి మళ్లీ…?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారా? పార్లమెంటు ఎన్నికలకు ముందు వివిధ రాష్ట్రాలకు కాలికి బలపం కట్టుకుని తిరిగిన కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ [more]

Update: 2019-12-21 16:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారా? పార్లమెంటు ఎన్నికలకు ముందు వివిధ రాష్ట్రాలకు కాలికి బలపం కట్టుకుని తిరిగిన కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన మరోసారి తెరపైకి వచ్చంది. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ పై కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. కేంద్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు విడుదల చేయకపోవడంతో పాటు పెత్తనం చేయాలని చూడటం, వివిధ అంశాల్లో జోక్యం పెరిగిపోవడంతో కేంద్రానికి ఎక్కడో ఒకచోట చెక్ పెట్టాలన్నది కేసీఆర్ ఆలోచనగా ఉంది. అందుకే జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్ ఆసక్తి చూపుతున్నారంటున్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా….

ప్రధానంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల హక్కులను హరిస్తుందని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ఇటీవల కేసీఆర్ తమ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రానికి ఘాటుగా లేఖ రాశారు. రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు బీజేపీయేతర పార్టీలను ఏకం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందుకు రాష్ట్ర హక్కులనే అజెండాగా కేసీఆర్ తీసుకోనున్నారు. ఇప్పటికే కేసీఆర్ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిలిచి కేంద్రానికి తన వైఖరిని తెలియజేశారు.

పార్లమెంటు ఎన్నికలకు ముందే….

నిజానికి గత పార్లమెంటు ఎన్నికలకు ముందే ఎన్నికల్లో గుణాత్మక మార్పు రావాలంటూ కేసీఆర్ బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే ప్రయత్నం చేశారు. పశ్చమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కర్ణాటకలో దేవెగౌడ, కుమారస్వామి, తమిళనాడులో స్టాలిన్ లను కలిసి వచ్చారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ను కలిశారు. అయితే అప్పట్లో అది సాధ్యం కాలేదు. అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ రాష్ట్రాల హక్కులను హరించివేస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు.

ప్రాంతీయ పార్టీలన్నింటినీ….

అందుకే దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు మరో ప్రయత్నం చేయాలని భావిస్తున్నారు. రాజకీయంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొనాలంటే అందరినీ కలుపుకుని పోరాడటమే బెటర్ అని నిర్ణయానికి వచ్చారు. ప్రాంతీయ పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్, జేడీఎస్, వైసీపీ, డీఎంకే, శివసేన పార్టీలతో కలిసి కేంద్రంపై పోరుకు సిద్ధం అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటకే పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రాలకు అన్యాయం కేంద్ర ప్రభుత్వం చేస్తుందంటూ ఆందోళనను కూడా టీఆర్ఎస్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో మరోసారి కేసీఆర్ బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకం చేయాలని భావిస్తున్నారు. మరి అందరూ కేసీఆర్ తో కలసి వస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News