కేబినెట్ లో.. ఆ ఇద్దరు ఎవరు..?

మహిళలకు మంత్రి పదవి ఇవ్వలేదనే విమర్శలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెక్ పెట్టనున్నారు. త్వరలోనే మహిళలను మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. గత క్యాబినెట్ [more]

Update: 2019-02-24 02:30 GMT

మహిళలకు మంత్రి పదవి ఇవ్వలేదనే విమర్శలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెక్ పెట్టనున్నారు. త్వరలోనే మహిళలను మంత్రివర్గంలోకి తీసుకుంటామని ఆయన అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. గత క్యాబినెట్ లో ఒక్క మహిళకు మంత్రి పదవి దక్కలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రతి పక్షాలు పదేపదే ఈ అంశాన్ని లేవనెత్తేవి. ఇక, ఈసారి కూడా మొదటి విడత మంత్రివర్గ విస్తరణలో మహిళలకు అవకాశం దక్కలేదు. దీంతో మళ్లీ గతంలో వచ్చిన విమర్శలే వస్తున్నాయి. 11 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్న ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి ఈ విషయాన్ని లేవనెత్తారు. మహిళకు మంత్రి పదవి ఇవ్వాలని ఆమె కోరారు.

ఒక్కరికి కాదు.. ఇద్దరికి..

సబిత ఇంద్రారెడ్డికి జవాబిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్… తమకు మహిళలపై నిర్లక్ష్యమేమీ లేదని, గౌరవం మాత్రమే ఉందన్నారు. ఈసారి మంత్రి వర్గంలో ఇద్దరు మహిళలకు అవకాశం ఇస్తామన్నారు. దీంతో కేసీఆర్ క్యాబినెట్ లో చోటు దక్కనున్నా ఆ ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్ నుంచి ఈ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి రేఖా నాయక్, మెదక్ నుంచి పద్మా దేవేందర్ రెడ్డి, ఆలేరు నుంచి గొంగిడి సునీత మాత్రమే విజయం సాధించారు. ఇక, మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ కానున్నారు. మొత్తంగా రెండు మంత్రి పదవులకు నలుగురు రేసులో ఉన్నారు. వీరిలోనే ఇద్దరు మంత్రులు కానున్నారు. ఇక, కాంగ్రెస్ నుంచి సబిత ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరుతారని, ఆమెకు మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరుగుతుంది. కానీ, ఈ ప్రచారాన్ని ఆమె ఖండిస్తున్నారు.

రెండు పదవులు… నలుగురు పోటీ

ఆది నుంచీ టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ ఉద్యమంలో సైతం చురుగ్గా పాల్గొన్న పద్మా దేవేందర్ రెడ్డి మంత్రి పదవి రేసులో ముందున్నారు. గత అసెంబ్లీలోనే డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన ఆమెకు ఈసారి మంత్రి పదవి పక్కా అంటున్నారు. అయితే, మెదక్ జిల్లా నుంచే ముఖ్యమంత్రి ఉన్నందున మంత్రి పదవి జిల్లాలో ఒక్కరికే ఇచ్చే అవకాశం ఉంటుంది. హరీష్ రావును పక్కన పెట్టి పద్మా దేవేందర్ రెడ్డికి ఇవ్వడం అనుమానమే అనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇక, రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా నాయక్ కు మంత్రి పదవి ఖాయమంటున్నారు. ఎస్టీ కావడంతో పాటు మహిళా కోటాలో ఆమెకు పదవి ఇస్తే ఎస్టీలకు కూడా న్యాయం చేసినట్లు ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలేరు నుంచి రెండోసారి గెలిచి గొంగిడి సునీతకు కూడా ముఖ్యమంత్రి వద్ద మంచి పేరే ఉన్నా ఆమెకు ఛాన్సులు తక్కువే అంటున్నారు. త్వరలో ఎమ్మెల్సీ కానున్న సత్యవతి రాథోడ్ ఇంతకుముందు ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆమెకు మంత్రి పదవి ఛాన్సులు తక్కువే. రంగారెడ్డి జిల్లా నుంచి మొదటి విడతలో ఎవరికీ అవకాశం దక్కలేదు. ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సబిత ఇంద్రారెడ్డి ఒకవేళ టీఆర్ఎస్ లోకి వెళ్తే ఆమెకు మంత్రి పదవి దక్కడం ఖాయమే. మొత్తానికి కేసీఆర్ ప్రకటనతో మహిళా ఎమ్మెల్యేల్లో మంత్రి పదవిపై ఆశలు పెరుగుతున్నాయి.

Tags:    

Similar News