కేసీఆరూ… ఈ టెన్షన్ ఇంకా ఎన్ని రోజులు..?

తెలంగాణలో టీఆర్ఎస్ అధికారం చేపట్టి సుమారు నెల రోజులు గడుస్తున్నా ఇంకా మంత్రివర్గం ఏర్పాటు అంశం కొలిక్కి రావడం లేదు. కేవలం మహమూద్ అలీని మాత్రమే క్యాబినెట్ [more]

Update: 2019-01-09 02:30 GMT

తెలంగాణలో టీఆర్ఎస్ అధికారం చేపట్టి సుమారు నెల రోజులు గడుస్తున్నా ఇంకా మంత్రివర్గం ఏర్పాటు అంశం కొలిక్కి రావడం లేదు. కేవలం మహమూద్ అలీని మాత్రమే క్యాబినెట్ లోకి తీసుకున్న కేసీఆర్ మిగతా మంత్రివర్గం ఏర్పాటుపై సస్పెన్స్ ను కొనసాగిస్తున్నారు. దీంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో టెన్షన్ పెరిగిపోతోంది. అయితే, మంత్రవర్గ ఏర్పాటుపై తీవ్ర కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్ర కల్వకుంట్ల చంద్రశేఖరరావు త్వరలోనే లిస్ట్ ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది. సంక్రాంతి తర్వాత మంత్రివర్గం ఏర్పాటు ఉంటుందని తెలుస్తోంది. అయితే, పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయకుండా కేవలం 8 మందిని మాత్రమే మంత్రి పదవుల్లోకి తీసుకోనున్నారని సమాచారం. ఒక్కో జిల్లా నుంచి ఒక్కొక్కరిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నారని, సామాజికవర్గ సమీకరణలు సైతం పరిగణలోకి తీసుకుని మొదటి విడతలో ఎస్సీ, బీసీ, మహిళలకు కూడా అవకాశం దక్కనుంది.

రెండు విడతలుగా మంత్రివర్గం ఏర్పాటు

కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి త్వరలోనే ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరతారనే ఉద్దేశ్యంతో మొదటి విడతలో 8 పదవులు మాత్రమే భర్తీ చేసి మిగతా 8 మంత్రి పదవులను పెండింగ్ లో పెడతారని సమాచారం. 2014లోనూ కేసీఆర్ ఇదే వ్యూహాన్ని అమలు చేశారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన వారికి రెండో విడతలో మంత్రి పదవులు కట్టబెట్టారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొందరిని పార్లమెంటుకి పంపించి ఇప్పుడు ఎంపీలుగా ఉన్న వారిని మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు కారణాల వల్ల రెండు విడతలుగా మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నారు. రెండో విడత మంత్రివర్గం పార్లమెంట్ ఎన్నికలు మిగిశాకనే చేయనున్నారు. ఇక, ఎవరెవరికి మొదటి విడతలో అవకాశం దక్కుతుందనేది ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యమంత్రి మదిలో ఎవరున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.

రెడ్డి నేతల్లో భారీ పోటీ…

గత క్యాబినెట్ లో మహిళలకు మంత్రి పదవి ఇవ్వలేదని అపవాదు రావడంతో ఈసారి మొదటి విడతలోనే మహిళకు మంత్రి పదవి కేటాయించే అవకాశం ఉంది. ఈ రేసులో పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్, గొంగిడి సునీత ఉన్నా… సీనియర్, ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన పద్మా దేవేందర్ రెడ్డికి అవకాశం దక్కుతుంది అంటున్నారు. ఇక, ఎస్సీల్లో కడియం శ్రీహరికి ఈసారి మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆయనను వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేయిస్తే ఇతరులకు ఎస్సీ కోటాలో అవకాశం దక్కనుంది. ఈ రేసులో దర్మపురి ఎమ్మెల్యే, ముందునుంచీ కేసీఆర్ కి విధేయుడిగా ఉన్న కొప్పుల ఈశ్వర్ ముందున్నారు. ఎస్టీల్లో రెడ్యానాయక్ కి పదవి ఖాయం అంటున్నారు. రెడ్డి సామాజికవర్గంలో ఎక్కువమంది పోటీ పడుతున్నారు. నల్గొండ నుంచి జగదీశ్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, నిజామాబాద్ నుంచి పోచారం శ్రీనివాస్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మహబూబ్ నగర్ నుంచి నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, అదిలాబాద్ లో ఇంద్రకరణ్ రెడ్డి రెడ్డి కోటాలో మంత్రి పదవులు ఆశిస్తున్నారు.

ఫస్ట్ లిస్ట్ లో కేటీఆర్ ఉండరా..?

వెలమ సామాజకవర్గం నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆశిస్తున్నారు. ఇక, కేటీఆర్, హరీష్ రావు ఎలానూ ఉన్నారు. అయితే, ఫస్ట్ ఫేజ్ లో కేటీఆర్ ను మంత్రివర్గంలో తీసుకోరనే చర్చ కూడా జరుగుతోంది. ఇక బీసీల నుంచి ఈటెల రాజేందర్ కి మంత్రి పదవి ఖాయమే. హైదరాబాద్ లో తలసారి శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ తో పాటు మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్ కూడా బీసీ కోటాలో మంత్రి పదవి ఆశిస్తున్నారు. మొత్తానికి ఆశావహులు ఎక్కువగా ఉండటం, కేవలం 8 మంది మంత్రి పదవుల్లోకి తీసుకునే అవకాశం ఉండటంతో చాలామందికి ఆశాభంగం తప్పేలా లేదు.

Tags:    

Similar News