రేపు అన్నది లేదా..?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సర్కారీ స్థలాలను విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకుంటున్నాయి. అయిదేళ్ల కాలానికి ఎన్నికయ్యే ప్రభుత్వాలు ప్రజల శాశ్వత ఆస్తిని తమ పాలన కాలంలో అమ్మేస్తే భవిష్యత్తు [more]

Update: 2021-06-12 15:30 GMT

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సర్కారీ స్థలాలను విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకుంటున్నాయి. అయిదేళ్ల కాలానికి ఎన్నికయ్యే ప్రభుత్వాలు ప్రజల శాశ్వత ఆస్తిని తమ పాలన కాలంలో అమ్మేస్తే భవిష్యత్తు అయోమయంగా మారుతుంది. అసలు ప్రభుత్వాలకు ఈ హక్కు ఉందా? అనే చర్చ మొదలైంది. ఆంధ్రరాష్ట్రం మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా శతాబ్దాలపాటు బ్రిటిష్ పాలనలో ఉంది. నీటి వసతి కూడా ఎక్కువ. అందువల్ల ప్రభుత్వ మిగులు భూములు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తెలంగాణ స్వాతంత్ర్యం వచ్చేవరకూ నిజాం పాలనలోనే ఉండటంతో ప్రభుత్వ స్థలాలు చాలా ఎక్కువ. ఇది తెలంగాణకు ఒక వరం. దానిని తాత్కాలిక ప్రయోజనాల కోసం అమ్మేసుకుంటే భవిష్యత్తు అవకాశాలను చేజేతులారా కాలరాసుకున్నట్లే. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే సౌకర్యవంతమైన భూముల కొరత వెన్నాడుతోంది. ఉన్న అరకొర భూములనూ అమ్మేస్తే భవిష్యత్తులో మౌలిక వసతులకు గడ్డుకాలం ఎదురవుతుంది.

భవితకు గండి…

భూములు ప్రభుత్వాలకు పెట్టుబడి సాధనాలు. ఉపాధి కల్పించేందుకు వనరులు. పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు రావాలంటే మౌలిక వసతులు అవసరం. పరిశ్రమలు పెట్టడానికి ముందుగా ఉచితంగా, లేదా చౌకగా స్థలాలను పారి శ్రామిక వేత్తలు కోరుతుంటారు. పారిశ్రామిక వాడలు వెలిస్తే పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం, స్థానికులకు జీవనోపాధి దొరుకుతుంది. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక కార్పొరేట్ అధిపతులు ఉచితంగా భూవసతి, మానవ వనరులు ఉన్నచోటనే కంపెనీలు పెడుతున్నారు. తెలంగాణకు అదృష్టం కొద్దీ లక్షల ఎకరాల్లో సర్కారీ భూములున్నాయి. ఇక్కడి వాతావరణం సైతం పరిశ్రమలకు అనువైనది. భవిష్యత్తులో బారత దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలవడానికి అవకాశం ఉన్న ప్రాంతం. ఇటీవలి కాలంలో నీటివనరుల లభ్యత, విద్యుత్తు సదుపాయాల మెరుగుదల, అంతర్జాతీయ రవాణా సదుపాయాలు విస్త్రుతమయ్యాయి. మరోవైపు దక్షిణాదిన చెన్నై, బెంగుళూరు లలో జనసమ్మర్ధం, మౌలిక వసతుల కొరత పెరిగింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ చుట్టుపక్కల విస్తరణద్వారా అవకాశాలు మెరుగయ్యాయి. దీనిని ప్రభుత్వం చక్కగా వినియోగించుకోవాలి. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో పాటు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకూ భూ వసతి కల్పిస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులు, పారిశ్రామికీకరణ సాగుతుంది. వాటితోపాటు విద్య,వైద్య సదుపాయాల విస్తరణకూ భూములు అవసరం. ప్రభుత్వాలు తాత్కాలిక ప్రయోజనాలు, నిధుల సేకరణ కోసం ఆలోచిస్తే దీర్ఘకాలంలో రాష్ట్రానికి చేటు వాటిల్లుతుంది.

సమీకరణ అసాధ్యం..

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం 20 వేల ఎకరాల వరకూ విక్రయించి 20వేల కోట్లు సమకూర్చుకోవచ్చని భావిస్తోంది. కానీ అదే 20 వేల ఎకరాలను ప్రజల నుంచి ప్రభుత్వం సేకరించాలంటే లక్ష కోట్ల రూపాయలకు పైగా వెచ్చించాల్సి ఉంటుందని అంచనా. 2013లో వచ్చిన భూసేకరణ చట్టం ప్రభుత్వాల చేతులు కట్టేసింది. గతంలో మాదిరిగా ఇష్జారాజ్యంగా భూసేకరణ చేయడం కుదరదు. భూమి విలువకు ఆరు రెట్ట వరకూ నష్ట పరిహారం చెల్లించాలి. సామాజిక ప్రభావాన్ని అంచనా వేసి ఆ భూములపై ఆధారపడిన వారికి ఉఫాధి కల్పించాలి. ఇవన్నీ దాదాపు అసాధ్యంగా మారడంతోనే 2013 భూసేకరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూసేకరణలు మందగించాయి. ప్రభుత్వాలు ఇప్పుడు తమ చేతిలో ఉన్న భూమిని పోగొట్టుకుంటే భవిష్యత్తులో ఏ ప్రాజెక్టుకూ స్థలాలు సమకూర్చలేవు. కేంద్ర ప్రభుత్వమూ తమ పరిశోధన సంస్థలకు స్తలాలు అందుబాటులో ఉన్న రాష్ట్రాల్లోనే వాటిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తుంది. భూమి రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద పెట్టుబడి. తెలంగాణ సంగతి పక్కనపెడితే ఇటీవలనే ఆంధ్రపదేశ్ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి భూసేకరణ కు దాదాపు 16వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. మళ్లీ అదే ప్రభుత్వం బిల్డ్ ఏపీ పేరిట భూములను అమ్మేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధానంగా పట్టణాల్లో భూములను టార్గెట్ గా చేసుకుంటూ ఈ విక్రయాలను ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల జనసమ్మర్థం ఉండే పట్టణాల్లో మౌలిక వసతులకు భూములు కరవు అవుతాయి.

నైతికత ఎక్కడిది?

ప్రభుత్వాల నైతికత కూడా ప్రశ్నార్థకమవుతోంది. వై.ఎస్. రాజశేఖరరెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో భూముల విక్రయాన్ని టీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వాలకు ఆ హక్కు లేదంటూ వాదించింది. ఆంధ్రపాలకులు తెలంగాణ ఆస్తులకు ఎసరు పెడుతున్నారంటూ నిలదీసింది. సొంత రాష్ట్రంలో సొంత పాలకులే రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టవచ్చా? అన్న ప్రశ్నకు టీఆర్ఎస్ వద్ద సమాధానం దొరకడం లేదు. సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించే తాత్కాలిక తాయిలాలు ఓట్ల ను కురిపించవచ్చు. కానీ రాష్ట్రంలో మౌలిక వసతులు, ఉపాధి కల్పన ప్రజలకు ఉపాధి ఇస్తాయి. దేశంలోనే రాష్ట్రాన్ని ముందు వరసలో నిలుపుతాయి. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ చెన్నైలో ఏపీకి చెందిన దేవాదాయ భూముల విక్రయాన్ని తప్పు పడుతూ ఆందోళన చేసింది. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత రాస్ట్రంలోని భూములనే అడ్డగోలుగా విక్రయించాలని చూస్తోంది. నిజానికి వైసీపీ ప్రభుత్వం చేస్తున్నఖర్చులు, సంక్షేమ వితరణలతో పోలిస్తే భూముల ద్వారా వచ్చేది నామమాత్రమే. కొత్త రాష్ట్రం. వసతులు చాలా మెరుగుపడాల్సిన ప్రాంతం. ప్రభుత్వ రంగంలో సూపర్ స్సెషాలిటీ ఆసుపత్రులు, ఉన్నత విద్యా సంస్థలు, పరిశోధన సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేట్ పరి్శ్రమలు రావాల్సి ఉంది. ఏపీ లో యువత హైదరాబాద్; చెన్నై, బెంగుళూరులపై ఉపాధికి ఆధారపడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ స్థలాలను పారిశ్రామిక కారిడార్లుగా తయారు చేయాలి. ప్రతి జిల్లాను యూనిట్ గా తీసుకుంటూ ఉపాధి కల్పనకు హబ్ లను ఏర్పాటు చేయాలి. ఈరకమైన సమగ్ర ప్రణాళికను విస్మరిస్తే ఏపీ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుంది.

 

– ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News