భలే గేమ్ స్టార్ట్ చేసిన టిడిపి వైసిపి

ఎపి పాలిటిక్స్ రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు సామ, దాన, దండోపాయాలను ఉపయోగించడమే యుద్ధ నీతిగా ప్రధాన రాజకీయ పక్షాలు పావులు కదుపుతున్నాయి. ఇందులో అధికార [more]

Update: 2019-02-06 05:30 GMT

ఎపి పాలిటిక్స్ రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు సామ, దాన, దండోపాయాలను ఉపయోగించడమే యుద్ధ నీతిగా ప్రధాన రాజకీయ పక్షాలు పావులు కదుపుతున్నాయి. ఇందులో అధికార టిడిపి, విపక్ష వైసిపి పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థి వ్యూహాలను చిత్తూ చేసే ఎత్తుగడలు అనుసరిస్తున్నాయి. తాజాగా ఈ రెండు పక్షాలు కొంపలో కుంపటి పెట్టి అగ్గి రాజేస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్న తీరు అందరిని ఆశ్చర్య పరుస్తుంది. ప్రధాన పక్షాల్లో నేతల బంధు గణం చేస్తున్న విన్యాసాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

కుటుంబం రెండు, లేదా మూడు ముక్కలు …

ఎపి పాలిటిక్స్ లో ఏ ఒక్క పార్టీ మరో పార్టీని వేలెత్తి తప్పులు చూపలేని పరిస్థితి ఇప్పుడు నడుస్తుంది. నిన్నగాక మొన్న దగ్గుబాటి కుటుంబం పై పెద్ద ఎత్తున విమర్శలు కురిపించిన తెలుగుదేశం అదే తీరు రాజకీయాలు తమ పార్టీలో కొనసాగుతున్న విధానం అందరి దృష్టి లో ఉందన్న సంగతి మరిచిపోతుంది. వైసిపి కూడా అదే తీరులో తమ రాజకీయాలు నడిపిస్తూ ప్రత్యర్థిపై మాత్రం విమర్శలు కురిపించడం విశేషం. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్చినం అయ్యాకా తమ్ముడొక పార్టీ, అన్నయ్య మరో పార్టీ లో ఉండటం విచిత్రమేమి కాదు. అయితే ఇప్పుడు భార్య ఒక పార్టీ, భర్త మరో పార్టీ కూడా పెద్ద విశేషం కాదన్న రోజులు నడుస్తున్నాయి. దగ్గుబాటి పురంధరేశ్వరి బిజెపి లో ఆమె భర్త వెంకటేశ్వర రావు, కుమారుడు వైసిపిలో ఉండటాన్ని టిడిపి ఎద్దేవా చేసింది. కానీ తమ పార్టీలో వున్న పరకాల ప్రభాకర్, బిజెపి లో వున్న పరకాల భార్య కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ అంశాన్ని మరుగున పరిచింది. ఇప్పుడు ఇదే తీరులో రెండు ప్రధాన పార్టీల్లో ముఖ్య నాయకుల బంధువులను ఆకర్షించే పనిలో టిడిపి వైసిపి పడటం గమనార్హం.

అన్నయ్య అక్కడ.. తమ్ముడు ఇక్కడ, బావ అక్కడ బావమరిది ఇక్కడ ….

టిడిపి ఎమ్యెల్సీ బుద్ధా వెంకన్న కు సొంత సోదరుడే దెబ్బ కొట్టాడు. ఆయన సోదరుడు బుద్ధా నాగేశ్వర రావు వైసిపి లో చేరడంతో నిత్యం ఆయన చేసే ఆరోపణలకు పస లేకుండా పోతుంది. వైసిపి లో చేరిన మేడా మల్లిఖార్జున రెడ్డికి సొంత ఇంటి పోరు తప్పడం లేదు. ఆయన బంధువు మేడా విజయ శేఖర రెడ్డి టిడిపిలో కొనసాగుతూ పార్టీ ఆదేశిస్తే మేడా మల్లిఖార్జున రెడ్డి పై రాజంపేట లో పోటీకి సిద్ధం అంటూ సవాల్ విసిరి వార్తల్లో నిలిచారు. టిడిపి మరో ఫైర్ బ్రాండ్ పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యకు తలవంపు సోదరుడి రూపంలో ఎదురైంది. ఆయన సోదరుడు వర్ల రత్నం వైసిపి కండువా కప్పుకుని అన్నను వెక్కిరిస్తున్నారు. వైసిపి లో జగన్ కి తలలో నాలుకలా వ్యవహరించే విజయసాయి రెడ్డి కి కొత్త తలపోటు వచ్చి పడింది. ఆయన బావమరిది ద్వారకనాధ్ రెడ్డి ఇటీవల రహస్యంగా చంద్రబాబును కలవడం హాట్ టాపిక్ అయ్యింది. తనకు టికెట్ కేటాయిస్తే బావ కు షాక్ ఇచ్చేందుకు ఆయన సిద్ధం కావడం గమనార్హం. ఇటీవల అమలాపురంలో రాష్ట్ర హోమ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు కూడా జనసేన కండువా కప్పుకోవడం హాట్ టాపిక్ అయినా అది అనుకోకుండా జరిగిందంటూ ఆయన తన వెంటే ఉన్నారంటూ హోమ్ మంత్రి వివరణ ఇచ్చుకోవలిసి వచ్చింది. ఇలా ఒకే కుటుంబంలో నేతలకు శత్రువులు తయారు కావడం, వారిఎదుగుదలకు గుమ్మంలోనే సవాల్ విసిరేలా రాజకీయం మారడం గడ్డుపరిస్థితి నే సూచిస్తుంది.

Tags:    

Similar News