అక్కడ టీడీపీ వర్సెస్ టీడీపీ… వైసీపీ వర్సెస్ వైసీపీ..!

ప్రకాశం జిల్లాలో కొండపి ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా ? సిట్టింగ్‌ ఎమ్మెల్యే డోలా శ్రీ బాలా వీరాంజనేయ [more]

Update: 2019-02-06 17:30 GMT

ప్రకాశం జిల్లాలో కొండపి ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా ? సిట్టింగ్‌ ఎమ్మెల్యే డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి వరుసగా రెండోసారి గెలుస్తారా ? లేదా ఇక్కడ వైసీపీ జెండా ఎగురుతుందా ? అన్నది ఆసక్తిగా మారింది. కొండపి రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ వర్సెస్‌ వైసీపీ మధ్య‌ పోరు కన్నా టీడీపీ వర్సెస్ టీడీపీ, వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా పోరు సాగుతోంది. రెండు పార్టీలకు అంతర్గత పోరు, అసమ్మతి తప్పడం లేదు. ఈ నియోజకవర్గంలో టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే స్వామి వర్సెస్‌ జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఒంగోలు ఎమ్మెల్యే జనార్థన్‌ వర్గాలుగా పార్టీ రెండుగా చీలింది. గతంలో 1994, 99 ఎన్నికల్లో ఇక్కడ నుంచి జనార్థన్‌ తాత, దివంగత మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు రెండుసార్లు వరుస విజయాలు సాధించారు. ఈ క్రమంలోనే 2009లో కొండపి ఎస్సీలకు రిజర్వ్‌డ్‌ అయినా నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి విషయంలోనూ, పెత్తనం దామచర్ల ఫ్యామిలీనే చేస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన జూపూడి ప్రభాకర్‌రావు ఆ తర్వాత టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

దామచర్ల కుటుంబ ఆధిపత్యం…

ఇక దామచర్ల ఫ్యామిలీలో ఉన్న విభేదాలతో ఎమ్మెల్యే స్వామి.. దామచర్ల సోదరుడు దామచర్ల సత్యకు అనుకూలంగా ఉన్నారన్న టాక్‌ ఉంది. ఇదే క్రమంలో నియోజకవర్గంలో ఉన్న తన అనుచరగణంతో పాటు తన సామాజికవర్గంలో కొంత మందిని స్వామి కావాలనే పక్కన పెడుతున్నారని దామచర్ల భావిస్తున్నారు. తన సొంత నియోజకవర్గంలో తన మాట వినని వ్యక్తి తనకు ఎందుకని దామచర్ల.. స్వామిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే పార్టీ అధిష్టానం దృష్టిలో తిరిగి వచ్చే ఎన్నికల్లోనూ స్వామికే సీటు ఇవ్వాలని దాదాపు నిర్ణయం తీసేసుకున్నారు. ఈ విషయంలో జనార్థన్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా మౌనం వహించాల్సి రావొచ్చు. ఇదే టైమ్‌లో స్వామి.. జనార్థన్‌ వర్గంలో కొంత మందిని పక్కన పెట్టి ఆయన సోదరుడు సత్య మాటకు విలువ ఇస్తున్నారన్న చర్చ నియోజకవర్గంలో ఉంది. అయితే ఇదే టైమ్‌లో స్వామి వెర్షన్‌ మరోలా ఉంది. తాను నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని పోతున్నానని తన నియోజకవర్గంలో వేరే వాళ్ల పెత్తనం ఏంటని సూటిగా ప్రశ్నిస్తున్నారు.

వైసీపీలోనూ రెండు వర్గాలు

అధికార టీడీపీలో పరిస్థితి ఇలా ఉంటే విపక్ష వైసీపీలోనూ సేమ్‌ టు సేమ్‌ ఇదే పరిస్థితి నెలకొంది. కొండపి నియోజకవర్గంలో 42,000 కమ్మ సామాజికవర్గ ఓటర్లు ఉన్నారు. ఇక్కడ అధికార టీడీపీతో పాటు విపక్ష వైసీపీలోనూ ఈ సామాజికవర్గం వారిదే పెత్తనం. పేరుకు రిజర్వ్‌డ్‌ నియోజకవర్గం అయినా పెత్తనం అంతా వీరి చేతుల్లోనే ఉంటుంది. నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వైసీపీలో గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన జూపూడి ప్రభాకర్‌రావు తర్వాత టీడీపీలో చేరిపోయారు. జూపూడి పార్టీ మారాక జగన్‌ గత ఎన్నికల్లో బాపట్ల లోక్‌సభ సీటుకు వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన వరికూటి అమృతపాణికి స్వయాన సోదరుడు అయిన మాజీ ప్రభుత్వ ఉద్యోగి వరికూటి అశోక్‌బాబుకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. అశోక్‌బాబు మూడేళ్ల పాటు కష్టపడి కొండపి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. అయితే ఇదే టైమ్‌లో అధిష్టానం ఆయనకు షాక్‌ ఇచ్చింది. అశోక్‌బాబును తప్పించి ఒంగోలు రిమ్స్‌ లో పదవీ విరమణ చేసిన మాదాసు వెంకయ్యకు నియోజకవర్గ పగ్గాలు అప్పగించడంతో పాటు ఆయనకు సీటు ఖరారు చేసేశారు.

విభేదాలు వీడితేనే విజయం

దీంతో నియోజకవర్గంలో తనకంటూ అనుచరగణం కలిగిన అశోక్‌బాబు పార్టీపై తిరుగుబావుటా ఎగరవేసి చివరకు పార్టీ నుంచి బ‌హిష్కరణకు సైతం గురయ్యారు. ఆ తర్వాత నిరాహార దీక్ష కూడా చేశారు. వాస్తవంగా చూస్తే నియోజకవర్గంలో అశోక్‌బాబుకు పట్టుంది. కానీ, వై.వి.సుబ్బారెడ్డి చక్రం తప్పి అశోక్‌బాబును పక్కన పెట్టారన్న విమర్శలు సైతం ఉన్నాయి. చివరకు అశోక్‌బాబుకు నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా కొంత వ్యక్తిగత క్రేజ్‌ ఉందన్న విషయాన్ని గ్రహించిన అధిష్టానం రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విజయసాయి రెడ్డి ఆయనకు హామీ ఇచ్చాక ఆయన దీక్ష విరమించారు. ఏదేమైనా నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న వాతావరణాన్ని బట్టీ చూస్తే వెంకయ్య కన్నా అశోక్‌బాబే బలమైన ప్రత్యర్థి అవుతారనడంలో సందేహం లేదు. ఫైన‌ల్‌గా చూస్తే కొండపి నియోజకవర్గంలో అటు అధికార టీడీపీతో పాటు ఇటు విపక్ష వైసీపీలోనూ వర్గ పోరు భ‌గ్గుమంటోంది. మరి ఇందులో నుంచి ఎవరు బయట పడితే వాళ్లదే కొండపి విక్టరీ.

Tags:    

Similar News