విశాఖకు రాజధాని వస్తే వారికి దెబ్బేనా…?

విశాఖకు రాజధాని వద్దు అని తెలుగుదేశం పార్టీ అంటోంది. అసలు విశాఖ జనాలు రాజధానిని కోరుకోవడం లేదని కూడా ఒక వాదన వినిపిస్తున్నారు. దీనికి తార్కిక‌త ఎక్కడా [more]

Update: 2020-10-19 00:30 GMT

విశాఖకు రాజధాని వద్దు అని తెలుగుదేశం పార్టీ అంటోంది. అసలు విశాఖ జనాలు రాజధానిని కోరుకోవడం లేదని కూడా ఒక వాదన వినిపిస్తున్నారు. దీనికి తార్కిక‌త ఎక్కడా లేదు. పార్టీ స్టాండ్ కాబట్టి చెబుతున్నామని కొంతమంది తమ్ముళ్ళు అంటున్నారు. సరే రాజధాని వద్దు అని, అభివృద్ధి వద్దు అని ఎవరైనా అంటారా. ఇది కూడా లాజిక్ లేని వాదనే. నిజం చెప్పాలంటే గత వందేళ్ళుగా విశాఖ అన్నీ ఉండి కూడా ఏమీ లేని దైన్యాన్ని అనుభవిస్తోంది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో రాజధాని కోసం నానా పరుగులు పెట్టి ఇక్కడ వారు వెళ్లేవారు. ఆ తరువాత కర్నూలు, హైదరాబాద్, అమరావతి, మరి అన్నీ చోట్లకు తిరిగి కాళ్ళు అరిగిన చరిత్ర ఈ ప్రాంతీయులది.

మూగబోయిన గొంతు…

విశాఖలో మొదటి నుంచి స్థానికులు సాత్వికులు. పైగా ఎవరు బయట నుంచి వచ్చిన వారిని సమాదరించే స్వభావం కలిగిన వారు. తాము వలస పోతూ ఇక్కడ వలస నేతలకు రాజ్యాలు, పదవులు అప్పగించే మెతకవారు. అందుకే విశాఖ గత నాలుగు దశాబ్దాలుగా వలస పెత్తనంతో సలసల మరుగుతోంది. విశాఖలో ఉన్న స్థానికులకు అర్ధ బలం అంగబలం లేకపోవడంతో వలస నాయకుల కిందన పనిచేయడానికి అలవాటుపడ్డారు.దీంతో అలుసుగా తీసున్న వలస నాయకులు తమ రాజకీయ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయారు. ఇపుడు వారి ఆధిపత్యానికి గండి పడుతుందనే విశాఖ‌ రాజధానిని అడ్డుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి.

వారే అలా…..

ఇక ఏపీ రాజకీయ చరిత్రలో మేలి మలుపుగా 1980 దశకాన్ని చెప్పుకోవాలి. తెలుగువారి ఇలవేలుపుగా ఎన్టీయార్ వచ్చి పార్టీ పెట్టారు. కులమత భేదం లేకుండా అంతా ఆయన్ని అక్కున చేర్చుకుని ఓటేశారు. ఆ తరువాత జరిగిన పరిణామాలు చూస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా కుల భావన ఏపీని కమ్మేసింది. ఏపీవ్యాప్తంగా ఒక సామాజికవర్గం ప్రతీ జిల్లాకు తరలివచ్చి తమ ఆధిపత్యాన్ని బలంగా చాటుకుంది. ఈ క్రమంలో విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాలకు కూడా ఆ సామాజికవర్గం విస్తరించింది. ఇక విశాఖ సిటీ చూసుకుంటే కీలకమైన పదవులు వారి చేతుల్లోనే ఉన్నాయి. అధికారమైనా, ప్రతిపక్షమైనా కూడా వారిదే హవా. ఇపుడు రాజధాని వస్త్రే పొలిటికల్ ట్రాఫిక్ బాగా పెరుగుతుంది. అంతే కాదు సామాజిక సమీకరణలు కూడా ఒక్క లెక్కన మారుతాయి. అందుకే వారు కోరి మరీ అడ్డుకుంటున్నారు అని స్థానిక జనంలో వినిపిస్తున్న అతి పెద్ద ఆరోపణ.

సమతూల్యత కోసమైనా…?

రాజధాని వస్తే ఫ్లోటింగ్ పెరుగుతుంది.అన్ని వర్గాలు ఇక్కడకు వస్తాయి. దాంతో సామాజిక సమతూల్యత కూడా సాధ్యపడుతుంది అని మేధావులు అంటున్నారు. ప్రజాస్వామ్యంలో రాచరిక పాలనకు తావు లేదు, అంతే కాదు, ఒకరే దశాబ్దాల పాటు పెత్తనం చేసే పరిస్థితి కూడా మారాలని అంతా కోరుకుంటున్నారు. ప్రగతి లేకనే ఉత్తరాంధ్రాలో వలసలు పెరిగాయి. అదే ఇక్కడే జరిగితే వారు కూడా అన్ని రకాలుగా ప్రయోజనం పొందుతారు. రేపటి రోజున రాజకీయంగా అవకాశాలు అందుకుంటారు. దాన్ని సాగనివ్వకూడదు అన్న తీరున జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని లోకల్స్ నుంచి వస్తున్న మాట. విశాఖ రాజధాని వద్దు అన్నది పుట్టెడు మంది పెట్టుబడిదారులు మాత్రమేనని అంటున్నారు. ఒకసారి కనుక క్యాపిటల్ సిటీ వస్తే రాజకీయ భూస్వాముల తలరాతలు పూర్తిగా మారిపోతాయని అంటున్నారు.

Tags:    

Similar News