ఇదేం బెదిరింపు తమ్ముళ్ళూ ?

ప్రత్యేక హోదా, విభజన అంధ్రప్రదేశ్ కి ప్రాణ సమానం. అసలు ఉమ్మడి ఏపీని ఇష్టం లేకుండా విడగొట్టారు. దానికి బుజ్జగింపుగా ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా. యూపీయే [more]

Update: 2019-06-24 10:30 GMT

ప్రత్యేక హోదా, విభజన అంధ్రప్రదేశ్ కి ప్రాణ సమానం. అసలు ఉమ్మడి ఏపీని ఇష్టం లేకుండా విడగొట్టారు. దానికి బుజ్జగింపుగా ఇచ్చిన హామీ ప్రత్యేక హోదా. యూపీయే ఆద్వర్యంలో క్యాబినెట్ ఆమోదించి అప్పటి 14వ ఆర్ధిక సంఘానికి పంపించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సర్కార్ దాన్ని పక్కన పెట్టేసింది. అసలు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసిందే బీజేపీ, అయిదేళ్ళు యూపీయే ఇస్తే తాము అధికారంలోకి వస్తే పదేళ్ళు ఇస్తామని చెప్పిన వారు కమలనాధులు. మోడీ ప్రధాని అభ్యర్ధి హోదాలో తిరుపతి సభలో ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టంగా హామీ ఇచ్చారు. చంద్రబాబు ( తెలుగుదేశం ) ముఖ్యమంత్రిగా ఉన్న అయిదేళ్ళ కాలంలో హోదా రాలేదు, ప్యాకేజీ లేదు. ఇపుడు జగన్ నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం ఏపీలో ఏర్పడింది.

హోదా ఇవ్వరంటే ఇవ్వరట :

ఈ మాటలు బీజేపీ వారు అనడంలేదు. ఏపీలో దారుణంగా ఓడిపోయిన తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దే రామ్మోహనరావు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వీళ్ళంతా హోదా రాదని ముందే చెప్పేస్తున్నారు. హోదాని ఎపుడు తెస్తారో చెప్పాలని కేశినేని నాని జగన్ ని డిమాండ్ చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చి ఇరవై రోజులు కూడా కాలేదన్నది ఆయన మరచిపోయారు. ఇక గద్దె రామ్మోహన్ అయితే హోదా ఇవ్వరని పక్కాగా తేల్చేశారు. గంటా వంటి వారు హోదా జగన్ కూడా తేలేరని కచ్చితంగా చెప్పేస్తున్నారు. వీరందరితో పాటు టీడీపీ ఫిరాయించి బీజేపీలో చేరిన కొత్త పూజారి సుజనా చౌదరి తన తొలి పలుకుల్లోనే హోదా ముగిసిన అధ్యాయమని అనేశారు. మరి ఏపీకి చెందిన తెలుగుదేశం నేతలే ఇలా వ్యతిరేకంగా మాట్లాడితే బీజేపీకి ఎందుకు ఇవ్వాలనిపిస్తుంది.

కలసి రారా :

నిజానికి ఏపీలోని అన్ని పార్టీలు హోదా మీద రాజకీయమే చేస్తున్నాయి. నాడు తెలుగుదేశం హోదాని పట్టించుకోలేదు. కనీసం అఖిలపక్షం వేయలేదు. ఇపుడు జగన్ హోదా విషయంలో గట్టిగానే ఉన్నారు. అయితే ఆయనకు తెలుగుదేశం సహకరించే అవకాశాలు అసలు లేవు. ఏపీకి జగన్ ద్వారా హోదా వస్తే టీడీపీ రాజకీయం దెబ్బ తింటుంది. దాంతో వారు రాకూడదనే కోరుకుంటున్నారని తమ్ముళ్ల మాటలు బట్టి తెలుస్తోంది. మరో వైపు ఏపీలో బీజేపే నాయకులు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినా కూడా ఏపీ జనం సెంటిమెంట్ ని అర్ధం చేసుకోలేకపోతున్నారు. హోదా ససేమిరా ఇవ్వమని కచ్చితంగా చెప్పేస్తున్నారు. ఈ నేపధ్యంలో జగన్ ది పూర్తిగా ఒంటరి పోరాటమే అవుతుంది. మోడీ దయ, జగన్ ప్రాప్తం అన్నట్లుగా హోదా డిమాండ్ తయారైంది.

Tags:    

Similar News