ఆయన వస్తే మరి ఈయనో…?

అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేకు వింత సమస్య ఎదురవుతోంది. ఆయనకు ఎప్పుడూ ప్రశాంతత ఉండటం లేదు. తన ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకుంటే తన పరిస్థితి ఏంటన్నది ఆయన [more]

Update: 2019-11-13 06:30 GMT

అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేకు వింత సమస్య ఎదురవుతోంది. ఆయనకు ఎప్పుడూ ప్రశాంతత ఉండటం లేదు. తన ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకుంటే తన పరిస్థితి ఏంటన్నది ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు. ఆయనే ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన అన్నా రాంబాబు. తన ప్రత్యర్థి, టీడీపీ నేత అశోక్ రెడ్డి తిరిగి వైసీపీ గూటికి చేరుతున్నారన్న ప్రచారం తో ఆయన కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. నిజంగా అశోక్ రెడ్డిని వైసీపీలో చేర్చుకుంటే తాను తీసుకోవాల్సిన నిర్ణయంపై అన్నా రాంబాబు సన్నిహితులతో చర్చిస్తున్నారట.

కంచుకోట లాంటి….

విషయంలోకి వెళ్తే… గిద్దలూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. ముఖ్యంగా జగన్ పార్టీకి ఇక్కడ తిరుగులేదనే చెప్పాలి. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీయే విజయం సాధించింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన అన్నా రాంబాబు తర్వాత టీడీపీలో చేరారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి అన్నా రాంబాబు ఓటమిపాలయ్యారు. ఇక్కడ వైసీపీ నుంచి ముత్తముల అశోక్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా అశోక్ రెడ్డి అప్పట్లో టీడీపీలోకి చేరిపోయారు. దీంతో అప్పటి వరకూ గిద్దలూరు టీడీపీ ఇన్ ఛార్జిగా ఉన్న అన్నా రాంబాబు వైసీపీలో చేరిపోయారు.

అప్పట్లో అలాగే….

తన ప్రత్యర్థి అశోక్ రెడ్డి టీడీపీలో చేరడంతోనే అధికార పార్టీని వీడి అప్పట్లో అన్నా రాంబాబు వైసీపీలో చేరారు. జగన్ కూడా అన్నా రాంబాబుకు సీటు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో గెలిచిన అన్నారాంబాబు ఇక గిద్దలూరులో తనకు తిరుగులేదనుకుంటున్న సమయంలో ముత్తముల అశోక్ రెడ్డి వైసీపీలోకి వస్తున్నారన్న వార్త ఆయనకు నిద్రపట్టనివ్వడం లేదు. అశోక్ రెడ్డి వర్గాన్ని అన్నా రాంబాబు అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుండటంతో ఆయన వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది.

అశోక్ రెడ్డి చేరితే…..

అశోక్ రెడ్డికి జగన్ తో మంచి సంబంధాలున్నాయి. ప్రకాశం జిల్లాలో వైవీసుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసులురెడ్డి తర్వాత అశోక్ రెడ్డినే జగన్ దగ్గరకు తీసేవారు. పార్టీ మారడంతో జగన్ కూడా అపట్లో అశోక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారట. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో అశోక్ రెడ్డి ఓటమి పాలు కావడంతో తిరిగి చేరేందుకు చేసిన ప్రయత్నాలకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అన్నా రాంబాబుకు ఇబ్బంది కలగకుండా అశోక్ రెడ్డి చేరిక ఉండాలన్నది జగన్ అభిప్రాయంగా తెలుస్తోంది. అయితే అశోక్ రెడ్డిని వైసీపీలో చేర్చుకుంటే ప్రస్తుత ఎమ్మెల్యే అన్నా రాంబాబు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News