స్కెచ్ ఆయనది.. సీన్ పండించింది ఈయన

జగన్ సర్కార్ని సాధించేందుకు ఏ ఒక్క అవకాశాన్ని టీడీపీ అసలు వదులుకోవడంలేదు. ఆ సంగతి అందరికీ తెలిసిందే. అది కరోనా మహమ్మారి కావచ్చు. నెత్తిన పిడుగు పడి [more]

Update: 2020-04-08 08:00 GMT

జగన్ సర్కార్ని సాధించేందుకు ఏ ఒక్క అవకాశాన్ని టీడీపీ అసలు వదులుకోవడంలేదు. ఆ సంగతి అందరికీ తెలిసిందే. అది కరోనా మహమ్మారి కావచ్చు. నెత్తిన పిడుగు పడి ప్రళయం విలయతాండవం చేసినా కూడా మా రాజకీయం ఇదేనని టీడీపీ పెద్దలు బాహాటంగా చెప్పేసుకున్నాక ఇక జరిగేది ఇలాగే ఉంటుంది. జగన్ ని ఎక్కడికక్కడ దెబ్బ తీస్తూ తన బుర్రకు పదును పెడుతున్న చంద్రబాబు ఆయన్ని ఇప్పటికి ఎన్నో పిల్లి మొగ్గలు వేయించాడన్నది అందరికీ తెలిసిందే. ఇంకేముందీ, మూడు రాజధానులూ బిల్లు అసెంబ్లీలో బాజా భజంత్రీలతో సర్వామోదం పొందింది, శాసనమండలిలో లాంచనం అనుకున్న వేళ మండలి చైర్మన్ షరీఫ్ ద్వారా విచక్షణాధికారం ప్రయోగించి గట్టి దెబ్బ కొట్టారు. ఇక ఈ మధ్యన స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడం వెనక కూడా టీడీపీ రాజకీయం ఉందని వైసీపీ ఆరోపించిన సంగతి విదితమే. వాయిదా నిర్ణయం సబమే అయినా కూడా ప్రభుత్వాన్ని, జగన్ ని పూచిక పుల్ల కింద పక్కన పెట్టడం మాత్రం ఘోరమైన తప్పే. దాని వెనక స్కెచ్ టీడీపీదేనని అంతా ఒప్పుకుంటారు, చెప్పుకుంటారు.

డాక్టర్..పొలిటీషియన్ గా….

విశాఖ జిల్లా నర్శీపట్నంలోని ఓ ఏరియా ఆసుపత్రిలో ఆయన ప్రభుత్వ వైద్యుడు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేయరు. అది సర్వీస్ రూల్స్ కి విరుద్ధం కూడా. కానీ ఇక్కడ జరిగింది మాత్రం అదే. ఆ డాక్టర్ గారు అచ్చంగా పొలిటీషియన్ అవతారం ఎత్తేశారు. రాజకీయ పరిభాషలో జగన్ సర్కార్ మీద ఓ రేంజిలో రెచ్చిపోయారు. ప్రభుత్వ వైద్యులకు మాస్కులు లేవని, ఇతర వైద్య పరికరాలు లేవని, తమను బలి పెడతారా? అంటూ ఎక్కడ గుచ్చాలో అక్కడే గుచ్చేశారు. తెలంగాణా సర్కార్ ప్రస్తావనను కూడా మధ్యలోకి తెచ్చి మరీ ఏపీ సర్కార్ని బదనాం చేశారు. నిజంగా ఇది అసాధారణమైన విషయమే. ప్రభుత్వ ఉద్యోగి బాధ్యత మరచి రాజకీయ విమర్శలు చేయడం అన్నది సీరియస్ గానే చూడాలి.

వెనక ఆయనట…..

ఇంత ధైర్యం ఒక సాధారణ వైద్యుడిలో ఎలా వచ్చింది. అదీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల రాజకీయ పరిభాష మాట్లాడడం, జగన్ సర్కార్ మీద విమర్శలు ఎక్కుపెట్టడం అంటే ఆయన వెనక ఎవరున్నారు అంటే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఉన్నారని వైసీపీ ఎమ్మెలే పెట్ల ఉమా శంకర్ గణేష్ అంటున్నారు. ఆయన అయ్యన్నకు బాగా సన్నిహితుడట. ఆయనతో మాట్లాడిన తరువాతనే డాక్టర్ ఈ రకమైన కామెంట్స్ చేశారని సాక్ష్యాధారాలతో సహా ఉమా శంకర్ నిరూపించారు. సరే ఈ సంగతి పక్కన పెడితే ఈ డాక్టర్ గారికి కూడా విచక్షణ ఇపుడే గుర్తుకు వచ్చిందా? ఆయన సైతం చాలా తేలికగా ఒక ప్రభుత్వం మీద విమర్శలు చేశారూ అంటే ఇది చాలా పెద్ద విషయంగా చూడాలంటున్నారు.

పరువు తీయాలనే….

జనమంతా కరోనా విపత్తు మీద భయంపడుతున్నారు. ప్రభుత్వాలు తాము చేస్తున్న చర్యల గురించి చెబుతూ వస్తున్నాయి. అయితే ఇంట్లో కూర్చున్న సామాన్యుడు టీవీల ముందు ఇలా ఒక ప్రభుత్వ వైద్యుడే పాలకులను తప్పుపడుతూంటే ఆసక్తిగా వింటారు. అంతే కాదు అదే నిజం అనుకుంటారు. అవే ఆరోపణలు టీడీపీ తమ్ముళ్ళు చేస్తే పెద్దగా రియాక్ట్ కాని వారు కూడా ప్రభుత్వ వైద్యుడు చెప్పాడంటే చాలా నమ్మకంగా వింటారు. ప్రభావానికి లోనవుతారు. ఆ విధంగా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది. జనంలో భయం కూడా పెరుగుతుంది. మొత్తానికి ఇంత జరగాలనేనా ఆయన్ని రంగంలోకి తీసుకొచ్చారు అని వైసీపీ నేతలు అంటున్నారు. తమను బదనాం చేయడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ కి చంద్రబాబు రెడీ అయ్యారని మంత్రి పేర్ని నాని అంటున్నారు. ఒక సాధారణ వైద్యుడు ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తారని కూడా ఆయన ప్రశ్నించారు.

టీడీపీ సక్సెస్ అయిందా…?

ఇవన్నీ పక్కన పెడితే ఆయన వైద్యం చేస్తున్న ఏరియా ఆసుపత్రి కోవిద్ 19 ఆసుపత్రి కానే కాదుట. ఈయన ఒక మత్తు డాక్టరట. ఇక అక్కడ వైద్య పరికరాలు ఈ నెల 3 నాటికే ప్రభుత్వం సిధ్ధం చేసి పెట్టిందట. ఇంత చేసినా అబద్దాలు ఆ వైద్యుడు ద్వారా చెప్పించి టీడీపీ రాజకీయంగా సక్సెస్ అయిందా. తమ ప్రభుత్వంలోనే ఇలాంటి విచక్షణతో పనిచేసే అధికారులు ఎంతమంది ఉన్నారో వైసీపీ సర్కార్ గుర్తించలేకపోతుందా అన్న డౌట్లు వస్తాయి. దేశంలో ఇంతవరకూ ఎక్కడా లేని విధంగా ప్రభుత్వాలనే సవాల్ చేసే అధికారులు, వ్యవస్థలను ఒక్క ఏపీలోనే వైసీపీ ఏలుబడిలోనే చూస్తున్నారు. మరి దాని వెనక సర్కార్ అసమర్ధత ఉందా, టీడీపీ రాజకీయ చాణక్యం ఉందా. ఏది ఏమైనా పరువు మాత్రం పోతోంది. అంతే.

Tags:    

Similar News