పవన్ చాలు.. కమలాలు వద్దు… ?

తెలుగుదేశం స్ట్రాటజీ మెల్లగా మారుతోందిట. ఏపీ రాజకీయాలో తన రూట్ ఏంటో ఆ పార్టీకి మెల్లగా అర్ధమవుతోంది అంటున్నారు. మోడీ, అమిత్ షా ఉన్న బీజేపీలో ఎటూ [more]

Update: 2021-06-30 08:00 GMT

తెలుగుదేశం స్ట్రాటజీ మెల్లగా మారుతోందిట. ఏపీ రాజకీయాలో తన రూట్ ఏంటో ఆ పార్టీకి మెల్లగా అర్ధమవుతోంది అంటున్నారు. మోడీ, అమిత్ షా ఉన్న బీజేపీలో ఎటూ టీడీపీకి ఆహ్వానాలు ఉండవు, అవమానాలు తప్ప. ఇక బీజేపీ మీద దేశంలోనే కాదు, ఏపీలోనూ పీక బండెడు కోపాలు ఉన్న తరువాత పొత్తు పెట్టుకుంటే తామూ మునిగిపోవడం ఖాయమన్న ఆలోచనలు ఎవరో పసుపు పార్టీ పెద్దలకు కలుగుతున్నాయట. అందుకే జనసేనాని పవన్ కల్యాణ్ చేరదీసేందుకు రెడీ అవుతోందిట.

అలా మొదలెట్టి …?

ఏపీలో ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన విషయంలో భారీ ఉద్యమాన్ని చేపడతామని ఆంధ్రా మేధావుల సంఘం ప్రెసిడెంట్ చలసాని శ్రీనివాస్ తాజాగా చెబుతున్నారు. జగన్ కి రెండేళ్ళు మాత్రమే టైమ్ ఇచ్చామని ఆయన అంటున్నారు. కేంద్రాన్ని వైసీపీ నేతలు అసలు నిలదీయలేకపోతున్నారు అంటూ ఆయన మండిపడుతున్నారు. మొత్తానికి మొత్తం వైసీపీ ఎంపీలు మోడీ ఇంటి ముందు ధర్నా చేయాలని కూడా పిలుపు ఇచ్చారు. ఇక మలి విడత హోదా ఉద్యమం ఏపీలో తీవ్రంగా ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. విపక్షాలు కూడా తమ పోరాటానికి కలసి రావాలని కోరుతున్నారు.

సేమ్ సీన్ రిపీట్….

అప్పట్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చలసాని సహా వామపక్షాలు, కాంగ్రెస్ నేతలు అంతా హోదా విషయంలో ఆందోళన చేపట్టారు. ఇపుడు జగన్ సీఎం. మళ్ళీ హోదా ఉద్యమం అంటున్నారు. నాడు హోదా ఉద్యమ ఫలితాలను వైసీపీ అందుకుంది. ఇపుడు టీడీపీ రెడీగా ఉందా. అంటే అవును అన్న మాట వినిపిస్తోంది. జగన్ జాబ్ క్యాలండర్ ఎవరికి కావాలి. హోదా వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయి అంటూ అపుడే సమర నినాదాన్ని టీడీపీ వినిపిస్తోంది. కేంద్రం నుంచి రావాల్సింది ఎందుకు తెచ్చుకోరు అంటున్నారు చలసాని, తాము ముందుండి మోడీ మీద పోరు సలుపుతామని, ప్రజలంతా తమ వైపేనని కూడా ఆయన అంటున్నారు.

ఇదే వ్యూహం …?

ఇక చలసాని లాంటి వారు రంగంలోకి దిగడం వెనక కూడా వ్యూహాలు ఉన్నాయా అంటే ఆలోచించాల్సిందే అన్న జవాబు వస్తుంది. ఏపీలో బీజేపీకి ఇప్పటికీ ఓటు బ్యాంక్ సరైనది లేదు. పైగా దేశంలో మోడీ క్రేజ్ తగ్గిపోతోంది. దాంతో బీజేపీ తో జట్టు కట్టిన పవన్ కల్యాణ్ ని తమ వైపు తిప్పుకుంటే చాలు ఏపీలో వైసీపీని, బీజేపీని కూడా బదనాం చేయవచ్చు అన్న పక్కా ప్లాన్ ఏదో పసుపు పార్టీ దగ్గర ఉందని అంటున్నారు. తమ చేతికి మట్టి అంటకుండా ప్రజా సంఘాలు, హోదా సాధన సమితి వారు ఉద్యమిస్తే వాటి ఫలాలు తాము పొందవచ్చు అన్నదే ఆలోచనట. నాడు మోడీని ఒక్క మాట అనకుండా జగన్ చంద్రబాబునే టార్గెట్ చేసేవారు, ఇపుడు కూడా జగన్ ని టార్గెట్ చేస్తూ టీడీపీ రంగంలోకి వస్తుంది, హోదా మీద పోరాడుతుంది అంటున్నారు. ఇక బీజేపీని బ్యాడ్ చేస్తూ పవన్ కల్యాణ్ ని చేరదీస్తే రానున్న రోజుల్లో ఏపీలో రాజకీయం తమకు అనుకూలం అవుతుందన్నదే చంద్రబాబు మాస్టర్ ప్లాన్ అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News