డెసిషన్ ఎలా ఉంటుందో?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు మరో రోజు మాత్రమే గడువుంది. అయితే ఈ సమావేశాలకు ఒక ప్రత్యేకత ఉందని చెప్పాలి. ఈ సమావేశాల్లో శాసనసభ స్పీకర్ తమ్మినేని [more]

Update: 2019-12-08 09:30 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు మరో రోజు మాత్రమే గడువుంది. అయితే ఈ సమావేశాలకు ఒక ప్రత్యేకత ఉందని చెప్పాలి. ఈ సమావేశాల్లో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంది. ఈసారి శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. అధికార, విపక్షాలు పైచేయి సాధించుకునేందుకు ఖచ్చితంగా ప్రయత్నిస్తాయి. ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం, పోలవరం, రాజధాని అమరావతి అంశాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది.

రెండు విషయాల్లో…..

ఇక స్పీకర్ తమ్మినేని సీతారాం రెండు విషయాల్లో కీలక నిర్ణయాలను ప్రకటించాల్సి ఉంది. ఒకటి వల్లభనేని వంశీ వ్యవహారాన్ని తేల్చాల్సి ఉంది. ఇప్పటికే వల్లభనేని వంశీ తనను టీడీపీ నుంచి సస్పెండ్ చేశారని స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీనిపై తమ్మినేని సీతారాం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. వల్లభనేని వంశీని స్వతంత్ర సభ్యుడిగా గుర్తించి వేరే సీటు కేటాయిస్తారా? లేదా? అన్నది ఆయన నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.

సభా హక్కుల ఉల్లంఘన…..

అలాగే టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్, మాజీ చీఫ్ విప్ కూన రవికుమార్ లపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చారు. ఇప్పటికే నారా లోకేష్ కు, కూన రవికుమార్ లకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపారు. ముఖ్యమంత్రి జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాంలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వీరిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. దీనిపై స్పీకర్ తమ్మినేని సీతారాం తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఈ సమావేశాల్లోనే ఉంది.

హాట్ హాట్ గా…..

డిసెంబరు 9వ తేదీ నుంచి పదిరోజుల పనిదినాలుగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఈ రెండు విషయాలపైనే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ కూడా స్పీకర్ నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠతో ఎదురు చూస్తుందనే చెప్పాలి. ఈ సమావేశాల్లో అనేక అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదం జరిగే అవకాశాలు ఎక్కువ. అందుకే ఏపీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగనున్నాయి.

Tags:    

Similar News