ఆ వారసుడికి జగన్ ఓకే… కీలక టిక్కెట్ కూడా?

రాజ‌కీయాల్లో నేత‌ల వారసుల ఎంట్రీకి కొద‌వ‌లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అంద‌రూ త‌మ త‌మ వార‌సుల‌ను రంగంలోకి దింపుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో [more]

Update: 2020-12-13 12:30 GMT

రాజ‌కీయాల్లో నేత‌ల వారసుల ఎంట్రీకి కొద‌వ‌లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా అంద‌రూ త‌మ త‌మ వార‌సుల‌ను రంగంలోకి దింపుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో సీమ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్కువ‌గా వార‌సులు రంగంలోకి దిగి త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకున్నారు. టీడీపీ నుంచి రంగంలోకి దిగిన వార‌సుల్లో ఒక‌రు త‌ప్ప అంద‌రూ క‌ట్టగ‌ట్టుకుని ఓడిపోయారు. వైసీపీ వార‌సులు మాత్రం అంద‌రూ బంప‌ర్ విజ‌యం సాధించారు. ఈ ప‌రంప‌రలో మ‌రో నాయ‌కుడు కూడా రంగంలోకి దిగుతున్నార‌ని అంటున్నారు వైసీపీ నేత‌లు. స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం కుమారుడు నాగ్‌.. త్వర‌లోనే వైసీపీ నుంచి రాజ‌కీయ ర‌ణ‌రంగంలోకి దూకుతార‌న్న ప్రచారం జ‌రుగుతోంది. ఇంజ‌నీరింగ్ చ‌దివిన త‌మ్మినేని నాగ్‌.. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా క్రికెట్ అసోయేష‌న్ కు అధ్యక్షుడిగా ఉన్నారు.

తండ్రి విజయంలో….

అయితే.. రాజ‌కీయాల్లోకి రావాల‌నేది త‌మ్మినేని నాగ్‌ ఆలోచ‌న‌. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో సీతారాం గెలుపున‌కు నాగ్ ఎంతో కృషి చేశార‌ని ఆముదాల వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గంలో ప్రచారం ఉంది. యువ‌త‌ను ప్రధానంగా ఆక‌ర్షించి.. త‌న తండ్రికి ఓట్లు వేయించ‌డంలో త‌మ్మినేని నాగ్‌ మంచి వ్యూహంతో ముందుకు సాగార‌ని అంటున్నారు. ఇక, సీతారాం కూడా త‌న కుమారుడిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో బ‌రిలోకి దింపాల‌ని నిర్ణయించుకున్నార‌ని అంటున్నారు. త‌మ్మినేని ఇప్పటికే మూడున్నర ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో ఉంటున్నారు. టీడీపీలో ఉండ‌గా అప్పుడెప్పుడో 1999లో చివ‌రిగా గెలిచిన ఆయ‌న ఆ త‌ర్వాత ఇర‌వైయేళ్లకు గ‌త యేడాది మ‌ళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల వేళ ఆయ‌న త‌ప్పుకుంటారా ? లేదా ఇద్దరూ రంగంలో ఉంటారా ? అన్నది చూడాలి.

జగన్ కు పరిచయం చేసి….

తాజాగా ముగిసిన అసెంబ్లీ శీతాకాల స‌మావేశాల సంద‌ర్భంగా అసెంబ్లీకి వ‌చ్చిన త‌మ్మినేని నాగ్‌ను సీఎం జ‌గ‌న్‌కు ప‌రిచ‌యం చేశారు స్పీక‌ర్‌. ఈ క్రమంలో త‌మ్మినేని నాగ్‌ వ్యక్తిగ‌త వివ‌రాల‌ను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సంభాష‌ణ‌ల నేప‌థ్యంలోనే త‌న కుమారుడి రాజ‌కీయ అరంగేట్రం విష‌యాన్ని సీతారాం జ‌గ‌న్ చెవిలో ప‌డేశారు. దీనికి జ‌గ‌న్ కూడా సానుకూలంగా స్పందించార‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు. త్వర‌లోనే త‌మ్మినేని నాగ్‌ పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి రానున్నారు. శ్రీకాకుళంలోనే ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి నాగ్‌ను పోటీ చేయించాల‌ని స్పీక‌ర్‌ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

అందుకే దించుతున్నారా?

ఆముదాల వ‌ల‌స నుంచి సీతారాం పోటీ చేసినా.. మ‌రో నియోజ‌క‌వ‌ర్గాన్ని ఎంచుకుని త‌మ్మినేని నాగ్‌ను బ‌రిలోకి దింపుతార‌ని అంటున్నారు. అయితే ఒకే కుటుంబానికి జ‌గ‌న్ రెండు సీట్లు ఇస్తారా ? అన్నది స‌స్పెన్స్ అయినా జ‌గ‌న్ ఇక్కడ ఓ ట్విస్ట్ ఇవ్వడంతో ఈ కుటుంబానికి రెండు సీట్లు వ‌చ్చే ఛాన్స్ కూడా క‌నిపిస్తోంది. టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడుకు ధీటుగా ఎద‌గాల‌ని త‌మ్మినేని నాగ్‌కు జ‌గ‌న్ సూచించ‌డాన్ని బ‌ట్టి చూస్తే నాగ్‌కు శ్రీకాకుళం ఎంపీ సీటు ఇచ్చినా ఇవ్వొచ్చన్నదే జ‌గ‌న్ ఆలోచ‌నేమో ? చూడాలి.

Tags:    

Similar News