విశాఖకు విడాకులు ఇచ్చినట్లేనా ?

ఆయన నెల్లూరు రెడ్డి గారు. విశాఖకు నాలుగు దశాబ్దాల క్రితం వచ్చారు. మొదట స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టర్ గా టి సుబ్బరామిరెడ్డి తన ప్రస్థానం ప్రారంభించారు. ఆ [more]

Update: 2020-09-15 14:30 GMT

ఆయన నెల్లూరు రెడ్డి గారు. విశాఖకు నాలుగు దశాబ్దాల క్రితం వచ్చారు. మొదట స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టర్ గా టి సుబ్బరామిరెడ్డి తన ప్రస్థానం ప్రారంభించారు. ఆ మీదట కాంగ్రెస్ నేతలతో పరిచయాలు పెంచుకుని ఆ పార్టీ కి బడా లీడర్ గా మారిపోయారు. విశాఖలో హస్తం పార్టీకి చెందిన పెద్ద లీడర్లలో ఒకరిగా వెలుగులోకి వచ్చారు. మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ జెండా పట్టి కొండంత అండగా నిలిచారు. ఆయన రాజకీయ గురువు మాజీ ఎంపీ ద్రోణం రాజు సత్యనారాయణ మరణించడంతో ఇక విశాఖ కాంగ్రెస్ కి అన్నీ తానే అయ్యారు. తాను విశాఖ దత్తపుత్రుడిని అని ప్రకటించుకున్నారు.

అన్నీ ఇక్కడేగా ..?

పుట్టింది నెల్లూరు అయినా సుబ్బరామిరెడ్డి అంటే విశాఖ వాసి అని పేరు తెచ్చుకున్నారు. ఆయన పుట్టిన రోజులూ, శివరాత్రి వేళ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ కూడా విశాఖలోనే లక్షలాది జనం మధ్య నిర్వహిస్తూ అతి పెద్ద సెలిబ్రిటీగా మారిపోయారు. ఆయన మూడు సార్లు రాజ్య సభ సభ్యుడిగా, రెండు సార్లు విశాఖ లోక్ సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా దాదాపుగా పాతికేళ్ళ పాటు విశాఖను కేంద్రంగా చేసుకుని హవా చాటారు. అయితే కాంగ్రెస్ ఏపీలో పూర్తిగా నిర్వీర్యం కావడంతో పాటు ఇక ఎప్పటికీ లేవదు అని తేలడంతో సుబ్బరామిరెడ్డి కూడా మెల్లగా విశాఖ రాకపోకలు తగ్గించారని అంటారు.

కరుణించలేదా…?

మరోమారు రాజ్యసభ సభ్యునిగా ఉండాలని సుబ్బరామిరెడ్డి కోరిక. దాంతో ఆయన ఆ మధ్య ముఖ్యమంత్రి జగన్ని స్వయంగా కలసి కోరినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ జగన్ మాత్రం టూ లేట్ అనేశారని అప్పట్లో టాక్ వచ్చింది. నిజానికి జగన్ కాంగ్రెస్ నుంచి వేరు పడి అష్టకష్టాలు పడినపుడు టీఎస్సార్ వంటి వారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు అండగా ఉంటూ కూడా కనీసం ఓదార్పు మాటలను అయినా జగన్ కి చెప్పలేదని అంటారు. ఇక పదవుల కోసం కాంగ్రెస్ లో ఉంటూ అక్కడ అన్నీ ఆరిపోయాక చివరి నిమిషంలో తన దగ్గరకు వచ్చారని జగన్ భావించే సుబ్బరామిరెడ్డి విన్నపాన్ని పక్కన పెట్టరని తెలుస్తోంది.

అంతేగా మరి…..

విశాఖ తన కన్నతల్లి అని చెప్పుకునే టీయస్సార్ ఎపుడూ తన లెటర్ ప్యాడ్ మీద హైదరాబద్, ఢిల్లీ చిరునామాలనే ప్రచురించుకునేవారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. విశాఖ నుంచి ఎదిగినా ఈ ప్రాంతం సమస్యలను ఆయన ఎపుడూ పార్లమెంట్ లో ప్రస్తావించలేదని చెబుతారు. ఇక విశాఖలో ప్రతీ ఏటా తన పుట్టిన రోజు జరుపుకునే టీయస్సార్ ఈసారి కరోనా కారణంగా వాయిదా వేసినట్లుగా చెబుతున్నారు. అంటే ఆయన విశాఖ వచ్చే ఆ ఒక్క ఈవెంట్ కూడా ఇపుడు లేనట్లే. మొత్తానికి హైదరాబాద్, ఢిలీల్లోనే టీయస్సార్ స్థిరపడ్డారని స్థానిక కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్ కి కాని కాలం వస్తే అండగా ఉండాల్సిన టీయస్సార్ లాంటి పెద్దలు విశాఖకు విడాకులు ఇచ్చేశారని ఆ పార్టీలో వినిపిస్తున్న ఆవేదన. అయితే డెబ్బయ్యేళ్ళు పైదాటిన సుబ్బరామిరెడ్డి బయటకు చెప్పకపోయినా ఆయన రాజకీయ విరమణను ఇలా ప్రకటించారని కూడా వినిపిస్తోంది.

Tags:    

Similar News