ఇలాగయితే ఎలా? అంతా అనుకున్నట్లుగానేనా?

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది. దీని కట్టడికి రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసింది. దీనిపై అధికార పార్టీ భగ్గుమంది. ఐదు [more]

Update: 2020-03-21 17:30 GMT

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తుంది. దీని కట్టడికి రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసింది. దీనిపై అధికార పార్టీ భగ్గుమంది. ఐదు వేలకోట్ల రూపాయలు ఎపి కి రావాలిసిన నిధులు వెనక్కి పోతాయన్న ఆందోళన ప్రభుత్వానిది కావడంతో వ్యవహారం రాజకీయ మలుపులు తిరిగింది. విపక్షం మొత్తం ఎన్నికలు వాయిదా కోరింది. ఎపి ఎన్నికల సంఘం ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ చుట్టూ మొత్తం వ్యవహారం నడిచి చివరికి సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. ఇదంతా అందరికి తెలిసిందే.

ఏపీ కి అన్యాయం మధ్యప్రదేశ్ కి న్యాయం ఎలా …

ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల వాయిదాను సమర్ధిస్తూ ఎన్నికల కోడ్ సడలించి మధ్యే మార్గంగా తీర్పు ఇచ్చింది సుప్రీం కోర్ట్. అయితే దీనిపై ఎవరి అభ్యంతరాలు ఎలా ఉన్నా మధ్యప్రదేశ్ లో కమలనాధ్ ప్రభుత్వం మైనారిటీ లో పడిందని తక్షణం బలపరీక్ష నిర్వహించాలంటూ బిజెపి నాయకులు వేసిన కేసు లో మాత్రం వారికి అనుకూల తీర్పు వచ్చింది. ఈ రెండు కేసుల్లో పెద్ద తేడా ఏమీ లేదు. కొన్ని వందల మంది సామూహికంగా వుండే అసెంబ్లీ హాలు లో బలపరీక్ష అనేది స్థానిక ఎన్నికల కన్నా ప్రమాదకరమైనది అని సుప్రీం కోర్టు ఎందుకు గుర్తించలేదు అన్నది చర్చ గా మారింది. అదీ గాక కెమెరాలు పెట్టి చేతులు ఎత్తే ప్రక్రియ అని తీర్పులో ముక్తాయింపు ఇచ్చింది. ఈ వ్యవహారం కవర్ చేయడానికి వందలమంది జర్నలిస్ట్ లు అసెంబ్లీకి చేరుకుంటారు. అత్యంత ఉత్కంఠ కలిగించే ఈ ఫలితంపై అటు బిజెపి ఇటు కాంగ్రెస్ ఇతర రాజకీయ మద్దతుదారులు వేలాదిగా అసెంబ్లీ బయట గుమ్మికూడే ప్రమాదం ఉంది. అదృష్టవశాత్తూ కమలనాధ్ రాజీనామా చేసి బలనిరూపణ కు సిద్ధపడలేదు.

ఎమ్యెల్యేలకు నో కరోనా …?

మధ్యప్రదేశ్ స్పీకర్ సభను వాయిదా వేసినా సుప్రీం కరోనా వైరస్ వ్యాప్తిని సైతం పక్కన పెట్టి కేంద్రంలోని మోడీ సర్కార్ కి అనుకూల తీర్పు ఇచ్చిందా? అనే అనుమానాలు న్యాయవాద వర్గాల్లో సైతం వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి సుప్రీం తీర్పు సాధారణ రోజుల్లో అయితే ఏ ఒక్కరు తప్పుపట్టారు. కర్ణాటక లో కూడా ఇదే విధంగా సుప్రీం తీర్పు ఇచ్చి అందరి ప్రశంసలు అందుకుంది. సుప్రీం ఇచ్చిన తీర్పు కారణంగా మైనారిటీలో ఉండి ఎమ్యెల్యేలను ప్రలోభాలతో మ్యానేజ్ చేసి ముఖ్యమంత్రి పీఠం ఎక్కేద్దామన్న యడ్యూరప్ప ఆశలపై నీళ్లు చల్లేసింది అత్యున్నత న్యాయస్థానం. నాటి ఆ తీర్పును అంతా స్వాగతించారు కూడా. ఆ తరువాత లెక్క సరిచేసుకుని మొత్తానికి సిఎం సీటు లాగారు యడ్యూరప్ప.

వ్యవస్థలు కేంద్రం గుప్పిటలో …

అప్పుడు ఈ తీర్పు చెప్పడానికి చాలా రోజులే తీసుకుంది న్యాయస్థానం. అయితే నాడు కరోనా వైరస్ వంటి ఉపద్రవాలు ఏమి లేవు. కానీ మధ్యప్రదేశ్ విషయంలో చాలా వేగంగా అడుగులు వేసింది సుప్రీం. ఒక పక్క కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐదుగురు కన్నా గుమ్మి కూడదు అనే ఆంక్షలు దేశవ్యాప్తంగా అమలు చేస్తూ వివాహాలు, సభలు, సమావేశాలు నిషేధిస్తూ అన్ని మతాల ప్రధాన ప్రార్ధనాలయాలు మూసివేసిన తరుణంలో తక్షణం బలపరీక్ష కు ఆదేశించడం రాజు తలుచుకుంటే … అన్న చందంగా మారింది. దీనికి కారణాలను కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. సుప్రీం చీఫ్ జస్టిస్ గా పనిచేసిన రంజన్ గగోయి పదవీవిరమణ చేసేముందు కొన్ని కీలక తీర్పులు కేంద్రంలోని అధికారపార్టీకి అనుకూలంగా ఇచ్చారనే ప్రచారం దేశవ్యాప్తంగా కాంగ్రెస్, ఇతర పక్షాలు గట్టిగానే చేశాయి. రాజ్యాంగ పరిరక్షకుడిగా అత్యున్నత పదవి చేపట్టి కూడా ఆ తరువాత రాజ్యసభ వంటి పదవికి మాజీ చీఫ్ జస్టిస్ అంగీకరించడం న్యాయవ్యవస్థలో డొల్లతనాన్ని బయటపెడుతోంది.

నెత్తి నోరు కొట్టుకున్నా ….

ఆ మధ్య జస్టిస్ చలమేశ్వర్ వంటివారు సుప్రీం కోర్టు లో సాగుతున్న వ్యవహారాలను రోడ్డెక్కి ధైర్యంగా బయటపెట్టారు. ఆ తరువాత దేశానికి వెన్నెముక అయిన న్యాయవ్యవస్థ గాడిన పడుతుందని అంతా భావించినా ఆ నమ్మకాలు పెద్దగా పెట్టుకోవక్కర్లేదని ఇటీవల తిరిగి సుప్రీంకోర్టు పై పెరుగుతున్న విమర్శలు తేటతెల్లం చేస్తున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యవస్థలను తమకు అనుకూలంగా మలుచుకోవడం వల్లే ఇలాంటి పరిణామాలు రొటీన్ గా మారుతున్నాయన్న చర్చలు మొదలు కావడం వ్యవస్థలపై నమ్మకాన్ని సామాన్యులు వదులుకునేలా చేస్తుందన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఎపి పునర్విభజనలో పార్లమెంట్ రాజ్యాంగ విరుద్ధంగా ఓటింగ్ చేపట్టకుండా డివిజన్ లేకుండా నాటి యుపిఎ ప్రభుత్వం అడ్డగోలుగా రెండు రాష్ట్రాలను విడతీసిందని అన్ని యుపిఎ తప్ప అన్ని పార్టీలు పార్లమెంట్ వేదికగా గొంతెత్తి నినదించాయి. దీనిపై న్యాయం చేయాలంటూ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ వంటి వారు సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించి ఐదేళ్ళు దాటింది. అయినా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన నాటి తప్పులను కనీసం వేలెత్తి చూపడానికి సైతం భారత ప్రజాస్వామ్య అత్యున్నత న్యాయస్థానం వెనకడుగు వేస్తుందని మరోసారి తేలిపోయింది.

Tags:    

Similar News