రాజుల కోటలో భయంకర నిశ్శబ్దం !

రాజులు.. వారి కోటలూ అపుడూ ఇపుడూ అసక్తికరమే. దాన్నే ప్రజలు కూడా పెద్ద చరిత్రగానే చెప్పుకుంటారు. రాజ్యాలు పోయినా ఆధునిక సమాజంలో కూడా వారిని అదే తీరున [more]

Update: 2020-04-18 08:00 GMT

రాజులు.. వారి కోటలూ అపుడూ ఇపుడూ అసక్తికరమే. దాన్నే ప్రజలు కూడా పెద్ద చరిత్రగానే చెప్పుకుంటారు. రాజ్యాలు పోయినా ఆధునిక సమాజంలో కూడా వారిని అదే తీరున గౌరవిస్తారు. రాజులు అన్న పెద్దరికం, మర్యాదా ఇస్తారు. ఇక ప్రజాస్వామ్య యుగంలో ప్రజలే ప్రభువులు అయినా కూడా విజయనగరం జిల్లాల్లో మాత్రం రాచ కుటుంబాలకు పెద్ద పీట వేస్తారు. ఆ విధంగా గత శతాబ్ద కాలంగా ప్రజా ప్రతినిధులుగా ఆ వారసత్వాల నుంచి వచ్చిన నేతలు నెగ్గుతూ వస్తున్నారు. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది విజయనగరం పూసపాటి వారు, రెండవ వారు బొబ్బిలి రాజులు.

ఇద్దరూ ఇద్దరే ….

వియ్యానికైనా, కయ్యానికైనా సమ ఉజ్జీలు అన్నట్లుగా ఈ రెండు రాచ కుటుంబాలూ తమకు తామే సాటి, పోటీ అంటారు. విజయనగరం రాజులు మొదట్లో కాంగ్రెస్ లో ఉన్నా అశోక్, ఆనంద్ తరంలో టీడీపీ వైపుగా వచ్చారు. ఇక బొబ్బిలి వంశీకులు మొదటి నుంచి కాంగ్రెస్ లోనే కొనసాగారు. అయిదేళ్ళ క్రితం వైసీపీ నుంచి బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు టీడీపీలోకి వచ్చేంత వరకూ ఇద్దరివీ రెండు పార్టీలు, అటూ ఇటూ భీకర రాజకీయ సమరాలే.

సందడేదీ….?

ఇదిలా ఉండగా ఎన్నికల్లో ఓడిపోయేంతవరకూ ఇద్దరు రాజులూ బిజీగానే ఉంటూ వచ్చారు. పూసపాటి వారి శకం పరిసమాప్తం ఇక మనదే చక్రం అనుకుని బొబ్బిలి రాజు సుజయకృష్ణ రంగారావు మొదట్లో టీడీపీలో తన హవా చూపారు. అయితే ఎన్నికల వేళ అనూహ్యంగా బాబు వద్ద పరపతి పెంచుకుని అశోక్ జిల్లాలో మొత్తం టికెట్లు తన వారికి తెచ్చి జిల్లా టీడీపీలో అసలైన కింగ్ అనిపించుకున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో బొబ్బిలి రాజులు మళ్ళీ విజయనగరం రాజుల మీద గుస్సా అయ్యారు. ఆ తరువాత‌ ఏకంగా పార్టీయే దారుణంగా ఓడిపోవడంతో చడీ చప్పుడూ లేదు.

లాక్ డౌన్ వేళ ….

ఇక జిల్లాలో ఎందరు నేతలు ఉన్నా అగ్రభాగాన నిలిచి నడిపించే రాజులు సైలెంట్ గా ఉండడంతో ఎక్కడి వారు అక్కడే అన్నట్లుగా టీడీపీ తీరు ఉంది. స్థానిక ఎన్నికల సమయంలో కూడా కేవలం బొబ్బిలి వరకే పరిమితమైన సుజయ కృష్ణ రంగారావు, ఆ ఎన్నికలు వాయిదా పడడం, కరోనా నేపధ్యంలో లాక్ డౌన్ విధించడంతో విశాఖలోనే గడుపుతున్నారని ప్రచారం సాగుతోంది. ఇక తన మాన్సాస్ చైర్మన్ గిరీ, సింహాచలం ప్రధాన ట్రస్టీ పదవి పోయిన తరువాత అశోక్ దాని మీద పోరాడుతానని ప్రకటించారు. ఇపుడు లాక్ డౌన్ తో ఆయన సైతం అశోక్ బంగ్లాలో ఏకాంత వాసాన్ని ఎంచుకున్నారు. ఇలా ఇద్దరు రాజులూ ఎటువంటి చప్పుడూ లేకుండా రాజుగారి వాసాలకు పరిమితం కావడంతో రాజుల‌ కోటలో సైతం పూర్తిగా నిశ్శబ్దమే కనిపిస్తోంది. ఇది ఇంతకు ముందు ఎవరూ చూడనిది. కనీసమాత్రంగానైనా హడావుడి లేక కోటలు వెలవెలబోతున్నాయి. మళ్ళీ గత వైభవం ఎపుడో కదా అనుకుంటూ బాధగా నిట్టూరుస్తున్నారు పసుపు తమ్ముళ్ళు.

Tags:    

Similar News