రమణ స్థానంలో ఆయనేనటగా?

తెలంగాణ‌లో తెలుగు దేశం పార్టీ అధ్యక్ష ప‌గ్గాలుచేప‌ట్టేందుకు చాలా మంది నాయ‌కులు లైన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో బ‌లంగా ఉన్న టీడీపీ. తెలంగాణ‌లో ఒకింత బ‌ల‌హీనంగానే ఉంద‌ని [more]

Update: 2021-07-11 09:30 GMT

తెలంగాణ‌లో తెలుగు దేశం పార్టీ అధ్యక్ష ప‌గ్గాలుచేప‌ట్టేందుకు చాలా మంది నాయ‌కులు లైన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో బ‌లంగా ఉన్న టీడీపీ. తెలంగాణ‌లో ఒకింత బ‌ల‌హీనంగానే ఉంద‌ని చెప్పాలి. 2018 ఎన్నిక‌ల్లో కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసి.. రెండు స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకున్నప్పటికీ.. నాయ‌కులు నిల‌వ‌లేదు. అధికార టీఆర్ఎస్ దూకుడుతో నాయ‌కులు పార్టీ మారిపోయారు. ఇక గెలిచిన ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా కారెక్కేశారు. 2014లో టీటీడీఎల్పీని కేసీఆర్ త‌న పార్టీలో ఎలా విలీనం చేసుకున్నారో … 2018 త‌ర్వాత కూడా అదే ప‌నిచేశారు. ఎంతోమంది సీనియ‌ర్లు పార్టీ మారినా పార్టీలో మిగిలిన‌ నేత‌లు కొంత నిల‌దొక్కుకునేలా చంద్రబాబు ప్రయ‌త్నిస్తున్నారు.

రమణ రాజీనామాతో?

నిజానికి టీడీపీ ఏపీలో అధికారంలో ఉన్నసమ‌యంలో.. తెలంగాణ‌లో నేత‌ల‌కు నెల‌కు ఇంత‌ని ముట్టజెప్పారు. దీంతో పాటు వారి ఇత‌ర‌త్రా అవ‌స‌రాల‌కు సైతం నాడు పార్టీ అధికారంలో ఉండ‌డంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చంద్రబాబు చూసుకున్నారు. దీంతో పార్టీలో కేడ‌ర్ ఉన్నా లేకున్నా.. నాయ‌కులు పార్టీలోనే ఉన్నారు. కానీ, ఏపీలో అధికారం పోవ‌డంతో ఆ ఎఫెక్ట్ తెలంగాణ‌లోని పార్టీపైనా ప‌డింది. దీంతో ఇక్కడ నేత‌లు.. ఎవ‌రి దారి వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. ర‌మ‌ణ‌.. సైకిల్ దిగి అధికార పార్టీ కారెక్కేశారు. దీంతో ఇప్పుడు టీడీపీ తెలంగాణ అధ్యక్ష ప‌ద‌వికి నేత‌ను నియ‌మించాల్సిన అవ‌స‌రం ఏర్పడింది.

రావులకు ఇస్తే….?

ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఎలాంటి ప్రలోభాలకూ లొంగ‌కుండా.. పార్టీని డెవ‌ల‌ప్ చేసే నేత అవ‌స‌రం ఎంతో ఉంది. ఈ నేప‌థ్యంలో సీనియ‌ర్ నాయ‌కుడు రావుల చంద్రశేఖ‌ర్‌రెడ్డికి ఛాన్స్ ఇస్తే బాగుంటుంద‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌కు రెడ్డి నేత‌.. అధ్యక్షుడిగా ఉన్న నేప‌థ్యంలో రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని నిలుపుకొనేందుకు, అదే స‌మ‌యంలో వివాద ర‌హితుడు, పార్టీలో మూడు ద‌శాబ్దాలుగా ప‌నిచేస్తూ మంచి పేరున్న రావుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌నేది పార్టీలో అంత‌ర్గత చ‌ర్చ‌. అయితే పార్టీలో బీసీల‌కు ఛాన్స్ ఇస్తే.. తెలంగాణ‌లో కొంత వ‌ర‌కు ఉప‌యోగం ఉంటుంద‌ని కొంద‌రు చెపుతున్నారు.

పోటీలో అనేక మంది…?

అయితే.. టీడీపీ అధ్యక్ష పీఠం ఖాళీ అవుతుంద‌నే వార్తలు వ‌స్తున్న నేప‌థ్యంలోనే కొన్నాళ్లు మ‌రికొంత మంది నేత‌లు కూడా ఇదే పీఠాన్ని ద‌క్కించుకునేందుకు ప్రయ‌త్నిస్తున్నారు. వీరిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి , పార్టీ జాతీయ క్రమశిక్షణ సంఘం సభ్యుడు మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, సీనియర్‌ నేతలు అరవిందకుమార్‌ గౌడ్‌, కొత్తకోట దయాకర్‌రెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే.. వీరిలో ఎవ‌రు పార్టీని నిల‌బెడ‌తారు? ఎవ‌రికి అవ‌కాశం ఇవ్వడం ద్వారా ప్రధాన సామాజ‌క వ‌ర్గాన్ని ఆక‌ర్షించ‌వ‌చ్చు.. అనే విష‌యాల‌ను చంద్రబాబు లోతుగా ప‌రిశీలిస్తున్నట్టుతెలుస్తోంది. ఈ క్రమంలో ఎక్కువ మంది అభిప్రాయం.. రావుల వైపు ఉన్నట్టు తెలుస్తోంది. మ‌రి ఎవ‌రికి టీడీపీ ప‌గ్గాలు అప్పగిస్తారో చూడాలి.

Tags:    

Similar News