ఈయన వైపే అందరి చూపు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలూ ఎన్నికలకు సమాయత్తమయ్యాయి. కూటములు కూడా దాదాపు ఖరారయ్యాయి. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ కోసం అందరూ ఎదురు [more]

Update: 2020-11-14 18:29 GMT

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలూ ఎన్నికలకు సమాయత్తమయ్యాయి. కూటములు కూడా దాదాపు ఖరారయ్యాయి. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో కీలకమైన ఒక నేత కోసం తమిళనాడులోని అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. ఆయన సహకారం కోసం అర్థిస్తున్నాయి. ఆయనే ఆళగిరి. కరుణానిధి పెద్ద కుమారుడైన ఆళగిరి ఇప్పుడు ఎవరికి మద్దతిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

తండ్రి బతికున్నప్పుడే…..

తమిళనాడు రాజకీయాల్లో కరుణానిధి కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. అందులో ఆయన పెద్ద కుమారుడు ఆళగిరి కరుణానిధి జీవించి ఉన్నప్పుడు పార్టీలో చక్రం తిప్పారు. అదే సమయంలో తండ్రి ఛీత్కారానికి కూడా గురయ్యారు. కరుణానిధి మరణం తర్వాత ఆళగిరి కొంత అలజడి చేసినా తర్వాత మౌనంగానే ఉంటూ వస్తున్నారు. కరోనా కారణంగా వయసు రీత్యా ఆళగిరి బయటకు రావడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నా, కారణం వేరే ఉందన్నది రాజకీయనేతల కామెంట్స్.

సోదరుడు దగ్గరకు రానివ్వకపోవడంతో….

ఆళగిరిని చాకచక్యంగా పార్టీ దరిదాపుల్లోకి రానివ్వకుండా స్టాలిన్ చేయగలిగారు. పార్టీపై పూర్తి పెత్తనం చేస్తున్నారు. ఆళగిరి అనేక సార్లు కుటుంబ సభ్యులతో రాయబారం నడిపినా స్టాలిన్ మాత్రం ససేమిరా అనడంతో ఆళగిరి సైలెంట్ అయ్యారు. ఒకానొక దశలో ఆళగిరి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. తర్వాత రజనీకాంత్ పార్టీ పెడితే అందులో ఆళగిరి కీలక భూమిక పోషిస్తారని కూడా వార్తలు వచ్చాయి.

రజనీ పార్టీ కోసమేనా?

కానీ ఆళగిరి ఇప్పటి వరకూ ఏపార్టీలో చేరలేదు. అలాగని సోదరుడు తనను, తన కుటుంబాన్ని రాజకీయంగా ఆదరిస్తారన్న నమ్మకమూ లేదు. దీంతో ఆళగిరి ఏ పార్టీకి మద్దతిస్తారన్నది తమిళనాట ఆసక్తికరంగా మారింది. తనను విస్మరిస్తే ఏం జరుగుతుందో చెప్పాలన్నది ఆళగిరి ఆలోచనగా ఉంది. అందుకే ఆయన రజనీ పార్టీవైపు మొగ్గు చూపుతారంటున్నారు. రజనీకాంత్ పార్టీ ప్రకటించే వరకూ ఆళగిరి మౌనం వీడరని అంటున్నారు. ఇతర పార్టీలు కూడా ఆళగిరి కోసం ప్రయత్నిస్తున్నాయి. మరి చివరకు ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News