కుటుంబ సభ్యులకు వార్నింగ్ అలా ఇచ్చారా?

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత స్టాలిన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొలిసారి ముఖ్యమంత్రి కావడంతో ఎలాంటి మచ్చ రాకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లుంది. రాజకీయంగా తనకు ఎలాంటి [more]

Update: 2021-05-28 18:29 GMT

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత స్టాలిన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తొలిసారి ముఖ్యమంత్రి కావడంతో ఎలాంటి మచ్చ రాకూడదని ఆయన నిర్ణయించుకున్నట్లుంది. రాజకీయంగా తనకు ఎలాంటి మచ్చ తెచ్చినా సహించేది లేదని కుటుంబ సభ్యులను కూడా స్టాలిన్ హెచ్చరించినట్లు తెలిసింది. ప్రభుత్వ వ్యవహారాలకు, అవినీతి ఆరోపణలకు దూరంగా ఉండాలని స్టాలిన్ కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం.

పార్టీ మూడ్ తో వచ్చిన వారికి…?

స్టాలిన్ ది పెద్ద కుటుంబమే. అందరూ రాజకీయంగా అనుభవమున్న వారే. కనిమొళి నుంచి మారన్ కుటుంబ సభ్యుల వరకూ రాజకీయంగా కరుణానిధి ఉన్నప్పుడు ఎదిగిన వారే. కానీ ఇప్పుడు స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిసింది. గెలుపుతో పార్టీ మూడ్ తో వచ్చిన కుటుంబ సభ్యులకు ఈ సమావేశంలో షాక్ ఇచ్చారని చెబుతున్నారు.

మంత్రుల విషయంలో…?

ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాల్లో గాని, ప్రభుత్వ వ్యవహారాల్లో కాని జోక్యం చేసుకోకూడదని స్టాలిన్ షరతు విధించారు. అవసరమైతే తప్ప సచివాలయానికి కూడా రావద్దని స్టాలిన్ చెప్పినట్లు తెలిసింది. ప్రజలకు సంబంధించిన పనులు సంబందిత మంత్రితోనే మాట్లాడాలని, మంత్రికి తెలియకుండా కుటుంబ సభ్యులు ఎవరూ కల్పించుకోవద్దని, అది జరిగినట్లు తెలిస్తే తాను క్షమించబోనని కూడా స్టాలిన్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతున్నారు.

ఉదయనిధి కూడా…?

తన కుమారుడు ఉదయనిధిని కూడా స్టాలిన్ సుతిమెత్తంగా హెచ్చరించినట్లు చెబుతున్నారు. మంత్రులను బేఖాతరు చేస్తూ మంత్రిత్వ శాఖల్లో వేలు పెట్టవద్దని స్టాలిన్ సూచించారు. కుటుంబ సభ్యుల జోక్యంతోనే అనేక రాష్ట్రాల్లో అధికార పార్టీపై త్వరగా అసంతృప్తి తలెత్తిందన్న విషయాన్ని స్టాలిన్ ఈ సందర్భంగా గుర్తు చేసినట్లు తెలిసింది. మొత్తం మీద స్టాలిన్ కుటుంబ సభ్యుల జోక్యం పాలనలో లేకుండా ముందు జాగ్రత్త పడుతున్నారు.

Tags:    

Similar News