పాపం ధర్మాన…మంత్రికాదటగా

ధర్మరాజు లాంటి అన్న. వివాదాలకు దూరంగా ఉండే మనిషి. నమ్మిన పార్టీని అట్టిపెట్టుకుని వర్తమాన రాజకీయాలకు విలువ తెచ్చిన నేత. జగన్ అంటే అభిమానంతో పాటు, అవినీతి [more]

Update: 2019-08-15 05:00 GMT

ధర్మరాజు లాంటి అన్న. వివాదాలకు దూరంగా ఉండే మనిషి. నమ్మిన పార్టీని అట్టిపెట్టుకుని వర్తమాన రాజకీయాలకు విలువ తెచ్చిన నేత. జగన్ అంటే అభిమానంతో పాటు, అవినీతి మరకలేని నాయకుడు. ఇవే జగన్ ధర్మాన కృష్ణదాస్ ను మంత్రిని చేయడానికి ప్రధాన కారణాలు. ధర్మాన ప్రసాదరావు లాంటి ఉద్దండులు ఉన్నా సరే అన్న గారిని అమాత్యున్ని చేశారు జగన్. అదేంటి నోరూ వాయీ లేని మనిషికి కిరీటం పెట్టారని జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల రాజకీయ నేతలు కూడా చర్చించుకున్నారు. కొందరైతే మంత్రిగా కుదురుకుంటే ఆయన పనితీరు మారుతుందని అంచనా వేశారు. అయితే జగన్ తలచినది ఒకటైతే జరిగేది మరోకటి. శ్రీకాకుళం జిల్లాలో అసలు మంత్రి ఎవరు అన్నది ప్రజలతో పాటు, వైసీపీ నేతలకు ఇపుడు అర్ధం కావడం లేదట.

మొత్తం నలుగురు మంత్రులా…?

శ్రీకాకుళం జిల్లాలో ఇపుడు ఎందరు మంత్రులు అంటే నలుగురు అని ఠక్కున చెబుతున్నారు. ఎవరా మంత్రులు అంటే ధర్మాన కృష్ణదాస్ అధికారికంగా ఒక మంత్రి అయితే ఆయన గారి తమ్ముడు ప్రసాదరావు మరో మంత్రిట. ఇక స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం కూడా మంత్రి కంటే ఎక్కువగా జిల్లాలో హవా చూపిస్తున్నారు. నాలుగవ వారు జిల్లాకు చెందిన ఇంచార్జి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఇందులో ధర్మాన కృష్ణదాస్ తప్ప మిగిలిన ముగ్గురూ బాగా ఆరితేరిన వారే. దాంతో పాపం ధర్మాన కృష్ణదాస్ కు మంత్రి అయినా ఆనందం ఎక్కడా కనిపించడంలేదుట. పేరుకు అన్న మంత్రిగా ఉన్నా తమ్ముడు ప్రసాదరావునే ఆశ్రయిస్తున్నారుట. ఇక తమ్మినేని వర్గం స్పీకర్ ద్వారా పనులు జరిపించుకుంటున్నారు. దీంతో జిల్లాలో ఏకైక మంత్రి ట్యాగ్ ని ముందు పెట్టుకున్న అన్న గారు అవమానం పాలైపోతున్నారుట.

తమ్మినేని దూకుడు….

ఇదిలా ఉండగా తమ్మినేని సీతారామ్ దూకుడు ఓ స్థాయిలో ఉంది. ఆయన తాను జిల్లాలో పర్యటిస్తానని, సమీక్షలు కూడా నిర్వహిస్తామని గట్టిగానే చెబుతున్నారు. నన్నెవరు ఆపుతారని కూడా ప్రశ్నిస్తున్నారు. స్పీకర్ అంటే ఉత్సవ విగ్రహంలా చేతులు ముడుచుకుని కూర్చోవడానికి కాదు కదా అని తమ్మినేని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇకపై గ్రామాల్లో పర్యటిస్తానని, ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుంటానని కూడా అంటున్నారు. వాటిని అధికారులతో పాటు, ఏకంగా ముఖ్యమంత్రి జగన్ కి చెప్పి పరిష్కరిస్తానని అంటున్నారు. మరి సీఎం వద్ద పలుకుబడి బాగా ఉన్న తమ్మినేని జిల్లాలో చక్రం తిప్పేస్తున్నారు. ఈ మొత్తం పరిణామాల్లో ఇరకాటంలో పడినది మాత్రం ధర్మాన కృష్ణదాస్ మాత్రమేనని అంటున్నారు. ఆయనకు ధాటీగా రాజకీయం చేయడం, అధికారులను గదమాయించి పనులు చేయించడం ఇంకా అలవాటు కాలేదు. అలాగే రాజకీయ వ్యూహాల్లో వెనకబడిపోతున్నారు. దాంతో సిక్కోలు జిల్లాకు ఇప్పటికైతే నలుగురు మంత్రులయ్యారు. మరి భవిష్యత్తులో ఎందరు వస్తారో చూడాలి.

Tags:    

Similar News