స్పిన్ కి పడిపోయారే ….!!

దక్షిణాఫ్రికా కు మరో షాక్ ఇచ్చింది భారత్. తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్, రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్ తో ముచ్చటగా మూడో మ్యాచ్ [more]

Update: 2019-06-06 02:00 GMT

దక్షిణాఫ్రికా కు మరో షాక్ ఇచ్చింది భారత్. తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్, రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్ తో ముచ్చటగా మూడో మ్యాచ్ లో ఓడి హ్యాట్రిక్ పరాజయాలు మూటగట్టుకుని దిగాలు పడింది. టోర్నీ ఫేవరెట్ లలో ఒకటిగా భావించిన దక్షిణాఫ్రికా ఇలా వరుస ఓటములు చెందడం ఆ టీం అభిమానులను తీవ్రంగా కలవర పరుస్తుంది. బలమైన జట్టుగా ఉన్నప్పటికీ టీం లో రాబాడ, మోరిస్ మాత్రమే బౌలింగ్ లో నిలకడగా రాణిస్తున్నారు. స్పిన్నర్ తాహిర్ టీం తనపై పెట్టుకున్న ఆశలు మేరకు రాణించలేకపోతున్నాడు. ఇక బ్యాటింగ్ లో డుప్లిసిస్ భారీ స్కోర్లు సాధించలేక పోవడం మైనస్ గా మారింది.

వత్తిడిలో మరింత పేలవంగా ….

భారత్ తో మ్యాచ్ కు ముందు రెండు మ్యాచ్ ల ఓటములతో సౌత్ ఆఫ్రికా తీవ్ర వత్తిడితో మైదానంలోకి అడుగుపెట్టింది. ఆ టీం బలహీనతలపై ముందుగా కసరత్తు చేసిన ఇండియా చాహల్ ను బరిలోకి దింపడం ఫలితాన్నిచ్చింది. టీం ఇండియా ఆశలమేరకు రాణించిన చాహల్ పది ఓవర్లు బౌలింగ్ లో 51 పరుగులు ఇచ్చి నాలుగు కీలక వికెట్లు నేలకూల్చాడు. యార్కర్ స్పెషాలిస్ట్ బుమ్రా 35 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు, భువనేశ్వర్ 44 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు నేలకూల్చారు. టాస్ గెలిచిన ప్రతి జట్టు ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగిస్తుంటే సౌత్ ఆఫ్రికా మాత్రం తొలుత బ్యాటింగ్ చేపట్టి కోరి కస్టాలు కొని తెచ్చుకుంది. నిర్ణీత 50 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులే సాధించింది.

గడగడ లాడించిన రాబాడ…

లక్ష్యం పెద్దదేమీ కాకపోయినా కట్టుదిట్టమైన బౌలింగ్ వనరులు వున్న సౌత్ ఆఫ్రికాను టీం ఇండియా తేలిగ్గా తీసుకోలేదు. క్రీజ్ లో కుదుట పడేవరకు నిదానంగా ఆడాలనే వ్యూహంతో ముందుకు సాగింది. ఓపెనర్లు రోహిత్, ధావన్ ఆచితూచి ఆడినా నిప్పులు చెరిగే బంతులతో రాబాడ రెచ్చిపోయాడు. రోహిత్, ధావన్ లకు కొన్ని లైఫ్ లు కూడా లభించాయి. మరో ఏండ్ లో మోరిస్ సైతం లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేయడంతో ధావన్ తొలి వికెట్ గా వెనుతిరిగాడు. ఆ తరువాత వచ్చిన కెప్టెన్ కోహ్లీ సైతం క్రీజ్ లో నిలదొక్కుకునే లోపై పెవిలియన్ బాట పట్టాడు. ఈ దశలో సెకండ్ డౌన్ లో దిగిన కె ఎల్ రాహుల్, రోహిత్ కి చక్కటి సహకారం అందిస్తూ మూడో వికెట్ కి 70 పరుగులకు పైగా జోడించడం తో భారత్ గెలుపుపై అభిమానుల్లో ఆశలు చిగురించాయి. మరో ఎండ్ లో రోహిత్ చెత్త బాల్స్ పై బ్యాట్ జుళిపించి సెంచరీ దిశగా సాగిపోయాడు. రాహుల్ తరువాత క్రీజ్ లోకి వచ్చిన ధోని నిలకడగా ఆడుతూ రోహిత్ తో మరో భారీ భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ చివరిలో ధాటిగా ఆడబోయి పెవిలియన్ చేరుకున్నాడు. అప్పటికే సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ చెలరేగి ఆడాడు. ధోని తరువాత అడుగుపెట్టిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య సౌత్ ఆఫ్రికన్ బౌలర్లను బౌండరీలు బాదుతూ ఊచకోత కోయడంతో మరో 15 బంతులు మిగిలి ఉండగానే టీం ఇండియా ప్రపంచకప్ తొలి మ్యాచ్ లో శుభారంభం చేసింది.

నిరాశలో సౌత్ ఆఫ్రికా ….

ప్రపంచ కప్ పోటీల్లో బలమైన టీం గా బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు వరుస దెబ్బలతో కుదేలయింది. జట్టుగా ఆ టీం లోని ప్లేయర్స్ రాణించకపోవడంతో వరుస పరాజయాలు ఎదురయ్యి ప్రపంచ కప్ సాధించాలన్న ఆశయానికి నీళ్లు వదులుకునెలా మారింది. దాంతో తదుపరి మ్యాచ్ లన్ని ఖచ్చితంగా గెలిస్తే కానీ సౌత్ ఆఫ్రికా ముందుకు వెళ్ళే అవకాశాలు కానరావడం లేదు. ఈ నేపథ్యంలో తమ తప్పులను వెతుక్కోవడంతో బాటు భవిష్యత్తు వ్యూహాలకు పదును పెడుతుంది సౌత్ ఆఫ్రికా.

Tags:    

Similar News