ఎలాగైనా… ఎవరితోనైనా…?

సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత తొలుత త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. వరస ఓటములతో కుదేలైపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీ [more]

Update: 2019-08-17 16:30 GMT

సోనియా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత తొలుత త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. వరస ఓటములతో కుదేలైపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి కోలుకోవాలంటే అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో విజయకేతనం ఒక్కటే మార్గమని సోనియా గుర్తించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినప్పటికీ సార్వత్రిక ఎన్నికల్లో చతికలపడిన సంగతి తెలిసిందే.

సోనియా పగ్గాలు చేపట్టి….

రాహుల్ నాయకత్వంపై నమ్మకం లేకపోవడం, ప్రధాని నరేంద్ర మోదీ పట్ల విశ్వాసంతో ప్రజలు బీజేపీ వైపు ఏకపక్షంగా దేశ వ్యాప్తంగా నిలిచారు. దీంతో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో తిరిగి పార్టీ బాధ్యతలను భుజానికెత్తుకున్న సోనియా గాంధీ మూడు రాష్ట్రాల ఎన్నికలపై దృష్టి పెట్టారు. ఈ ఏడాది మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

మూడు రాష్ట్రాల ఎన్నికలపై…..

ఎన్నికలు జరిగే మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యంగా అతిపెద్దదైన మహారాష్ట్ర పై సోనియా ప్రత్యేకంగా వ్యూహలను అమలు చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. మహారాష్ట్రలో ఇప్పటికే బీజేపీ, శివసేనల కూటమి అధికారంలో ఉంది. లోక్ సభ ఎన్నికల్లో సయితం ఆ కూటమి దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నది వాస్తవం. రైతులు, ఉద్యోగులు, యువతలో బీజేపీ మహారాష‌్ట్ర సర్కార్ పట్ల కొంత వ్యతిరేకతతో ఉన్నారు. మరోసారి శివసేన, బీజేపీ కలసి పోటీ చేయడం ఖాయంగా కన్పిస్తుంది.

ఎవరితోనైనా పొత్తుకు…..

ఈ నేపథ్యంలో సోనియాగాంధీ మహారాష్ట్ర ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీనియర్ నేతలతో చర్చించారు. శరద్ పవార్ ఎన్సీపీతో ఎటూ పొత్తు ఉంటుంది. వీటితో పాటు నేరుగా మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేనతో కూడా పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ యోచిస్తుంది. కాశ్మీర్ అంశంతో కొంత బీజేపీకి మైలేజీ వచ్చే అవకాశం ఉండటంతో రాజ్ థాక్రే నేతృత్వంలోని సేనతో పొత్తు పెట్టుకుని హిందూ ఓట్లలో చీలిక తేవాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కన్పిస్తుంది. ఈ మేరకు కొందరు కాంగ్రెస్ నేతలు రాజ్ థాక్రేతో చర్చలకు పంపాలని సోనియా గాంధీ నిర్ణయించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద సోనియాగాంధీ రెండో సారి అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన తర్వాత జరిగే ఎన్నికలు కావడంతో మహారాష్ట్ర ఎన్నికలకు ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Tags:    

Similar News