సోము సరెండర్ అవుతారా…?

రాజకీయాల్లో ఎపుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. బద్ధ శత్రువులు శాశ్వత మిత్రులూ ఎవరూ ఉండరని అంటారు. ఇదిలా ఉంటే యాంటీ చంద్రబాబు స్లోగన్ తో ఏపీ బీజేపీ [more]

Update: 2021-05-16 03:30 GMT

రాజకీయాల్లో ఎపుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. బద్ధ శత్రువులు శాశ్వత మిత్రులూ ఎవరూ ఉండరని అంటారు. ఇదిలా ఉంటే యాంటీ చంద్రబాబు స్లోగన్ తో ఏపీ బీజేపీ పీఠమెక్కిన సోము వీర్రాజు ఏడాది గా కొనసాగుతున్నారు. అయితే ఆయన నాయకత్వాన ఏపీ బీజేపీలో మెరుపులూ వెలుగులూ ఏమీ లేవు. ఇంకా చెప్పాలంటే పార్టీ కురచ అయిపోయింది. ఉన్న వారే కొద్ది మంది అనుకుంటే వారిలో కూడా మెజారిటీ సైలెంట్ అయిపోయారు. ఇక మిత్రపక్షం జనసేనతో కూడా విభేదాలు వచ్చేశాయి. ఇవన్నీ చూసిన తరువాత సోము వీర్రాజు నాయకత్వం మీద సగటు కాషాయ కార్యకర్తకు కూడా వెగటు పుడుతుంది అంటే తప్పేమీ కాదేమో.

కన్నా రూటులో …?

కన్నా లక్ష్మీ నారాయణ ఏపీలో టీడీపీతో భుజం కలిపారు. వారు మాటలనే తన నోట పలికించారు. ఆ టైమ్ లో బీజేపీ టీడీపీ రెండు పార్టీలు అన్న భావన కూడా ఎవరికీ కలగనంతగా కన్నా కధ నడిపించారు అంటారు. మొత్తానికి బీజేపీలో ఆయన్ని తప్పించి సోము వీర్రాజుకు బాధ్యతలు అప్పగించారు. అసలైన ఆరెస్సెస్ కార్యకర్త నెత్తికెత్తుకున్న పార్టీ ఎంతలా ఎత్తిగిల్లాలి. కానీ బీజేపీ నానాటికీ ఏపీలో దిగనారిపోతోంది. పైగా ఒకే సమయంలో అటు టీడీపీ, ఇటు వైసీపీలతో పోరాడే శక్తియుక్తులు సోము వీర్రాజుకు లేవు అంటున్నారు. అందువల్ల ఆయన కూడా టీడీపీ రూటు లోకే వస్తున్నారా అన్న చర్చ అయితే గట్టిగా పార్టీలో ఉంది.

జై అమరావతి అంటూ…?

సోము వీర్రాజు బీజేపీ ప్రెసిడెంట్ కాకముందూ అయిన కొత్తల్లో కూడా కేంద్రానికి బీజేపీకి ఏపీ రాజధాని విషయంలో ఎటువంటి సంబంధం లేదు అని గట్టిగా చెప్పుకొచ్చేవారు. రాజధాని ఎక్కడైనా పెట్టుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అంటూ అవుట్ రేటెడ్ గా వైసీపీ విధానాలను సపొర్ట్ చేసేవారు. అయితే తరువాత రోజుల్లో ఆయన మెల్లగా అమరావతి రాజధాని కాదని మేమెప్పుడూ అనలేదే అంటూ మధ్యస్థ రాగాలు ఆలపించారు. ఇపుడు చివరిగా ఆయన బాబు కు కోరస్ అయిపోయారు. జై అమరావతి అని గట్టిగానే మాట్లాడుతున్నారు. అమరావతినే రాజధానిగా ఉంచాలన్నది మొదటి నుంచి మా విధానం అని కూడా చెబుతున్నారు.

అండ కోసమా…?

ఎవరు కాదన్నా కూడా ఏపీ బీజేపీలో బలమైన కమ్మ సమాజికవర్గం పెత్తనం గట్టిగానే ఉంది. సోము వీర్రాజు వారితో ఢీ కొట్టినా ఉపయోగం లేకుండా పోతోంది. ఆ వర్గం సైలెంట్ గా ఉన్నా తెర వెనక చేయాల్సింది చేస్తున్నారు అంటున్నారు. ఇక సోము వీర్రాజు ని మాజీ ప్రెసిడెంట్ చేసే పని కూడా బీజేపీలో జోరుగా సాగుతోంది అన్నది టాక్. మరి ఈ సమయంలో సోము బాబు వైపునకు వస్తారా అన్నదే చర్చ. టీడీపీకి కావాల్సింది తమకు అనుకూలురైన వారు కాషాయ జెండా పట్టడం. సోము వీర్రాజు టీడీపీనే ప్రధమ శత్రువుగా నిన్నటి దాకా చెప్పుకొచ్చారు. ఇపుడు మాత్రం ఆయన టీడీపీని తిట్టడం తగ్గించేశారు. వైసీపీ మీద కత్తులు దూస్తున్నారు. మరి ఇదేమైనా సోము వీర్రాజు కొత్త వ్యూహమా అన్నదే కాషాయం పార్టీలో చర్చ. ఒకవేళ సోము వీర్రాజు ప్రో టీడీపీ అన్నా కూడా బీజేపీ హై కమాండ్ ఆయన్ని కొనసాగిస్తుందా అన్నది కూడా మరో ప్రశ్న. అయితే బీజేపీకి ఏపీలో ఎదగాలనుకుంటే టీడీపీ సాయం కావాలి అనుకుంటే మాత్రం బాబుకు తాళం కొట్టే వారే ప్రెసిడెంట్లుగా ఉండాలి. బహుశా పై వారి మనసులోని మాటను తెలుసుకునే సోము వీర్రాజు ఇలా చేస్తున్నారా అన్నది డౌట్.

Tags:    

Similar News