సోముకు ఛాలెంజ్… గ్రాఫ్ తగ్గుతుందా?

ఎప్పుడైనా పక్కవారిని చూసి మనం నేర్చుకోవాలి. అంతేకాదు పక్క వారితో ఎప్పుడూ పోలిక ఉండనే ఉంటుంది. ఇది వ్యక్తిగత జీవితాలకు మాత్రమే కాదు. రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. [more]

Update: 2020-12-09 08:00 GMT

ఎప్పుడైనా పక్కవారిని చూసి మనం నేర్చుకోవాలి. అంతేకాదు పక్క వారితో ఎప్పుడూ పోలిక ఉండనే ఉంటుంది. ఇది వ్యక్తిగత జీవితాలకు మాత్రమే కాదు. రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇందులో ఫెయిలయితే తన నాయకత్వం పైనే నెగిటివ్ ముద్ర పడుతుందన్న ఆందోళనలో సోము వీర్రాజు ఉన్నారు.

కొత్త అధ్యక్షులుగా…..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కొద్దికాలం క్రితం కొత్త అధ్యక్షులను బీజేపీ అధిష్టానం నియమించింది. ఏపీకి సోము వీర్రాజు, తెలంగాణకు బండి సంజయ్ లను కొత్త అధ్యక్షులుగా నియమించారు. అయితే ఇద్దరూ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన నేతలు కావడంతో కొంత దూకుడుగానే ఉన్నారు. అధికార పార్టీని ఇద్దరూ ధీటుగానే ఎదుర్కొంటున్నారు. కానీ తెలంగాణ లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒకరకంగా సక్సెస్ అయ్యారు.

బండి గ్రాఫ్ పెరగడంతో….

దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధించడంతో బండి సంజయ్ గ్రాఫ్ అధిష్టానం వద్ద బాగా పెరిగింది. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ ఫోన్ చేయడమే ఇందుకు నిదర్శనం.దుబ్బాకలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి టీఆర్ఎస్ ను మట్టికరిపించింది. మరి సోము వీర్రాజుకు ఇదే దిగులు పట్టుకుంది. త్వరలో తిరుపతి పార్లమెంటుకు ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఎన్నికలో గెలిస్తేనే సోము వీర్రాజు గ్రాఫ్ పెరుగుతుంది. అధిష్టానం కూడా ఆయనను గుర్తిస్తుంది.

తిరుపతి మాత్రం….

కానీ దుబ్బాక ఎన్నికంత సులువు కాదు తిరుపతి పార్లమెంటు ఎన్నిక. ఇక్కడ బీజేపీ బలహీనంగా ఉంది. అధికార పార్టీని ఎదుర్కొనే అంత శక్తి సామర్థ్యాలు లేనే లేవు. ఇప్పటికే టీడీపీ, వైసీపీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ, జనసేనలు మాత్రం ఎవరు పోటీ చేయాలన్న దానిపై నిన్న మొన్నటి వరకూ మల్లగుల్లాలు పడ్డారు. ఈ పరిస్థితుల్లో తిరుపతి ఉప ఎన్నికల్లో గెలవకపోయినా రెండోస్థానంలో నిలవాలన్నది సోము వీర్రాజు ప్రయత్నంగా కన్పిస్తుంది. అది సాధించినా సోము వీర్రాజు సక్సెస్ అయినట్లే. మరి టీడీపీని వెనక్క నెట్టి సోము వీర్రాజు పార్టీని ఆ దిశగా తీసుకు వెళ్లగలరా? లేదా? అన్నదే ప్రశ్న.

Tags:    

Similar News