జగన్ కొలువులో వీర్రాజు మంత్రి అవుతారా ?

సోము వీర్రాజు. రాజకీయ దురదృష్టవంతుడు కిందనే లెక్క. బీజేపీ వంటి జాతీయ పార్టీకి ఎపుడో పుష్కరానికి ఓసారి అధికారం వరదలా వస్తుంది. ఆ సమయంలో ఎవరో బయట [more]

Update: 2020-10-01 13:30 GMT

సోము వీర్రాజు. రాజకీయ దురదృష్టవంతుడు కిందనే లెక్క. బీజేపీ వంటి జాతీయ పార్టీకి ఎపుడో పుష్కరానికి ఓసారి అధికారం వరదలా వస్తుంది. ఆ సమయంలో ఎవరో బయట నుంచి చేసి అందులో జలకాలాడేసి తమ దాహాన్ని తీర్చుకుని వెళ్ళిపోతారు. నాలుగు దశాబ్దాలుగా ఆర్ఎస్ఎస్, బీజేపీ అంటూ ఫక్త్ పార్టీ కార్యకర్తగా ఉన్న సోము వీర్రాజులు లాంటి వారు ఇలాంటివి అన్నీ చూస్తూ పుష్కరాల నీళ్ళను నెత్తిన చల్లుకుని తృప్తి పడతారు. ఇది గత పాతికేళ్ళుగా ఏపీలో జరుగుతున్న తంతు. బీజేపీకి కాస్తా ఆధికారపు కాంతులు దక్కుతాయనగానే సోము వీర్రాజు లాంటి వారికి కావాలని సైడ్ చేసే బ్యాచ్ ఒకటి బీజేపీలోనే ఉంది.

గుర్తించారుగా…..

మొత్తానికి కారు మబ్బులు వీడి సబ్బు బిళ్ళలా కాసింత వెలుగుతోనైనా చందమామ కనిపించినట్లుగా సోము వీర్రాజుకి ఇన్నాళ్ళకు బీజేపీ ఏపీ పీఠం దక్కింది. ఇది కూడా కొంత ఉపశమనమే. ఎందుకంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. కాబట్టి జాతీయ పార్టీ నేతగా కొంత హడావుడి చేయవచ్చు. కానీ సోము వీర్రాజు అసలైన అధికారం మాత్రం చేతికి చిక్కడంలేదు. ఆయన వచ్చే ఏడాది మార్చిలో ఎమ్మెల్సీగా రిటైర్ అవుతారు. జీవితంలో ఆయన చట్టసభల్లో అలా ఒకే ఒకసారి అడుగుపెట్టి తీసుకున్న అరుదైన పదవి అది. ఇపుడు అదీ పోతే వట్టి సోముగానే మిగులుతారు.

న్యాయం కోసమే…..

ఇక సోము వీర్రాజు అంటే బీజేపీ పెద్దలకు ఇపుడు అభిమానం పెరిగింది. ఆయన వయసు షష్టి పూర్తి దాటింది. రాజకీయ వయసు నాలుగు దశాబ్దాలుగా ఉన్నా పదవులకు నోచుకున్నదేదీ లేదు. అందుకే కేంద్ర పెద్దలు ఆయన కోసం కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు అంటున్నారు. వచ్చే ఏడాది ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయితే బీజేపీకి ఒక సీటు అయినా వైసీపీ ఇచ్చేలా కేంద్ర పెద్దలు జగన్ తో చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. దాంతో మరో ఆరేళ్ల పాటు ఎమ్మెల్సీగా సోము వీర్రాజు ఎదురులేని నేతగా నిర్పూచీగా ఉండొచ్చు. అంతటితో ఆగకుండా సోము వీర్రాజుని జగన్ కొలువులో మంత్రిగా కూర్చోబెట్టాలని కూడా బీజేపీ ప్లాన్ వేస్తోంది అంటున్నారు.

అక్కడా..ఇక్కడా…?

ఇక కేంద్రంలో మోడీ సర్కార్ నెమ్మదిగా ఎన్డీయే రూపురేఖలు కోల్పోతోంది. వాజ్ పేయ్ హయాంలో 23 పార్టీలు అందులో ఉండేవి. మోడీ జమానాలో సగానికి పడిపోయింది ఆ సంఖ్య. ఇపుడు రెండవ మారు మోడీ ప్రధాని అయ్యాకా అది కూడా మూడవ వంతుకు దిగజారిందిట. నమ్మకమైన నేస్తాలుగా ఉండే శివసేన, శిరోమణీ అకాలీదళ్ వంటి పార్టీలు మోడీకి గుడ్ బై కొట్టేసాయి. జేడీయూ నితీష్ కుమార్ తప్ప గట్టి మద్దతుదారు ఎన్డీయే కు లేని దుస్థితి తాజా పార్లమెంట్ సమావేశాల్లో స్పష్టంగా కనిపించింది. దాంతో జగన్ ని ఎన్డీయేలోకి చేరమంటూ బీజేపీ నేతలు తెగ వత్తిడి తెస్తున్నారుట. అలా కనుక చేరితే మూడు క్యాబినెట్ బెర్తులు ఇస్తామని కూడా అమిత్ షా బేరం పెట్టాని టాక్. అంతే కాదు, ఏపీలో కూడా బీజేపీకి రెండు క్యాబినెట్ బెర్తులు ఇవ్వాలని ప్రతిపాదించారట. అలా కనుక ఒప్పందం కుదిరితే ఏపీ నుంచి సోము వీర్రాజు మంత్రి అవడం ఖాయమని అంటున్నారు. మోడీ మోజులో ఉన్న జగన్ నయానా, భయానా ఎలా అనుకున్నా కూడా ఈ ప్రతిపాదనకు ఓటేస్తారు అంటున్నారు. చూడాలి మరి.

Tags:    

Similar News