ఆయన జీవితం పూలపాన్పు కాదు

శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం తెలుగు వాకిట పరిచయం అక్కర లేని పేరు. ఎస్పీ గా బాలు గా అంతా ముద్దుగా పిలుచుకునే బాల సుబ్రహ్మణ్యం జీవితం [more]

Update: 2020-09-25 08:08 GMT

శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం తెలుగు వాకిట పరిచయం అక్కర లేని పేరు. ఎస్పీ గా బాలు గా అంతా ముద్దుగా పిలుచుకునే బాల సుబ్రహ్మణ్యం జీవితం పూలపాన్పు అయితే కాదు. దాదాపు 40 వేల పాటలను వివిధ భాషల్లో అందించిన ఎస్పీ కి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ సంగీతంలో సుప్రసిద్ధ స్థానం అందుకున్నారు. పద్మశ్రీ, పద్మ విభూషణ్ వంటి జాతీయ స్థాయి అవార్డులే కాదు. చిత్ర సీమలో జాతీయ స్థాయిలో అందుకున్నారు ఎస్పీ.

బహుముఖ ప్రజ్ఞాశాలి …

ఒక మంచి గాయకుడిగానే కాదు సంగీత దర్శకుడిగా, నటుడిగా, వ్యాఖ్యాతగా రచయితగా ఇలా బహుముఖ ప్రజ్ఞ బాలు సొంతం. కమల్ హాసన్, రజనీ కాంత్ వంటి సూపర్ స్టార్ లకు తన గాత్రాన్ని వాయిస్ ఓవర్ గా అందించేవారు బాలు. ఇక సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ చిత్రాలకు ఎస్పీ తన గాత్ర మాధుర్యంతో ప్రాణం పోశారు. ఇలా ఎన్నో ఎన్నెన్నో మేరు నగ శిఖరాలను అధిరోహించిన గాత్ర శిఖరం పాట ప్రయాణం లో ఎన్నో ఎత్తు పల్లాలు ఉన్నాయి. ఆయనకు గాడ్ ఫాదర్ లెవరు పరిశ్రమలో లేరు. తన స్వశక్తి తోనే ఉన్నత స్థాయికి ఎదిగారు బాల సుబ్రహ్మణ్యం.

నెల్లూరు నుంచి మద్రాస్ వరకు …

నెల్లూరు లో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించే సమయంలో మిమిక్రి ఆర్టిస్ట్ గా తన లో ప్రతిభను బయట పెట్టారు బాలు. ఆ తరువాత పెద్దలు ఒకే గోత్రికులని ఆయన వివాహానికి నిరాకరించారు దాంతో విశాఖ సింహాద్రి అప్పన్న సమక్షంలో మిత్రుల సమక్షంలో పెళ్ళి చేసుకున్నారు ఎస్పీ. నాడు మద్రాస్ కి వెళ్లేందుకు 500 ల రూపాయలు కూడా లేవు బాలు కి మిత్రులందరు చందాలు వేసుకుని నాటి కష్టాలు గట్టెకించినట్లు ఒక ఇంటర్వ్యూలో స్వయంగా తన పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఆయన. మద్రాస్ లో సినిమాల్లో పాటల కోసం ఆయన ఘంటశాల వంటి లెజెండ్స్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా వెరవక తన ప్రస్థానం కఠోర సాధనతో చేస్తూ ముందుకు సాగడం బాలు కె చెల్లింది.

శంకరాభరణం తో క్లాస్ …

పరిశ్రమలో ఘంటశాల తో బాటు ఎందరో గాయకుల మన్ననలు అందుకున్న ఎస్పీ 70 వ దశకంలో దుమ్ములేపారు. తన గాత్ర మాధుర్యంలో ఆ సినిమా హీరోల మాదిరిగానే ఆయన పాటలు ఉండటం అభిమానుల్లో మరింత జోష్ పెంచేది. ముఖ్యంగా ఎన్టీఆర్, ఏ ఎన్నార్ , కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి కమల్ హాసన్, రజనీ కాంత్ వంటివారికి బాలు పాడిన పాటలు మరుపురానివే. శంకరాభరణం చిత్రంతో జాతీయ అవార్డు తొలిసారి దక్కించుకున్న బాలు అప్పటివరకు తనకున్న మాస్ ఇమేజ్ ను తుడిపేసుకున్నారు. కె విశ్వనాధ్ శంకరాభరణం తరువాత బాలు కి మాస్ తో పాటు క్లాస్ లుక్ పూర్తిగా పాటల్లో వచ్చేసింది. జననీరాజనం ఆ తరువాత ఆయన ఎక్కడ అడుగు పెట్టినా లభించేది.

సూపర్ స్టార్ తో నువ్వా నేనా ..

సూపర్ స్టార్ కృష్ణ తో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం వివాదం తెలుగు ప్రజల్లో ఇప్పటికి హాట్ టాపిక్. కృష్ణ తీసిన సింహాసనం చిత్రానికి బాలు స్థానం లో రాజ్ సీతారాం ను పరిచయం చేశారు సూపర్ స్టార్. నాడు చిత్ర సీమలో బాలు హవా ఒకరేంజ్ లో సాగుతుంది. కృష్ణ ప్రతిష్టాత్మక చిత్రానికి ఈ సాహసం చేయడం అందరిలో ఉత్కంఠ రేపింది. ఏడాది పాటు సూపర్ స్టార్ కి ఎస్పీ కి వచ్చిన చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ను ఎలాంటి బేషజాలకు పోకుండా బాలసుబ్రమణ్యం స్వయంగా తెరదించారు. ఆయనే స్వయంగా పద్మాలయ స్టూడియో కి నేరుగా వెళ్లి సూపర్ స్టార్ ను కలిసి అసలు ఏమి జరిగింది అంటే కృష్ణ పాత విషయాలు మర్చిపోండి మన సినిమాలో ఎప్పటినుంచి పాడుతున్నారని ఎంతో ఆత్మీయంగా చెప్పి కౌగిలించుకోవడంతో పరిశ్రమ సంక్షోభం తొలగిపోయిందని బాలునే చెప్పారు ఒక సందర్భంలో. ఆ తరువాత అనేక చిత్రాలకు తన గాత్రంతో బాలు కృష్ణ చిత్రాలకు ప్రాణమే పోశారు.

ఇళయరాజా తో వివాదం …

భారతీయ చిత్ర పరిశ్రమలో ఇళయరాజా కు ఒక ప్రత్యేక స్థానం. ఎస్పీ కి ఇళయ రాజా కు అవినాభావ సంబంధం. ఇద్దరు మంచి మిత్రులు కూడా. వీరిద్దరూ ఒకేసారి పరిశ్రమకు వచ్చి ఎంతో కృషి పట్టుదలతో పైకి వచ్చారు. ఒకరంటే మరొకరికి ఉండే గౌరవం ఎంతో ఒరేయ్ అరేయ్ మిత్రులు వారు. ఆలాంటి మిత్రుల నడుమ కొద్ది సంవత్సరాల క్రితం ఒక వివాదం పెద్ద చర్చనీయమే అయ్యింది. తన సంగీత దర్శకత్వంలోని పాటలు పాడేందుకు అనుమతి లేదంటూ అమెరికాలో కచేరి చేస్తున్న సందర్భంలో ఇళయ రాజా లీగల్ నోటిస్ ఇచ్చి సంచలనానికి తెరతీశారు. ఈ సంఘటన బాలు ను తీవ్రంగా కలచి వేసింది. ఇళయ రాజా ఎందుకు అలా చేశారని బాలు ఎప్పుడు ఆయన్ను అడగలేదు. ఆయన సంగీత దర్శకత్వ పాటలను ఆయన కచేరీల్లో పాడటం మానేశారు. ఆ తరువాత ఇళయరాజా తో అనేక సంర్భాల్లో బాలు కలిసిన సందర్భాలు ఉన్నా ఒక్క మాట మిత్రుడిని అడగకపోవడం ఆయన ఆత్మగౌరవం, ఆత్మాభిమానానికి ఎంత విలువ ఇస్తారో చెప్పక చెబుతుంది. వీరిద్దరి నడుమ కొందరు పెట్టిన పొగే ఈ వివాదానికి కారణమని సినీ విశ్లేషకులు భావిస్తారు. బాలు సైతం దీన్ని పెద్ద విషయంగా తీసుకోలేదు. లైట్ తీసుకున్నారు కానీ తనకు లీగల్ నోటీస్ ఇవ్వడాన్ని మాత్రం జీర్ణించుకోలేక పోయారు. అయితే బాలు అనారోగ్యంతో ఎం జి ఎం లో చేరిన వెంటనే ఇళయ రాజా మాత్రం షోషల్ మీడియా ద్వారా తన ఆప్త మిత్రుడు కోలుకోవాలంటూ వీడియో లు విడుదల చేయడం విశేషం. సాధారణంగా ఇళయ రాజా ఇలా మీడియా ముందుకు రావడం బహు అరుదు. కానీ కేవలం తన స్నేహితుడు కోసం ఆయన పరితపించిన వైనం అందరినికలవరపెట్టింది. వారి స్నేహానికి దర్పణం పట్టింది.

భావితరాలకు బాటలు …

సంగీత ఆసక్తి తన తరంతో పోకుండా ఎస్పీ బాలసుబ్రమణ్యం తనదైన ముద్రను తెలుగు ఇంటిలోకి తీసుకువచ్చారు. ఈనాడు రామోజీ రావు సహకారంతో ఆయన చేపట్టిన పాడుతా తీయగా కొన్ని వందలమంది నూతన గాయకులను సంగీత ప్రియులకు పరిచయం చేసింది. కొన్ని వేలమందికి సంగీతంపై ఆసక్తిని కోట్లమంది ని పాటలపై ప్రేమను పెంచేలా చేసింది. ప్రతి ఇంట్లో బాలు స్వరమే కాదు ఆయన బుల్లితెరపై దర్శనం తో కుటుంబ సభ్యుడిని చేసేసింది. అందుకే తెలుగు ప్రజలు బాలు ఆసుపత్రిలో చేరిన నుంచి నేటి వరకు తమ కుటుంబ సభ్యుడు త్వరగా కోలుకోవాలంటూ దేశ, ప్రపంచ వ్యాప్తంగా అన్ని మతాల్లో ప్రార్ధించారు. అలాంటి ఎస్పీ భౌతికంగా మన మధ్య లేకపోయినా సంగీతం ఉన్నంత కాలం అజరామరుడే.

Tags:    

Similar News