అప్పర్ “హ్యాండ్” ఎందుకంటే…??

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సిద్ధరామయ్య కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందా? ఆయన చెప్పే ప్రతి మాటకూ ఓకే చెబుతుందా? అవుననే అంటున్నారు. సిద్ధరామయ్య మాజీ ముఖ్యమంత్రి [more]

Update: 2019-01-05 17:30 GMT

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సిద్ధరామయ్య కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందా? ఆయన చెప్పే ప్రతి మాటకూ ఓకే చెబుతుందా? అవుననే అంటున్నారు. సిద్ధరామయ్య మాజీ ముఖ్యమంత్రి అయినా… ప్రస్తుతం అధికారంలో లేకపోయినా… పీసీసీ అధ్యక్షుడు దినేశ్ గుండూరావు, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర కన్నా పార్టీలో బలంగా ఉన్నారు. ఆయన చెబితే తిరుగులేదన్నది పార్టీలో జరుగుతున్న ప్రచారం. ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలోనూ సిద్ధరామయ్య చెప్పిన వాళ్లకే మంత్రి పదవులు దక్కాయి. సిద్ధూను దూరం చేసుకుంటే పదవులు రావన్నది అర్థమయిన కాంగ్రెస్ నేతలు క్రమంగా సిద్ధూ శిబిరంవైపు చూస్తున్నారు.

మంత్రివర్గ విస్తరణలోనూ….

సంకీర్ణ సర్కార్ కర్ణాటకలో ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రిగా పరమేశ్వర, మంత్రిగా డీకే శివకుమార్ లు ఒక జట్టుగా ఏర్పడ్డారు. సమన్వయ కమిటీ ఛైర్మన్ గా ఉన్న సిద్దరామయ్యను వీరు ముగ్గురూ ఒక్కటై లెక్క చేయని పరిస్థితి. సిద్ధరామయ్య కూడా కొంత సంయమనం పాటించారు. అసెంబ్లీ సమావేశాల విషయంలోనూ, అధికారుల బదిలీలు, మంత్రులకు జిల్లాల బాధ్యతలను అప్పగించడంలోనూ ముగ్గురూ ఒక్కటై సిద్ధరామయ్యను పక్కన పెట్టేశారు. దీంతో సిద్ధరామయ్య మంత్రి వర్గ విస్తరణలో తనదైన మార్కు చూపించారు. హైకమాండ్ వద్ద తన పట్టు ఏంటో చెప్పకనే చెప్పారు.

ఆ సాహసం చేయలేక…..

లోక్ సభ ఎన్నికలు తరుముకొస్తున్న వేళ సిద్ధరామయ్యను దూరం చేసుకునే సాహసం అధిష్టానం చేయదు. ఎందుకంటే ఐదేళ్ల పాటు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉండి, తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా గణనీయమైన సీట్లు సాధించిపెట్టి తమ ప్రత్యర్థి బీజేపీని కర్ణాటకలో అధికారంలోకి రాకుండా నిలువరించగలిగారు. ఇదే రాహుల్ గాంధీకి సిద్ధరామయ్య పట్ల ఉన్న సానుకూలత. రాజకీయ సన్యాసం తీసుకుంటానని పలు దఫాలు సిద్దరామయ్య చెప్పినా ఆయన గోల్ అంతా కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపైనే ఉంది. అయితే అది ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని తెలిసే సమయం కోసం వేచిచూస్తున్నారు.

జేడీఎస్ ను కట్టడి చేసేందుకేనా?

కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సిద్ధరామయ్యకు ప్రయారిటీ ఇవ్వడాన్ని కాంగ్రెస్ నేతలే కాదు సంకీర్ణంలోని జనతాదళ్ ఎస్ కూడా సహించలేకుండా ఉంది. మాజీ ప్రధాని దేవెగౌడ, ముఖ్యమంత్రి కుమారస్వామిలు విస్తరణ తర్వాత బాహాటంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. పరమేశ్వర సయితం అసంతృప్తితోనే ఉన్నారు. కానీ లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకూ సిద్ధరామయ్య హవా కర్ణాటకలో నడుస్తుందని, దానిని ఎవరూ ఆపలేరని, హైకమాండ్ కూడా అంత సాహసం చేయలేదన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. జేడీఎస్ లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను డిమాండ్ చేయకుండా ఆపే శక్తి కూడా సిద్ధరామయ్యకే ఉందని రాహుల్ నమ్ముతున్నారు. అందుకే ఆయనకు అంత ప్రాధాన్యత. మరి లోక్ సభ ఎన్నికల తర్వాత…? చెప్పలేం…. ఏమైనా జరగొచ్చు.

Tags:    

Similar News