ఆశలు చావలేదట.. నేను రెడీ అంటున్నాడే

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఇంకా పదవి పై ఆశ పోలేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే తానే ముఖ్మమంత్రి కావాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. [more]

Update: 2020-12-22 18:29 GMT

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఇంకా పదవి పై ఆశ పోలేదు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే తానే ముఖ్మమంత్రి కావాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ విధమైన సంకేతాలను ఇప్పటికే సిద్ధరామయ్య అధిష్టానానికి ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిద్ధరామయ్య ఇవే తన చివరి ఎన్నికలని ప్రకటించారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సిద్ధరామయ్య యూటర్న్ తీసుకున్నారు.

వచ్చే ఎన్నికల్లో…..

ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల నాటికి యడ్యూరప్పకు పార్టీలో ప్రాముఖ్యత ఉండదు. దీంతో యడ్యూరప్ప లేని బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేదని సిద్ధరామయ్య అంచనా వేస్తున్నారు. మరోవైపు జనతాదళ్ ఎస్ కూడా పూర్తిగా దెబ్బతినింది. జేడీఎస్ కు పట్టున్న ప్రాంతాల్లో సయితం క్యాడర్ లేకుండా పోయింది. వరస ఓటములతో ఆ పార్టీ డీలా పడింది. ఇది తనకు కలసి వచ్చే అంశంగా సిద్ధరామయ్య భావిస్తున్నారు.

డీకే వర్గాన్ని…..

మరోవైపు పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ ను నియమించినా సిద్ధరామయ్య తన పని తాను చేసుకుపోతున్నారు. తన వర్గాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఎన్నిక జరిగినా తన మార్కు ఉండేలా సిద్ధరామయ్య జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాను ఇంకా రాజకీయాల్లో కొనసాగుతానన్న సంకేతాలను బలంగా పంపుతున్నారు. డీకే శివకుమార్ కంటే తానే సమర్థుడనని ప్రతి ఘటనలో సిద్ధరామయ్య నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

జాతీయ రాజకీయాల్లోకి….

అయితే అధిష్టానం సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలని యోచిస్తుంది. డీకే శివకుమార్ వర్గం సయితం సిద్ధరామయ్యను రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పించాలని చూస్తుంది. ఇందుకు మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీ వంటి నేతలు సహకరిస్తున్నారు. అయినా సిద్ధరామయ్య మాత్రం తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేది లేదని స్పష్టం చేస్తున్నారు. శక్తికి మించిన ఆశలు తనకు లేవని పదే పదే చెబుతున్నారు. మొత్తం మీద మరోసారి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కావాలని బలంగా కాంక్షిస్తున్నారు.

Tags:    

Similar News