కొర్రీ వేసినా… మెలిక పెట్టినా?

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పెట్టిన మెలికతో హైకమాండ్ గింగిరాలు తిరుగుతోంది. సిద్ధరామయ్యకు ప్రత్యర్థులకు ఎలా చెక్ పెట్టాలో తెలుసు. వారిని ఎలా కట్టడి చేయాలో తెలుసు. [more]

Update: 2020-01-21 16:30 GMT

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పెట్టిన మెలికతో హైకమాండ్ గింగిరాలు తిరుగుతోంది. సిద్ధరామయ్యకు ప్రత్యర్థులకు ఎలా చెక్ పెట్టాలో తెలుసు. వారిని ఎలా కట్టడి చేయాలో తెలుసు. అంతేకాదు హైకమాండ్ కు తన పవర్ ఏంటో చూపడంలోనూ సిద్ధరామయ్య దిట్ట. అందుకే ఐదేళ్ల పాటు ఒడిదుడుకులు లేకుండా, హైకమాండ్ జోక్యం లేకుండా ముఖ్యమంత్రిగా కొనసాగిన చరిత్ర సిద్ధరామయ్యది.

భక్తితో పాటు భయం కూడా…

అందుకే ఆయన అంటే భక్తి, భయం కూడా ఉన్నాయన్నది పార్టీలో ప్రతి ఒక్కరూ అంగీకరించే నిజం. పీసీసీ అధ్యక్షుడి విషయంలో తన మాట నెగ్గాలని సిద్ధరామయ్య తొలుత అనుకున్నారు. యడ్యూరప్ప సామాజికవర్గానికి చెందిన ఎంబీ పాటిల్ ను ముందు పెట్టారు. ఆయనకు పీసీసీ పదవి ఇవ్వాలని గట్టిగా గొంతు విన్పించారు. వచ్చే ఎన్నికల్లో లింగాయత్ లను మచ్చిక చేసుకోవాలంటే ఎంబీ పాటిల్ సరైన వ్యక్తి అని హైకమాండ్ కు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ హైకమాండ్ ఎంబీ పాటిల్ విషయంలో అంత సుముఖంగా లేదు.

డీకేకు ఇస్తే…..

ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ పట్ల హైకమాండ్ మొగ్గుగా ఉంది. పార్టీ అగ్రనేతలతో భేటీ తర్వాత సిద్ధరామయ్య ఈ విషయాన్ని గుర్తించారు. డీకే కు పీసీపీ చీఫ్ పదవి దక్కితే భవిష్యత్తులో తన పాత్ర ఏమీ ఉండదని భావించిన సిద్ధరామయ్య అందుకు అనుగుణంగా పావులు కదపడం మొదలుపెట్టారు. డీకే శివకుమార్ ను అధ్యక్షుడిగా నియమించినా పరవలేదని నలుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించాలని సిద్ధరామయ్య పట్టుబట్టారు.

నలుగురితో…..

సామాజిక వర్గాలు, ప్రాంతాల వారీగా నలుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్లను చేస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని సిద్ధరామయ్య హైకమాండ్ కు తెలిపారు. ఎస్సీ వర్గం నుంచచి ఆంజనేయ కాకుంటే ధ్రువనారాయణ, ఎస్టీ నుంచి సతీష్ జార్ఖిహోళి, లింగాయత్ వర్గం నుంచి ఈశ్వర్ ఖండ్రే, మైనారిటీ వర్గం నుంచి మరొకరిరిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించాలని కొర్రీ వేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనలో పడింది. వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తే డీకే శివకుమార్ తాను చీఫ్ పదవి తీసుకోనని చెబుతున్నారు. మొత్తం మీద సిద్ధరామయ్య కాంగ్రెస్ హైకమాండ్ ను డైలమాలో పడేశారు.

Tags:    

Similar News