ఇంత అక్కసా?

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పార్టీలో అసమ్మతి గట్టిగానే ఉంది. ఆయనను తిరిగి ప్రతిపక్ష నేతగా నియమించడంతో కొందరు నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. సిద్ధరామయ్య పెత్తనాన్ని తాము [more]

Update: 2019-10-20 17:30 GMT

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పార్టీలో అసమ్మతి గట్టిగానే ఉంది. ఆయనను తిరిగి ప్రతిపక్ష నేతగా నియమించడంతో కొందరు నేతలు జీర్ణించుకోలేక పోతున్నారు. సిద్ధరామయ్య పెత్తనాన్ని తాము సహించలేమని కొందరు బాహాటంగా చెబుతుంటే మరికొందరు రాజీనామాల బాట పట్టారు. ఉప ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు ఇది ఎదురు దెబ్బేనని అంటున్నారు విశ్లేషకులు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగి రికార్డు సృష్టించిన సిద్ధరామయ్య అభిమానులతో పాటు పార్టీలో శత్రువులను కూడా పెంచుకున్నారు.

రాజీనామా చేసి మరీ….

తాజాగా కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేసీ రామ్మూర్తి రాజీనామా చేశారు. రామ్మూర్తికి బీజేపీ గాలం వేసింది. రాజ్యసభలో తమ బలం పెంచుకునేందుకు ఒక్కొక్క కాంగ్రెస్ సభ్యుడిని రాజీనామా చేయించి తమ బలం పెంచుకోవాలని బీజేపీ భావిస్తుంది. అయితే బీజేపీ వలలో కర్ణాటక రాజ్యసభ సభ్యుడు రామ్మూర్తి పడిపోయారు. ఆయన ఏకంగా తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. దీంతో రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుల బలం 44కు పడిపోయింది. అయితే రామ్మూర్తి రాజీనామా చేసి అందుకు గల కారణాలు వివరించారు.

మరి కొందరు కూడా…..

తన రాజీనామాకు కారణం సిద్ధరామయ్యే అని రామ్మూర్తి ప్రకటించడం సంచలనమయింది. సిద్ధరామయ్య వ్యవహారశైలి సరిగా లేదని రామ్మూర్తి తెలిపారు. ఆయనతో పాటు మరో మాజీ ఎమ్మెల్యే అనిల్ లాడ్ కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వీరితో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పదమూడు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. వీరంతా సిద్ధరామయ్య కు అత్యంత సన్నిహితులే. తాజాగా రాజీనామా చేసేందుకు మరికొందరు సిద్ధపడుతుండటం కాంగ్రెస్ పార్టీలో ఆందోళన కల్గిస్తుంది.

ఉప ఎన్నికలపై….

పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్న సమయంలో సిద్ధరామయ్య మీద వ్యతిరేకత బయటపడుతుండటం ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు. అయితే సిద్ధరామయ్య దిద్దుబాటుచర్యలు ప్రారంభించారు. బీజీపీ కూడా ఉప ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అన్న ఆందోళనలో కాంగ్రెస్ నేతలకు ముందుగానే గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న అక్కడి నుంచి వచ్చి రాగానే సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరికొందరు కాంగ్రెస్ ను వీడకుండా సిద్ధరామయ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో విడివిడిగానూ సమావేశమయ్యే అవకాశముంది. మొత్తం మీద సిద్ధూమీద అక్కసును ఇంకా కాంగ్రెస్ నేతలు వెళ్లగక్కుతూనే ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News