తంటాలు పడుతున్నారు కానీ?

శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే రాజకీయంగా రాటు దేలారు. శివసేనకు ఫిక్స్ అయిన ఓటు బ్యాంకు తరలిపోకుండా ఆయన అన్ని విషయాల్లో జాగ్రత్త పడుతున్నారు. [more]

Update: 2020-03-12 16:30 GMT

శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే రాజకీయంగా రాటు దేలారు. శివసేనకు ఫిక్స్ అయిన ఓటు బ్యాంకు తరలిపోకుండా ఆయన అన్ని విషయాల్లో జాగ్రత్త పడుతున్నారు. మహారాష్ట్ర లో మరాఠా నినాదంతో పాటు, హిందుత్వ కార్డుతోనే శివసేన బలోపేతం అయింది. అయితే ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో శివసేనకు ఆ ఓటు బ్యాంకు కొంత దూరం అవుతుందనే వార్తలు వస్తున్నాయి.

ఇబ్బందులు కళ్లెదుటే ఉన్నా….

మహారాష్ట్రలోని విద్యాసంస్థల్లో 5 శాతం రిజర్వేషన్లు ఇంకా అమలు కానప్పటికీ ఆ విషయంలో శివసేన పై ఆ వర్గం కొంత గుర్రుగా ఉందనే చెప్పాలి. శివసేన, బీజేపీ ఒకే సిద్ధాంతం, ఒకే నినాదంతో పనిచేసేవి. అందుకే ఆ జోడీకి మరాఠా ప్రజలు పట్టం కడుతూ వచ్చారు. అయితే గత ఎన్నికల తర్వాత శివసేన బీజేపీకి గుడ్ బై చెప్పింది. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ తో చేతులు కలిపి అధికారాన్ని దక్కించుకోగలిగింది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఎన్సార్సీ, ఎన్పీఆర్, సీఏఏ విషయంలో కాంగ్రెస్, ఎన్సీపీల వత్తిడికి శివసేన తలొగ్గక తప్పని పరిస్థితి ఉంది. అయితే ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నెమ్మదిగా ఒక్కొక్క సమస్యను అధిగమిస్తూ వస్తున్నారు.

బీజేపీ ప్రచారానికి…

బీజేపీ మాత్రం శివసేనపై ముద్ర వేసే పనిలో పడింది. కాంగ్రెస్, ఎన్సీపీల చేతిలో శివసేన కీలుబొమ్మగా మారిందని ప్రచారం చేస్తూ వస్తుంది. ముస్లిం రిజర్వేషన్లు, ఎన్నార్సీ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ శివసేనకు హిందూ ఓటు బ్యాంకును దూరం చేసే పనిలో పడింది. ఇది గమనించిన ఉద్ధవ్ థాక్రే ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతున్నా ప్రజల్లోకి మాత్రం శివసేన హిందూ మనోభావాలకు వ్యతిరేకంగా వెళుతుందన్న అభిప్రాయాలు బలపడే అవకాశముంది.

అందుకే ఓన్ చేసుకునేందుకు….

ఈ నేపథ్యంలోనే అయోధ్యను ఓన్ చేసుకునేందుకు శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే యత్నిస్తున్నారు. తాను సొంతంగా అయోధ్య ట్రస్ట్ కు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. బీజేపీ హిందుత్వాన్ని వదిలేసిందని, శివసేన బీజేపీని మాత్రమే వదిలేసిందని చెప్పుకొచ్చారు. అయోధ్యను సందర్శించిన ఆయన మొక్కులు తీర్చుకున్నారు. ఇలా అయోధ్యను అడ్డం పెట్టుకుని పడిపోతున్న గ్రాఫ్ ను నిలబెట్టుకునేందుకు ఉద్ధవ్ థాక్రే ప్రయత్నిస్తున్నారు. మరి ఉద్ధవ్ థాక్రే ఈ ప్రయత్నాలు ఎంతవరకూ సత్ఫలితాలనిస్తాయో చూడాలి.

Tags:    

Similar News