కక్కలేక….మింగలేక….?

ఒకప్పుడు జిల్లాలో చక్రం తిప్పిన నేతలు. తాము ఏ పార్టీలో ఉన్నా అధిష్టానం సయితం వారికి ఇచ్చే ప్రయారిటీ అంతా ఇంతా కాదు. కాని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ [more]

Update: 2019-07-15 06:30 GMT

ఒకప్పుడు జిల్లాలో చక్రం తిప్పిన నేతలు. తాము ఏ పార్టీలో ఉన్నా అధిష్టానం సయితం వారికి ఇచ్చే ప్రయారిటీ అంతా ఇంతా కాదు. కాని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మాత్రం వీరిని లైట్ గా తీసుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు కొందరు సీనియర్ నేతలకు రుచించడం లేదు. కానీ వారు ఏం చేయలేని పరిస్థితి. ఇటు పార్టీని వీడలేక.. అటు ఉండి ఏం చేయలేక సతమతమవుతున్నారు. సీనియర్ నేతలు ఇంత గుస్సా అవడానికి కారణాలు కూడా లేకపోలేదు.

ఇద్దరు నేతలు…

నెల్లూరు జిల్లాలో సీనియర్ నేతలంటే ముందుగా గుర్తుకు వచ్చేది ఆనం, నల్లపురెడ్డి కుటుంబాలే. ఈ రెండు కుటుంబాలు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కోవూరు నుంచి నల్లపు రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, వెంకటగిరి నుంచి ఆనం రామనారాయణరెడ్డి గెలుపొందారు. అయితే మంత్రివర్గ విస్తరణలో ఇటు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి గాని, ఆనం రామనారాయణరెడ్డికి గాని చోటు దక్కలేదు.

నల్లపురెడ్డి బయటపడకున్నా…..

వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణలో సీనియర్లను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లా లో యువకులైన అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతమ్ లకు మంత్రి పదవులు దక్కాయి. దీంతో సీనియర్ నేతలు యువకుల ఆధిపత్యాన్ని తట్టుకోలేక పోతున్నారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి కొంతకాలం జిల్లా ఇన్ ఛార్జిగా పనిచేశారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై ఆయన కొంత కలత చెందినట్లు సమాచారం.

ఆనం అంచనాకు భిన్నంగా…..

అలాగే ఎన్నికలకు ముందు ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వదలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజానికి ఆనం రాకతో జిల్లాలో పార్టీకి మంచి ఊపు వచ్చిందనే చెప్పాలి. తొలి మంత్రి వర్గ విస్తరణలో ఆనం రామనారాయణ రెడ్డి అనుభవాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినియోగించుకుంటారని భావించారు. కాని ఆనం ను పక్కన పెట్టడంతో ఆయన వర్గం ఇప్పుడు గుస్సాగా ఉంది. పార్టీ కార్యక్రమాలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అయితే ఈ సీనియర్ నేతలిద్దరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి. కక్క లేక మింగలేక వారు కొనసాగడం మినహా ఏమీ చేయలేని స్థితి.

Tags:    

Similar News