సీనియర్లకు ఇక సీన్ లేనట్లే?

ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ నేతలంతా దాదాపు రాజకీయాలకు దూరమయినట్లే కన్పిస్తుంది. ఒకప్పుడు రాష్ట్రంలో తమ హవా కొనసాగించిన వీరు ఇప్పుడు వారి పేర్లను కూడా జనం మర్చిపోయే [more]

Update: 2020-02-29 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ నేతలంతా దాదాపు రాజకీయాలకు దూరమయినట్లే కన్పిస్తుంది. ఒకప్పుడు రాష్ట్రంలో తమ హవా కొనసాగించిన వీరు ఇప్పుడు వారి పేర్లను కూడా జనం మర్చిపోయే పరిస్థితికి తెచ్చుకున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో కావూరి సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు, కనుమూరి బాపిరాజులు సీనియర్ నేతలు. కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం కొనసాగిన వీరు అనేక పదవులను అనుభవించారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత వీరు పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు.

కన్పించని కావూరి…..

మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు దాదాపుగా ఆరేళ్ల నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేసిన కావూరి సాంబశివరావు అప్పట్లో ఏఐసీసీలోనూ ఆయన మాట నెగ్గేది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ను వీడిన కావూరి సాంబశివరావు భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. బీజేపీలో చేరి కావూరి ఐదేళ్లు దాటుతున్నా యాక్టవ్ గా లేరు. అప్పడప్పుడు బయటకు వచ్చే కావూరి సాంబశివరావు ఈ మధ్య కాలంలో అస్సలు కన్పించడం లేదు. టీడీపీతో బీజేపీ తెగదెంపులు చేసుకోవడమే ఇందుకు కారణమంటున్నారు.

భయంతో రాయపాటి…..

మరో మాజీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావుది విచిత్ర పరిస్థితి. ఈయన రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడిగా విజయం సాధించారు. మొన్నటి ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు నరసరావుపేట నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు చేతిలో ఓటమి పాలయ్యారు. దీనికి తోడు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో ఆస్తులు కూడా వేలానికి వచ్చాయి. ఇప్పుడు ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. తన కొడుకు రాయపాటి రంగారావును రాజకీయాల్లోకి తీసుకొచ్చే పనిలోనే ఉన్నారు. ఇక రాయపాటి పోటీ చేయనట్లేనని చెప్పుకోవాలి.

జాడ లేని కనుమూరి….

కనుమూరి బాపిరాజు అనే కంటే మీసాల పెద్దాయన అనడం బెటరేమో. కాంగ్రెస్ పార్టీకి వీర విధేయుడు. కాంగ్రెస్ ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెట్టింది. తర్వాత ఆయన భక్తి కార్యక్రమాలకే పరిమితమయ్యారు. అయితే మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు కనుమూరి బాపిరాజు వయసు మీదపడటంతో సైలెంట్ అయిపోయారంటున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా ఆయన ఇక రాజకీయాల్లో కొనసాగేది అనుమానమే. మొత్తం మీద ఈ ముగ్గురు సీనియర్ నేతల రాజకీయం ఇక ముగిసిపోయినట్లేనని చెప్పుకోవాలి.

Tags:    

Similar News