పట్టు కోసమే… పట్టుదల అంతా….!!

కర్ణాటకలో ఎయిర్ స్ట్రయిక్స్ తో కమలం పార్టీ పుంజుకుందా… ? ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ఈ స్ట్రయిక్స్ తో తాము 22 పార్లమెంటు స్థానాలు [more]

Update: 2019-03-03 16:30 GMT

కర్ణాటకలో ఎయిర్ స్ట్రయిక్స్ తో కమలం పార్టీ పుంజుకుందా… ? ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప ఈ స్ట్రయిక్స్ తో తాము 22 పార్లమెంటు స్థానాలు గెలుస్తామని బహిరంగంగా ప్రకటించడం వివాదస్పదమయినప్పటికీ ఇందులో నిజం లేకపోలేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. గత శాసనసభ ఎన్నికల్లో మాదిరిగానే మెజారిటీ లోక్ సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. అభ్యర్థుల ఎంపిక కూడా ఒక కొలిక్కి వచ్చింది. ఆరు స్థానాల్లో తప్ప మిగిలిని అన్ని చోట్ల దాదాపు బీజేపీ అభ్యర్థులు ఖరారయినట్లే చెప్పాలి.

ఇంకా కొలిక్కి రాలేదే…..

ఇక మిత్రపక్షాలుగా ఉన్న కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ లలో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. ఇప్పటికే రెండుసార్లు ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరిగినా పూర్తిగా ఫలప్రదం కాలేదు. జనతాదళ్ ఎస్ తొలుత తమకు పన్నెండు సీట్లు కావాలని పట్టుబట్టినా చివరకు ఎనిమిది స్థానాలకు దిగివచ్చింది. ఆ పార్టీ అధినేత దేవెగౌడ స్థానాల జాబితాలను కూడా కాంగ్రెస్ నేతలకు ఇచ్చారు. అయితే ఇందులో కొన్ని స్థానాల పట్ల కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఆరుస్థానాలకు మించి జేడీఎస్ కు ఇవ్వలేమని చెబుతోంది.

దేవెగౌడ మాత్రం…..

ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా సీట్ల సర్దుబాటు పూర్తవుతుందని పైకి చెబుతున్నా దళపతి దేవెగౌడ మాత్రం పట్టు వీడటం లేదు. శివమొగ్గ అభ్యర్థిని యడ్యూరప్ప ఇప్పటికే ప్రకటించేశారు. కాంగ్రెస్ కూడా శివమొగ్గ విషయంలో పెద్దగా ఆసక్తి చూపలేదు. అక్కడ యడ్యూరప్ప కు పట్టు ఉండటంతో శివమొగ్గను భారతీయ జనతా పార్టీకే వదిలేయాలని నిర్ణయించుకుంది. శివమొగ్గ, మాండ్య, హాసన్ స్థానాలను మాత్రం కాంగ్రెస్ ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. అయితే మాండ్య విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. సుమలతను జేడీఎస్ అభ్యర్థిగా మాండ్య నుంచి పోటీ చేయించాలన్న ప్రతిపాదన ఉంది.

ససేమిరా అంటున్న…..

మాండ్య, హాసన్, శివమొగ్గ కాకుండా దేవెగౌడ రాయచూరు, బెంగళూరు ఉత్తరం, కోలార్, చిక్ బళ్లాపూర్, తుమకూరు స్థానాలను కోరుతున్నారు. దీంతో మొత్తం ఎనిమిది స్థానాలు దేవెగౌడ కోరుతున్నట్లయింది. అయితే దీనికి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంగీకరించడం లేదు. పట్టున్న స్థానాలనే కోరుకోవాలని, తమకు బలంగా ఓటుబ్యాంకు ఉన్న ప్రాంతాలను కోరుకుంటే అక్కడి క్యాడర్ కు ఏం సమాధానం చెప్పాలన్నది సిద్ధరామయ్య ప్రశ్నం. అయితే ఈ సీట్ల సర్దుబాటు అంశాన్ని ఈ నెల మొదటి వారంలోనే తేల్చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. రాహుల్ గాంధీ స్వయంగా సీట్ల సర్దుబాటు చర్చల్లో పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే కర్ణాటకలో నరేంద్రమోదీ, అమిత్ షాల పర్యటనలు ప్రారంభమయ్యాయి. మరి లోక్ సభఎన్నికల్లో సీట్ల సర్దుబాటు మిత్రపక్షాల మధ్య చిచ్చు పెడుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News