ఇద్దరినీ విడదీస్తేనే సాధ్యమవుతుందా?

అన్నాడీఎంకేను ఎలాగైనా సొంతం చేసుకోవాలని శశికళ భావిస్తున్నారు. ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత నేతలందరిని వరసగా కలుస్తున్నారు. పెద్దగా హడావిడి చేయకుండా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి [more]

Update: 2021-03-04 18:29 GMT

అన్నాడీఎంకేను ఎలాగైనా సొంతం చేసుకోవాలని శశికళ భావిస్తున్నారు. ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత నేతలందరిని వరసగా కలుస్తున్నారు. పెద్దగా హడావిడి చేయకుండా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తనను తొలగించడంపై శశికళ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఒక వైపు న్యాయపరంగా పోరాడుతూనే మరోవైపు అన్నాడీఎంకేలో అధికశాతం మంది నేతలను ఆకట్టుకునే ప్రయత్నం చేయాలని భావిస్తున్నారు. శశికళ తాజాగా చేసిన ప్రకటన కూడా వ్యూహంలో భాగమేనంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాలకు దూరంగా ఉంటేనే బెటరని భావించి ఆ ప్రకటన చేశారు. ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమి తర్వాత శశికళ తిరిగి యాక్టివ్ అవుతారంటున్నారు.

పన్నీర్ ను తమ వద్దకు రప్పించుకుని….

ఇందుకు ముందుగా పన్నీర్ సెల్వం, పళనిస్వామిల మధ్య విభేదాలు తలెత్తితేనే తమ పని సులువవుతుందని శశికళ గ్రహించారు. అందుకు అనుగుణంగానే పావులు కదుపుతున్నారు. ఇద్దరు బలమైన నేతలు కలసి ఉంటే అన్నాడీఎంకేను తన స్వాధీనంలోకి తెచ్చుకోవడం సాధ్యం కాదని శశికళకు తెలియంది కాదు అందుకే ఇద్దరిలో ఒకరిని తమ వైపునకు తిప్పుకుంటే తాము అనుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకుంటామని అంచనా వేస్తున్నారు.

పళనిస్వామిపైనే కోపం….

అయితే శశికళ పళనిస్వామి కంటే పన్నీర్ సెల్వంను తన వద్దకు రప్పించుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. పళనిస్వామి తనను నమ్మించి మోసం చేశారని శశికళ భావిస్తున్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు పళనిస్వామిని ముఖ్యమంత్రిగా చేయడాన్ని ఆమె గుర్తు చేస్తున్నారు. ఆర్థిక భారాన్ని సయితం తాను భరించి రిసార్ట్స్ లో ఎమ్మెల్యేలను ఉంచి పళనిస్వామిని సీఎంను చేస్తే తాను జైలుకు వెళ్లగానే తనను పదవి నుంచి తొలగించారని శశికళ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది.

అందుకేనా ఈ వ్యాఖ్యలు….

అందుకే ఇటీవల అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం చీఫ్ దినకరన్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారంటున్నారు. పన్నీర్ సెల్వం శశికళకు మద్దతు ప్రకటిస్తే తాము ఆయనను సాదరంగా ఆహ్వనిస్తామని దినకరన్ చెప్పారు. జయలలిత జీవించి ఉన్న సమయంలో కూడా అమ్మకు నమ్మిన బంటుగా పనిచేశారని, అయితే ఇప్పుడు రావణాసురుడి కొలువులో పన్నీర్ సెల్వం ఉన్నారని వ్యాఖ్యానించారు. జయలలిత మృతి తర్వాత శశికళ నాయకత్వాన్ని పన్నీర్ సెల్వం వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. అయితే పళనిస్వామి కంటే పన్నీర్ సెల్వం బెటర్ అని శశికళ భావిస్తున్నట్లు తమిళనాట జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే శశికళ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం వ్యూహంలో భాగమేనంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత చిన్నమ్మ మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందంటున్నారు.

Tags:    

Similar News