ఎదురు చూస్తున్నట్లే ఉందిగా

అన్నాడీఎంకే మాజీ నేత శశికళ కోసం ఆ పార్టీ నేతలు ఎదురు చూస్తున్నట్లే కన్పిస్తుంది. అధికార అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించిన సంగతి [more]

Update: 2020-02-01 18:29 GMT

అన్నాడీఎంకే మాజీ నేత శశికళ కోసం ఆ పార్టీ నేతలు ఎదురు చూస్తున్నట్లే కన్పిస్తుంది. అధికార అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించిన సంగతి తెలిసిందే. అయితే శశికళ రాక కోసం అన్నాడీఎంకే నేతలు ఎదురు చూస్తున్నారన్నది మరోసారి స్పష్టమయింది. ఏకంగా తమిళనాడు మంత్రి రాజేంద్ర బాలాజీ శశికళ త్వరగా బయటకు రావాలని ప్రార్థిస్తున్నట్లు అనడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

అన్నాడీఎంకేలో చాలా మంది…..

నిజానికి అన్నాడీఎంకేలో శశికళను నమ్మే వ్యక్తులు అనేక మంది ఉన్నారు. అయితే శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లడం, పన్నీర్ సెల్వం, పళనిస్వామి అన్నాడీఎంకేను చేజిక్కించుకోవడంతో చాలామంది చిన్నమ్మ అభిమానులు అధికార పార్టీలోనే ఉండిపోయారు. మరోవైపు శశికళ మేనల్లుడు దినకరన్ నాయకత్వంపై నమ్మకం లేక కూడా అన్నాడీఎంకేలో కొనసాగుతున్నారన్నది కూడా వాస్తవం.

పార్టీ పగ్గాలు చేపట్టాలని….

ఈ నేపథ్యంలో శశికళ త్వరలోనే జైలు నుంచి విడుదల అవుతారన్న ప్రచారం జరుగుతుంది. టీటీవీ దినకరన్ కూడా శశికళను బయటకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కూడా ప్రకటించారు. దీంతో త్వరలోనే శశికళ బయటకు వస్తుందన్న ప్రచారం తమిళనాడులో జోరుగా సాగుతుంది. శశికళ జైలు నుంచి విడుదలయి బయటకు వస్తే తిరిగి అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టాలనే వారు అధికార పార్టీలో అనేక మంది ఉన్నట్లు తెలుస్తోంది.

నాయకత్వ లేమితోనే…..

మంత్రి రాజేంద్ర బాలాజీ వ్యాఖ్యలు చూస్తే ఇదే అర్థమవుతుంది. తమిళనాడు శాసనసభ ఎన్నికలు 2021లో జరగనున్నాయి. శాసనసభ ఎన్నికలకు పళని, పన్నీర్ సెల్వం నాయకత్వంలో వెళితే ఓటమి తప్పదన్న భావనలో అనేకమంది నేతలు ఉన్నారు. వీరిలో మంత్రులు కూడా ఉన్నారు. శశికళ బయటకు రాగానే వారు టచ్ లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. చరిష్మా కలిగిన నేత పార్టీలో లేకపోవడంతో చాలా మంది అన్నాడీఎంకే నేతలు శశికళ రాక కోసం ఎదురు చూస్తున్నట్లే కన్పిస్తుంది. ఎన్నికలకు ఏడాది ముందు తమిళనాడు అధికార పార్టీలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని విశ్లేషకులు సయితం అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News