అంచనాలు నిజమైతే…?

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సీపీ) అధినేత శరద్ పవార్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల భేటీ జాతీయ రాజకీయాల్లో సంచలనం కలిగించింది. పార్టీ [more]

Update: 2021-06-22 16:30 GMT

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సీపీ) అధినేత శరద్ పవార్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల భేటీ జాతీయ రాజకీయాల్లో సంచలనం కలిగించింది. పార్టీ 22 వ వార్షికోత్సవం సందర్భంగా ముంబయిలోని పవార్ నివాసం ‘సిల్వర్ ఓక్’ లో జరిగిన ఈ సమావేశంపై ఎవరికి తోచిన రీతిలో వారు విశ్లేషించుకున్నారు. దేశ రాజకీయాల్లో దిగ్గజనేత, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త మధ్య మూడు గంటలకు పైగా మధ్యాహ్న విందు జరిగినప్పుడు సహజంగానే జాతీయ, రాజకీయ అంశాలపైచర్చ జరుగుతుంది. మహారాష్ర్ట ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం అనంతరం జరిగిన పవార్- ప్రశాంత్ భేటీ ప్రాధాన్యం కలిగి ఉంటుంది. దీంతో మళ్లీ శివసేన- కమలం పార్టీ మధ్య స్నేహంచి చిగురిస్తుందేమోనన్న అనుమానం పవార్ కు కలగడం సహజం. మహారాష్ర్టలోని మహావికాస్ అగఢీ సర్కారులో శరద్ పవార్ పార్టీ కీలక భాగస్వామి. ఈ నేపథ్యంలో మహారాష్ర్ట రాజకీయ పరిణాామలపై ఇద్దరూ చర్చించి ఉంటారన్న విశ్లేషణ ఉంది. లేదు 2024 ఎన్నికల్లో మోదీని ఎదుర్కొనే వ్యూహంపై ఇద్దరు నేతలూ అభిప్రాయాలు పంచుకున్నారన్న వాదనా ఉంది. ప్రశాంత్ కిషోర్, శరద్ పవార్ వరస భేటీలు చర్చనీయాంశమయ్యాయి. ఈరోజు పవర్ బీజేపీయేతర పార్టీలతో సమావేశం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రధాని అవ్వాలని…..

వచ్చే ఏడాది జులైలో జరిగే రాష్ర్టపతి ఎన్నికల్లో తాను పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై ప్రశాంత్ కిషోర్ తో శరద్ పవార్ చర్చించారన్న వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినపడుతోంది. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో దీనిని తోసిపుచ్చలేం. మూడుసార్లు మహారాష్ర్ట ముఖ్యమంత్రిగా కేంద్రంలో పీవీ హయాంలో రక్షణ మంత్రిగా, మన్మోహన్ హయాంలో వ్యవసాయ మంత్రిగా, బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా) అధ్యక్షుడిగా పనిచేసిన శరద్ పవార్ రాజకీయాల్లో సీనియర్ నేత. 80ఏళ్లు పైబడిన శరద్ పవార్ ఆరు దశబ్దాల నుంచి క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. సుదీర్ఘ అనుభవశాలి అయిన శరద్ పవార్ కు ప్రధాని పీఠం అధిష్టించాలన్న కోరిక చిరకాలంగా ఉంది. 1991లోనే పీవీ బదులు తనకు ప్రధాని పదవి తనను వరిస్తుందని అంచనా వేశారు. చివరకు సోనియాతో విభేదించి కాంగ్రెస్ ను వీడి సొంత పార్టీ ఎన్సీపీ పెట్టుకున్న తరవాత ప్రధాని పదవిపై పూర్తిగా ఆశలు వదులుకున్నారు. ఒక ప్రాంతీయపార్టీ అధినేతకు ప్రధాని పదవి చేపట్టే అవకాశం రాదని అనుభవపూర్వకంగా గ్రహించారు.

సీనియర్ నేతగా…?

దీంతో ఆయన చూపు సర్వోన్నతమైన రాష్ట్రపతి పదవిపై పడింది. వచ్చే ఏడాది జులైలో ఈ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ అత్యున్నత పదవికి విపక్షాల ఏకాభిప్రాయ అభ్యర్థిగా బరిలోకి దిగాలన్నది శరద్ పవార్ ఆలోచన. సమకాలీన రాజకీయాల్లో పవార్ అంతటి సీనియర్ నాయకుడు మరొకరు లేరు. విధానాలు, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా వివిధ పార్టీల నేతలతో ఆయనకు వ్యక్తిగతంగా చక్కటి సంబంధాలు ఉన్నాయి. అంతేకాక పవార్ కు సిద్ధాంతాల బాదరబందీ అంటూ ఏమీ లేదు. ఎవరితో అయినా, ఏ పార్టీతో అయినా ఇట్టే కలసి పోగలరు. ప్రస్తుతానికి రాష్ర్టపతి ఎన్నికల్లో భాజపాను ఓడించడం కష్టమే. కానీ వచ్చే ఏడాది ఫ్రిబ్రవరి, మార్చి నెలల్లో కీలకమైన యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం చూస్తే యూపీ, దాని పక్కనే ఉన్న ఉత్తరాఖండ్ ల్లో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకగలదన్న నమ్మకం బీజేపీకే లేదు. పశ్చిమ రాష్ర్టమైన గోవాలోనూ అదే పరిస్థితి. పంజాబ్ లో అసలు అవకాశమే లేదు. మణిపూర్ ప్రాధాన్యం తక్కువే. ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాకుంటే రాష్ర్టపతి ఎన్నిక బీజేపీకి నల్లేరు మీద నడక కాదు.

బలమైన అభ్యర్థినేనని…..

కొద్ది నెలల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలతో సభలో బీజేపీ బలం తగ్గే అవకాశం ఉంది. శాసనసభ్యేలు, పార్లమెంటు ఉభయ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ దేశ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. ఎలక్టోరల్ కాలేజీలో రమారమి 10, 98, 930 ఓట్లుంటాయి. సగానికి పైగా ఓట్లు తెచ్చుకున్న వారే విజేతగా నిలుస్తారు. తన అంచనాలు నిజమైతే తాను బలమైన అభ్యర్థిని అవుతానని, విజేతగా నిలవడం కూడా అసాధ్యమమీ కాదన్నది శరద్ పవార్ విశ్వాసం. ఇప్పుడు ఈ దిశగానే పావులు కదుపుతున్నారు ఈ బారామతి మరాటా అగ్గిబరాటా.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News