సంచయిత కి ఆ పార్టీయే దిక్కా… ?

మొత్తానికి చిన్న వయసులోనే చిన్నాన్న పూసపాటి అశోక్ గజపతిరాజుకు చుక్కలు చూపించిన యువ మహిళా నేతగా సంచయిత గుర్తింపు తెచ్చుకున్నారు. కోర్టు తీర్పు దాకా అంటే ఏడాదిన్నర [more]

Update: 2021-06-16 08:00 GMT

మొత్తానికి చిన్న వయసులోనే చిన్నాన్న పూసపాటి అశోక్ గజపతిరాజుకు చుక్కలు చూపించిన యువ మహిళా నేతగా సంచయిత గుర్తింపు తెచ్చుకున్నారు. కోర్టు తీర్పు దాకా అంటే ఏడాదిన్నర పాటు ఆమె మాన్సాస్ వంటి ప్రతిష్టాత్మకమైన సంస్థకు చైర్ పర్సన్ గా పనిచేయడం అంటే గొప్ప విషయమే. అదే సమయంలో సంచయిత ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం సింహాచలం దేవస్థానం చైర్ పర్సన్ గా కూడా వ్యవహ‌రించారు. ఇపుడు ఆ రెండు పదవులూ ఆమెకు లేకుండా పోయాయి. న్యాయ స్థానాలలో అప్పీలు వెళ్తామంటున్నా తిరిగి ఆ పదవులు సంచయితకు దక్కుతాయా అన్న ప్రశ్న అయితే ఉదయిస్తోంది.

బీజేపీకి బై బై….

ఇదిలా ఉండగా గత సార్వత్రిక ఎన్నికలను ముందు సంచయిత ఢిల్లీలో బీజేపీ పెద్దల సమక్షంలో పార్టీలో చేరారు. ఆ తరువాత ఆమె బీజేపీలో పెద్దగా యాక్టివ్ గా లేరు కానీ, ఈ లోగా ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి రావడంతో సంచయిత తనదైన రాజకీయం చూపించి మొత్తానికి తాను అనుకున్న పదవులల్లో కొన్నాళ్ళ పాటు అయినా కూర్చోగలిగారు. ఒక విధంగా సంచయిత ఒంటి చేత్తో చక్రం తిప్పారనే చెప్పాలి. ఈ నేపధ్యంలోనే ఆమె బీజేపీకి బాగా దూరమైయ్యారు. సంచయితను ఆ పదవిలో కూర్చోబెట్టిన వైసీపీ వైఖరిని విమర్శిస్తూ బీజేపీ నేతలు అప్పట్లో దారుణమైన విమర్శలు చేశారు. అలా సంచయిత కాషాయ కండువా కప్పుకున్నా ఆ పార్టీ మద్దతు దక్కలేదు.

వైసీపీలోకేనా…?

ఈ నేపధ్యంలో సంచయితకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే వైసీపీ గూటికి చేరడమే అంటున్నారు. ఆమె వైసీపీలో చేరడం ద్వారా రాజకీయంగా ముందుకు సాగాలని భావిస్తున్నారట. ఆమెకు వైసీపీ మంచి ప్రోత్సాహం ఇచ్చినందువల్ల ఆ పార్టీ నుంచే తన భవిష్యత్తుని వెతుక్కోవాలని కూడా చూస్తున్నారని టాక్. ఇదే నేపధ్యంలో సంచయిత కనుక వైసీపీలో చేరితే తీసుకోవడానికి ఆ పార్టీ నేతలు సుముఖంగా ఉన్నారని అంటున్నారు. విజయనగరం జిల్లాలో పూసపాటి రాజుల ప్రాబల్యం ఎక్కువ. అందువల్ల వారి కుటుంబం నుంచి సంచయితను ప్రొజెక్ట్ చేయడం ద్వారా అశోక్ కి ఆయన వారసురాలు అదితికి చెక్ పెట్టాలన్నది వైసీపీ ఆలొచనట.

సవాలేనా …?

ఇక రాజకీయాలోకి ప్రత్యక్షంగా వచ్చి వైసీపీ తరఫున సంచయిత జనంలో తిరిగితే మాత్రం బాబాయ్ అశోక్ కి సవాల్ గానే ఉంటుంది అంటున్నారు. సంచయిత మాన్సాస్ కి మాజీ ప్రెసిడెంట్ గా ఒక హోదాను సంపాదించుకున్నారు. అలాగే ఎవరు కాదన్నా పూసపాటి వారసురాలిగానే ఆమె ముద్రపడ్డారు. దాంతో అటు తన వంశానికి ఉన్న పవర్ తో పాటు, ఇటు వైసీపీ పొలిటికల్ పవర్ తో బాబాయ్ మీద రాజకీయ సమరం చేయడానికే సంచయిత మొగ్గు చూపుతారు అంటున్నారు. మరి ఆమె విజయనగరం శాసనసభ సీటుని కనుక కోరుకుంటే ఇచ్చేందుకు వైసీపీ సిద్ధమేనా అన్నది కూడా చర్చగా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Tags:    

Similar News