సంచయితకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా…?

విజయనగరం పూసపాటి వారి సంస్థాధీశురాలిగా మొత్తానికి సంచయిత గజపతిరాజుని రెడీ చేసి పెట్టారు. టీడీపీయేతర రాజకీయానికి ఆమెను ఆయుధంగా చేసుకోవాలని వైసీపీ గట్టిగానే ప్లాన్ వేస్తోంది. గత [more]

Update: 2020-11-27 05:00 GMT

విజయనగరం పూసపాటి వారి సంస్థాధీశురాలిగా మొత్తానికి సంచయిత గజపతిరాజుని రెడీ చేసి పెట్టారు. టీడీపీయేతర రాజకీయానికి ఆమెను ఆయుధంగా చేసుకోవాలని వైసీపీ గట్టిగానే ప్లాన్ వేస్తోంది. గత నాలుగు దశాబ్దాలుగా విజయనగరం రాజకీయాలను టీడీపీ ప్రభావితం చేయడానికి కారణం పూసపాటి వంశీకులే. అశోక్ గజపతిరాజు చంద్రబాబుకు కుడి భుజంగా ఉంటూ జిల్లాను ఆ వైపుగా తిప్పారు. దాంతో బాబుకు ఉత్తరాంధ్రా కంచుకోటగా మారింది. అయితే ఇపుడు జగన్ దానికి బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతున్నారు.

ఆది నుంచి అలా….

నిజానికి పూసపాటి వారి వంశంలో పీవీజీ రాజు పూర్తిగా కాంగ్రెస్ మద్దతుదారుగా కడదాకా నిలిచారు. ఆయన మొదట్లో సోషలిస్ట్ నేతగా ఉండేవారు. తరువాత కాంగ్రెస్ జెండా పట్టారు. జాతీయ భావాలు ఉన్న పీవీజీ రాజు ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకం. ఆయన పెద్ద కుమారుడు ఆనందగజపతి రాజు కూడా టీడీపీలో మొదట్లో చేరినా అక్కడ నిరంకుశ విధానాలకు ఇమడలేకపోయారు. సంకుచితత్వం కలిగిన ప్రాంతీయ పార్టీల కంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ మేలు అని అందులో చేరారు. తరువాత కాలంలో ఆయన రాజకీయాలనే పూర్తిగా వదిలేశారు. ఇక ఆయన సోదరుడు అశోక్ గజపతిరాజు మాత్రం టీడీపీతోనే తన రాజకీయ జీవితం అంటూ గడిపారు.

ఆమెతోనే అంతా ….

డెబ్బయ్యేళ్ళకు పైబడిన అశోక్ ఇక మీదట క్రియాశీల రాజకీయాలకు దూరం అని చెప్పేశారు. అయితే ఆయన తాపత్రయం అంతా కూడా కూతురు అతిధి గజపతిరాజు కోసమే. ఆమెనే తన వారసురాలిగా ముందుకు తెచ్చారు. అయితే ఆమెకు పోటీగా ఇపుడు సంచయిత రెడీ అవుతోంది. సంచయితది దూకుడు రాజకీయం. పైగా ఆమె బాబాయ్ అశోక్ ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. దాంతో ఆమెను వైసీపీ ఫోకస్ చేస్తోంది. ఆమె పూసపాటి వారి మూడవ తరం సిసలైన ప్రతినిధిగా కూడా జనాలకు చూపిస్తోంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని మాన్సాస్ కి చెందిన 104 దేవాలయాలకు ఆమెను చైర్ పర్సన్ గా నియమిస్తూ వైసీపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో మొత్తం అశోక్ చేతుల నుంచి సంస్థానాధికారాలు జారిపోయాయి.

పోటీకి రెడీనా…?

బీజేపీ సభ్యురాలిగా సంచయిత చెబుతున్నా ఆ పార్టీ ఆమెను అసలు చేరదీయడంలేదు. పైగా టీడీపీ పాటనే పాడుతోంది. అశోక్ కి అన్యాయం జరుగుతోందని బీజేపీ కూడా అంటోంది. దాంతో సంచయిత ఇపుడు వైసీపీ మద్దతుతోనే ముందుకు సాగుతున్నారు. రానున్న రోజుల్లో కూడా ఆమెను విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా పార్టీ తరఫున పోటీకి దించాలని ప్లాన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. విజయన‌గరం సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పేశారు. ఇక ఆయన కుమార్తె శ్రావణిని రాజకీయ వారసురాలిగా చెబుతున్నారు కానీ ఆమెతో పోలిస్తే సంచయిత బెటర్ క్యాండిడేట్ అవుతారని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా సంచయితకే ఓటు వేస్తున్నారు. మొత్తానికి సంచయిత ముందు ఒక బిగ్ టాస్క్ ఉంది. దాన్ని కనుక ఆమె పూర్తి చేస్తే విజయనగరం కోటలో పాగా వేసినట్లే.

Tags:    

Similar News