కూత ఘనంగానే ఉందే ?

రాజకీయంగా తలపండిన వారితోనే ఆమె ఢీ కొంటోంది. అలా ఢీ కొడితేనే సామర్ధ్యం రుజువు అవుతుంది. మరిన్ని కొత్త పట్లు కూడా తెలుస్తాయి. ఇవన్నీ ఇలా ఉంటే [more]

Update: 2020-07-20 14:30 GMT

రాజకీయంగా తలపండిన వారితోనే ఆమె ఢీ కొంటోంది. అలా ఢీ కొడితేనే సామర్ధ్యం రుజువు అవుతుంది. మరిన్ని కొత్త పట్లు కూడా తెలుస్తాయి. ఇవన్నీ ఇలా ఉంటే విజయనగరం పూసపాటి సంస్థానానికి చెందిన కొత్త పెత్తందారు, మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు ఏకంగా చంద్రబాబుకే కౌంటర్లు ఇస్తున్నారు. బాబు తన మనిషి అయినా అశోక్ గజపతిరాజుకు మద్దతుగా వస్తూంటే ఇక్కడ మీకేం పని అంటూ సంచయిత గర్జించడం ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది. గజపతుల వంశంలో ఉన్న వివాదాలు, గొడవలు ఏవైనా మేము చూసుకుంటాం, మా కుటుంబం వ్యవహారాల్లో మీ జోక్యమేంటి బాబు గారూ అంటూ సంచయిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేసరికి తెలుగు వల్లభుడికే షాక్ తగిలిందిట.

నేనున్నాను….

విజయనగరం పూసపాటి సంస్థానం అంటే మీ సహచర నాయకుడు అశోక్ గజపతిరాజు ఒక్కరే ఉన్నారని అనుకోమాకండి. అసలైన వారసురాలిని నేనున్నాను అంటూ బాబుకే సంచయిత కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తున్నారు. మా బాబాయి మొత్తం పూసపాటి వంశానికి హోల్ సేల్ గా తానే వారసుడిని అని మీకు చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారు. ఇంకా వారసులు ఉన్నారు. మూడవ తరంలో చట్టబధ్ధమైన వారసురాలిగా తాను మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా ఉన్నానని సంచయిత చెప్పుకొచ్చారు. తాను పీవీజీ రాజుకు మనవరాలినని, అలాగే ఆయన పెద్ద కొడుకు ఆనందగజపతి రాజు పెద్ద కుమార్తెనని కూడా సంచయిత అంటున్నారు. తాను చట్టపరమైన వారసురాలినని, ఇందులో బాబుకు వచ్చిన అభ్యంతరం ఏంటని కూడా ఆమె నిలదీస్తున్నారు.

వివక్ష కామెంట్స్….

సమాజంలో లింగ వివక్ష ఉంది. ఆడవారు, మగవారు అంటూ విభేదాలు చూపిస్తారు. రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు లాంటి వారు గబుక్కున ఆడవారి మీదకు వివాదాలకు రాలేరు. పైగా ఆడవారు కూడా సమాజంలో సమానమేనని చెప్పే వాదన వినిపిస్తారు. అటువంటిది ఒక యువతి మీద దాడి చేయడానికి బాబు ఎలా ముందుకు వస్తున్నారు అంటూ సంచయిత వేసిన ప్రశ్న చంద్రబాబు రాజకీయాల కూసాలు కదిలిపోయేలా ఉందని అంటున్నారు. సంచయిత లాజిక్ తో బాబు ఇకనైనా ఆమె గురించి మాట్లాడడం మానేయాలేమో. తాను ఆడపిల్లను అని ఏ పదవికీ అర్హురాలిని కానని తన బాబాయి అశోక్ లింగ వివక్ష చూపిస్తున్నారు, మరి మీకు కూడా అలాటి వివక్ష ఏమైనా ఉందా, ఆడవారు పదవులు తీసుకోకూడదా బాబు గారూ అంటూ సంచయిత వేస్తున్న ప్రశ్నలు సమాజంలోని ఆలోచనాపరులను కూడా కదిలించేలా ఉన్నాయి. అదే సమయంలో చంద్రబాబు అశోక్ కి మద్దతుగా వస్తూ మహిళల హక్కులను అడ్డుకుంటున్నారన్న సౌండ్ వచ్చేలా సంచయిత లేపిన ఈ చర్చకు బహుశా బాబు కూడా అవాక్కు కావాల్సిందే.

కొరుకుడు పడడంలేదా…?

నిజానికి 2016లో ఆనందగజపతి రాజు మరణించిన తరువాత చంద్రబాబు సర్కార్ హడావుడిగా విజయనగరం ఆస్తులు వ్యవహారాల్లో జోక్యం చేసుకుని అశోక్ కి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంది. మాన్సాస్ ట్రస్ట్ ని చైర్మన్ గా అశోక్ ని నియమించడం వరకూ ఒకే కానీ అందులో ఎక్కడో విజయవాడకు చెందిన చెరుకూరి కుటుంబరావు, హెల్త్ వర్శిటీ మాజీ వీసీ ఐవీ రావు లాంటి వారు ఎలా మెంబర్స్ గా నియమించబడ్డారో బాబే జవాబు చెప్పాలి. అదే సమయంలో అశోక్ కూతురు అతిధిని మాత్రమే సభ్యురాలిగా చేసి కనీసం సంచయితను కూడా ఆనాడు పట్టించులేదు. నాడే బాబు సరిగ్గా వ్యవహరించి ఉంటే కధ ఇంతవరకూ రాదు కదా. ఇదిలా ఉండగా గజపతులు అంటే కేవలం అశోక్ మాత్రమే కాదని, తానూ వారసురాలినేనని, తాను చైర్ పర్సన్ గా ఉంటే గజపతుల హక్కులకు వచ్చిన నష్టమేంటని సంచయిత ప్రశ్నలు సంధిస్తున్నారు. బాబు రాజకీయాన్ని పురుషాధిక్యతను కూడా సంచయిత బయటపెడుతున్నారు. మరి బాబు ఇకనైనా ఈ ట్రస్ట్ గురించి విమర్శలు తగ్గిస్తే బాగుంటుందేమో.

Tags:    

Similar News