భీమిలీలో హరి కిరి… కిరి?

సబ్బం హరి. మాజీ ఎంపీగా విశాఖ వాసులకు తెలుసు. ఆయన పాతికేళ్ల క్రితం విశాఖ మేయర్ గా కూడా పనిచేశారు. రాజకీయ విశ్లేషకుడిగా కూడా అవతారం ఎత్తిన [more]

Update: 2021-02-22 14:30 GMT

సబ్బం హరి. మాజీ ఎంపీగా విశాఖ వాసులకు తెలుసు. ఆయన పాతికేళ్ల క్రితం విశాఖ మేయర్ గా కూడా పనిచేశారు. రాజకీయ విశ్లేషకుడిగా కూడా అవతారం ఎత్తిన హరి జోస్యాలు కూడా బాగానే చెబుతారు. తనకు తాను అధికుడిని అని భావించుకుంటారని కూడా ఆయన మీద విమర్శలు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పని అయిపోతే వైసీపీలో చేరి అక్కడ కూడా ఇమడలేని సబ్బం హరికి 2019 ఎన్నికల్లో చంద్రబాబు భీమిలీ వంటి స్ట్రాంగ్ బేస్ ఉన్న చోట ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిలబెట్టారు. అయితే సరైన ప్రచారం చేసుకోక పోవడం వల్లనే సబ్బం హరి ఓడిపోయారని ఇప్పటికీ భీమిలీ తమ్ముళ్ళు చెబుతారు.

బతిమాలితేనే అలా….

ఇక సబ్బం హరి మాటలు కోటలు దాటుతాయని కూడా విమర్శలు ఉన్నాయి. ఆయన తాజాగా భీమిలీ టీడీపీ నేతల మీటింగులో మాట్లాడుతూ తాను చంద్రబాబు బతిమాలితేనే గత ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పడంతో షాక్ తినడం తమ్ముళ్ళ వంతు అయిందిట. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇష్టం లేకపోయినా బలవంతంగా పోటీ చేశానని ఆయన అంటున్నారట. మరి అంత బాధ ఉన్నపుడు వద్దు అనేస్తే ఆ టికెట్ మరొకరికి దక్కేది కదా అని తమ్ముళ్ల వాదనగా ఉంది. ఇక సబ్బం హరి పేరుకు భీమిలీ వాసిగా ఉన్న ఆయన నివాసం, రాజకీయం అంతా కూడా విశాఖలోనే సాగుతోంది. అయినా సబ్బం హరిని చంద్రబాబు భీమిలీ పార్టీ ఇంచార్జిగా నియమించారు.

వద్దంటే వద్దు …..

ఏ పున్నమికో అమావాస్యకో సబ్బం హరి చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వస్తున్నారు అన్నది భీమిలీ తమ్ముళ్ల ప్రధాన ఆరోపణ. సబ్బం హరి తనకు భీమిలీ బాధ్యతలు బాధలు ఇష్టం లేదని చెప్పకనే చెబుతున్నారు. ఆయనను పట్టుకుని ఇంచార్జి వంటి కీలకమైన పదవిలో కూర్చోబెడితే పార్టీ బాగుపడేది ఎపుడు, ఎలా అని తమ్ముళ్ళు అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక గతంలో భీమిలీ టికెట్ కోసం పోరాడి రెబెల్ గా కూడా ఎమ్మెల్యే బరిలో నిలిచిన మాజీ ఎంపీపీ, బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన కోరాడ రాజబాబుకు ఇంచార్జి పదవిని ఇవ్వాలని తమ్ముళ్ళు కోరుతున్నారుట. భీమిలీలో ఆ సామాజికవర్గం జనాభా ఎక్కువగా ఉందని, వరసగా నాలుగు ఎన్నికల నుంచి వారే గెలుస్తున్నారని కూడా చెబుతున్నారు.

తమ్ముళ్ళ పోటాపోటీ …?

ఇక విశాఖ సౌత్ నుంచి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి చేరిపోయారు. దాంతో మత్య్సకార వర్గం ఎక్కువగా ఉన్న భీమిలీ నుంచి ఇంచార్జిగా వారికే చాన్స్ ఇవ్వాలని కూడా మరో డిమాండ్ వస్తోందిట. భీమిలీ పట్టణ టీడీపీ ప్రెసిడెంట్ గంటా నూకరాజును ఈ పదవిలో నియమించాలని కూడా మరో వైపు కోరుతున్నారు. ఇలా భీమిలీలో ఇంచార్జి పదవిని యువకుడికీ, బలమైన సామాజిక వర్గం వారికి ఇస్తే బాగుంటుందని తమ్ముళ్ళు సూచిస్తున్నారు. సబ్బం హరిని మాత్రం కొనసాగించవద్దు అని విన్నపాలే పెద్ద ఎత్తున వెళ్తున్నాయట. మరి బాబు కంటే తానే ఎక్కువ అన్నట్లుగా సబ్బం హరి చేస్తున్న రుబాబుని భరించలేమని కూడా అంటున్నారుట. చూడాలి మరి హరికిరిని బాబు ఎలా పరిష్కరిస్తారో.

Tags:    

Similar News