వారు రగలిపోతున్నారుగా

ఎంత కాదనుకున్నా కుల రాజకీయాలను కాదనలేం. వాటితోపాటే అన్నీ జరుగుతున్నాయి. ఉమ్మడి ఏపీలో రెడ్లకు ఉన్న రాజకీయ ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. కాంగ్రెస్ నీడలో ఉండి [more]

Update: 2019-07-11 02:00 GMT

ఎంత కాదనుకున్నా కుల రాజకీయాలను కాదనలేం. వాటితోపాటే అన్నీ జరుగుతున్నాయి. ఉమ్మడి ఏపీలో రెడ్లకు ఉన్న రాజకీయ ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. కాంగ్రెస్ నీడలో ఉండి కొన్ని దశాబ్దాలు, ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా ఓ స్థాయిలో చక్రం తిప్పారు. నిజానికి కాంగ్రెస్ కూడా రెడ్లను నమ్మి పార్టీ వారి చేతిలో పెట్టేసింది. ఎపుడైతే వైఎస్సార్ దుర్మరణం పాలు అయ్యారో, జగన్ ధిక్కార స్వరం వినిపించారో అప్పటి నుంచి కాంగ్రెస్ హై కమాండ్ కి రెడ్లకు చెడింది. అప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం ని చేసినా మొత్తం పార్టీని చెప్పుచేతల్లో ఉంచుకుంది. అదే సమయంలో పార్టీలో మిగిలిన సామాజిక వర్గాలను కూడా ముందుకు తీసుకువచ్చింది. ఈ పరిణామాలు ఇలా ఉండగానే ఉమ్మడి ఏపీలో రెడ్లను రాజకీయంగా తొక్కాలంటే విభజన ఒక్కటే మార్గమని కాంగ్రెస్ వ్యూహకర్తలు తలపోసి అడ్డగోలుగా రెండు ముక్కలు కొట్టేశారు. దాని వల్ల రాజకీయంగా బాగా నష్టపోయిన సామాజిక వర్గం ఉందంటే వారు రెడ్లు మాత్రమే. అక్కడా ఇక్కడా అధికారం లేక పదేళ్ళు పాట్లు పడ్డారు.

జగన్ కి వెన్ను దన్నుగా…..

రాయలసీమలోని నాలుగు జిల్లాలు, తెలంగాణాలో కొన్ని జిల్లాలలలో రాజకీయాలను శాసిస్తూ రెడ్లు బాగా పాతుకుపోయారు. ఇలా ముక్కలు చేయడం వల్ల రాజకీయంగా దెబ్బ తినాల్సి వచ్చింది. ఆ కసితోనే తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఏపీలో రెడ్లు జగన్ ని పూర్తిగా సమర్ధించుకుంటూ వచ్చారు. ఒకటి రెండేళ్ళు కాదు. పదేళ్ల పాటు జగన్ వెంట నడిచారు. అష్టకష్టాలు పడ్డారు. అధికారం చేతిలో లేదు. మరో వైపు టీడీపీ వేధింపులు, వ్యాపారాలు కూడా సాఫీగా సాగలేదు. అయినా జగన్ ని సీఎం చేసుకోవడం ద్వారా మళ్ళీ పూర్వ వైభవం పొందాలని పట్టుదలగా పనిచేశారు. అనుకున్నట్లుగా జగన్ సీఎం అయ్యారు. కానీ రెడ్లకు దక్కిందేంటి.

అధికారంలో వాటా లేదుగా…

ఇక జగన్ రెడ్డి సీఎం అయ్యాడన్న ఒకే ఒక సంతృప్తి తప్ప ఇపుడు రెడ్లకు మిగిలింది ఏదీ లేదు. మొత్తం 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలలో రెడ్లు 50 మందికి పైగా గెలిచారు. కనీసంగా ఎనిమిది నుంచి పది మంది వరకూ మంత్రులు తమ వారు ఉంటారని లెక్కలేశారు. ఇక మిగిలిన నామినేటెడ్ పదవులు, ఇతర‌త్రా అధికారంతో గతంలోలా హవా చలాయించవచ్చునని సంబరపడ్డారు. కానీ జగన్ తన రాజకీయ భవిష్యత్తు కోసం రెడ్లను పూర్తిగా పక్కన పెట్టారు. నలుగురుకి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారు. నామినేటెడ్ పదవులు కూడా సామాజిక న్యాయం అంటున్నారు. దీంతో రెడ్లు రగిలిపోతున్నారు.

నామమాత్రమేనా…..

పేరుకు రెడ్డి ప్రభుత్వమని, కానీ తమకు దక్కిదేంటి అన్న బాధ వారిని వెంటాడుతోంది. ఈ నేపధ్యంలో ఇపుడు రెడ్లు రగులుతున్నారని టాక్. ఆ పార్టీ తరఫున గట్టిగా గొంతు వినిపించిన భూమన కరుణాకరరెడ్డి, రోజా రెడ్డి వంటి వారు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. కర్నూలు, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం రెడ్లు ఇపుడు పూర్తిగా వైరాగ్యంలో ఉన్నారు. జగన్ సామాజిక న్యాయం తమ గొంతు కోసిందని మధన పడుతున్నారు. మరో వైపు కమ్మ సామాజిక వర్గం అయిదేళ్ళ పాటు హవా చలాయిస్తే తాము అధికారంలోకి వచ్చి కూడా ఏం బావుకున్నామని బావురుమంటున్నారు. ఇది ఎటువైపు దారి తీస్తుందోనని వైసీపీ హై కమాండ్ లో కలవరం మొదలైంది.

Tags:    

Similar News