ఇంతకీ విజేతలు ఎవరంటే?

సరిహద్దు రాష్ర్టమైన జమ్ము కాశ్మీర్ లో ఇటీవల జరిగిన జిల్లా అభివద్ధి మండళ్ల (డీడీసీ- డిస్ట్రిక్ డెవలప్ మెంట్ కౌన్సిల్) ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించాయి. కాశ్మీర్ [more]

Update: 2021-01-10 16:30 GMT

సరిహద్దు రాష్ర్టమైన జమ్ము కాశ్మీర్ లో ఇటీవల జరిగిన జిల్లా అభివద్ధి మండళ్ల (డీడీసీ- డిస్ట్రిక్ డెవలప్ మెంట్ కౌన్సిల్) ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగించాయి. కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కలిగించే 370వ అధికరణ రద్దు తరవాత తొలిసారి జరిగిన ఈ ఎన్నికలను పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తం 8 దశల్లో నవంబరు 28న ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ డిసెంబరు 19తో ముగిసింది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీపీ), సీపీఎం ఇతర పార్టీలు పాల్గొన్నాయి. గెలుపోటములను పక్కనపెడితే ఈ ఎన్నికలు రాష్ర్టచరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాయనడంలో సందేహం లేదు.

తొలిసారి జరిగిన….

తొలిసారిగా పోలీసు తుపాకుల చప్పుళ్లు, కిడ్నాప్ లు, హత్యలు, రిగ్గింగ్ వంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడం విశేషం. హైదరాబాద్ వంటి నగరాల్లో అతి తక్కువ పోలింగ్ నమోదైన నేపథ్యంలో కాశ్మీర్ ప్రజలు ఓటేయడానికి బారులు తీరడం ఆహ్వానించదగ్గ పరిణామం. కాశ్మీర్ లోయలో ఒకింత తగ్గినప్పటికీ మొత్తంగా 51 శాతం మంది ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోవడం వారి ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం. డీడీసీ ఎన్నికల కోసం ప్రతి జిల్లాను 14 నియోజకవర్గాలుగా విభజించారు. ఇలా మొత్తం 20 జిల్లాల్లో 280 నియోజకవర్గాలుగా ఏర్పాటయ్యాయి. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా నాయకత్వంలో ఏడు పార్టీల కూటమి పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కార్ డిక్లరేషన్ (పీఏజీడీ) పేరుతో బరిలోకి దిగి 110 స్థానాలను గెలుచుకుంది. కూటమిలో మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీపీ), సీపీఎం, ఇతర చిన్నాచితకా పార్టీలు ఉన్నాయి. గుప్కార్ అంటే రాజధాని శ్రీనగర్ లోని ఫరూక్ అధికార నివాస ప్రాంతం.

అతి పెద్ద పార్టీగా….

370 అధికరణ రద్దును వ్యతిరేకిస్తూ ఫరూక్, ముఫ్తీ ఇతర పార్టీలు గుపార్క్ లో సమావేశమై తీర్మానం చేశాయి. దీంతో ఆయా పార్టీలన్నీ కలిసి పీఏజీడీ పేరిట పోటీచేశాయి. వాస్తవానికి ఫరూక్, ముఫ్తీ పార్టీలు రాష్ర్ట రాజకీయాల్లో ఉప్పూ నిప్పూగా ఉంటాయి. ఒకరి పొడ మరొకరికి గిట్టదు. కానీ 370 అధికరణ అంశం వాటిని ఏకం చేశాయి. ఫరూక్ పార్టీ 67, పీడీపీ 27, సీపీఎం 5 గెలుచుకున్నాయి. ఇతర చిన్న పార్టీలతో కలుపుకొని పీఏజీఏ 110 స్థానాలు సాధించి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. బీజేపీ 75 స్థానాలతో ఏకైక అతిపెద్ద పార్టీగా నిలిచింది. జమ్ములో కమలం పార్టీ సింహభాగం సీట్లను కైవశం చేసుకుంది. అంతేకాక కాశ్మీర్ లోయలోనూ మూడు సీట్లు సాధించి తొలిసారిగా ఖాతా తెరిచింది. హస్తం పార్టీ కేవలం 26 స్థానాలతో పేలవమైన పనితీరును కనబరిచింది. స్వతంత్రులు 50 సీట్లు కైవశం చేసుకోవడం ఈ ఎన్నికల ప్రత్యేకతగా పేర్కొనవచ్చు.

వారే అసలైన విజేతలు….

278 సీట్ల ఫలితాలు మాత్రమే వెల్లడయ్యాయి. మరో రెండింటి ఫలితాలు నిలిపివేశారు. పీఏజీడీ కు 3.94 లక్షలు, బీజేపీకి 4.87 లక్షల ఓట్లు రావడం గమనార్హం. ఫలితాలను ఏ పార్టీకి ఆ పార్టీ తమ విజయంగా భాష్యం చెప్పుకోవడం గమనార్హం. 110 సీట్లతో తమదే పైచేయి అని పీఏజీడీ చెబుతున్నప్పటికీ అదివాస్తవం కాదు. పీఏజీడీలోని ప్రధాన పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ త్కాత్కాలిక రాజకీయ అవసరాల కోసం ఏకమయ్యాయి. రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీలు ఎంతమాత్రం కలసి పోటీ చేసే అవకాశం లేదు. దశాబ్దాలుగా ఈ రెండు పార్టీలు బద్ధ విరోధులు. 75 సీట్లతో తామే విజేతలమని కమలం పార్టీ హడావిడి చేస్తోంది. మొత్తం 280 సీట్లలో కనీసం సగం కూడా గెలుచుకోకుండా గొప్పలకు పోవడం హాస్యాస్పదం. 370 వ అధికరణ రద్దుకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చారని పీఏజీడీ కూటమి చెప్పడం ఎంత వాస్తవ విరుద్ధమో, ఆ అధికరణ రద్దుకు అనుకూలంగా తీర్పిచ్చారని కమల నాథులు చెప్పుకోవడం కూడా అంతే విచిత్రం. ప్రశాంత వాతావరణంలో 51 శాతానికి పైగా పోలింగ్ లో పాల్గొన్న కాశ్మీరీలే అసలైన విజేతలు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News